పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్ యుగంధర్ ఇక లేరు
ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల తండ్రి
పాలనలో తనదైన ప్రత్యేక ముద్ర
స్వగ్రామం అభివృద్ధికి ఎంతో కృషి
మన చంద్రబాబు తరపున ఘన నివాళి
పేదల పక్షపాతి, విశ్రాంత సీనియర్ ఐఏఎస్ అధికారి బీఎన్ యుగంధర్ (80) కన్నుమూశారు. ఆయన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల తండ్రి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యుగంధర్ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. 1962 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన యుగంధర్ అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. నిజాయతీ పరుడిగా, పేద ప్రజల శ్రేయస్సు కోసమే అనునిత్యం పరితపించి పనిచేసిన అధికారిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
పాలనలో తనదైన ప్రత్యేక ముద్ర
మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో (2004-2009) ప్రణాళికా సంఘం సభ్యులుగా ఉన్న ఆయన.. ప్రధాని కార్యదర్శిగానూ, ముస్సోరిలోని లాల్బహుదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీకి డైరెక్టర్గానూ సేవలందించారు. సమర్థమైన, అత్యుత్తమ ప్రజా సేవకుడైన ఐఏఎస్ అధికారిగా యుగంధర్కు మంచి పేరుంది. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలోనూ పనిచేసిన యుగంధర్ గ్రామీణాభివృద్ధి శాఖలో కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సమయంలో వాటర్షెడ్ల అభివృద్ధికి రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్రం నుంచే నేరుగా జిల్లాలకే నిధులు వచ్చేలా మార్గదర్శకాలు రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
నిరాడంబరతకు నిలువెత్తు దర్పణం
నిరాడంబర జీవితం గడుపుతూ ప్రతి నిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం పరితపించిన సీనియర్ ఐఏఎస్ అధికారులు బీఎన్ యుగంధర్, కేఆర్ వేణుగోపాల్ మంచి స్నేహితులు. పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేసిన ఈ ఇద్దరు మిత్రులంటే పీవీకి కూడా ప్రత్యేకమైన అభిమానం ఉండేది. అందుకే ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో యుగంధర్కు గ్రామీణాభివృద్ధిశాఖ, కేఆర్ వేణుగోపాల్కు సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించగా.. ఇద్దరూ అనేక కీలక సంస్కరణలు తీసుకొచ్చారు.
సత్య నాదెళ్ల పెళ్లికి పీవీని కూడా పిలవలేదట!
సత్య నాదెళ్లకు కేఆర్ వేణుగోపాల్ కుమార్తె అనుపమను ఇచ్చి వివాహం చేయడంతో ఈ మిత్రులిద్దరూ వియ్యంకులయ్యారు. ఇంకో విశేషమేంటంటే.. పీవీ నర్సింహారావుతో ఇద్దరికీ ఎంతో మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ సత్య నాదెళ్ల, అనుపమ వివాహానికి ఆయన్ను పిలవలేదట. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా ఎంతో సాదాసీదాగా సత్య నాదెళ్ల వివాహం చేశారు. దీంతో విషయం తెలుసుకున్న పీవీ నర్సింహారావు ఎలాంటి ఆడంబరం లేకుండా ఒంటరిగానే ఆ వివాహానికి హాజరయ్యారట.
స్వగ్రామం అభివృద్ధికి ఎంతో కృషి
దేశ ప్రజల సంక్షేమానికి కృషిచేసిన బీఎన్ యుగంధర్ తన జన్మభూమి అభివృద్ధికి పాటు పడ్డారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలోని బుక్కాపురాన్ని ప్రగతిబాట పట్టించాలని ఎంతో తపన పడ్డారు. తన వంతుగా గ్రామంలోని దేవాలయ అభివృద్ధికి, సిమెంట్ రోడ్ల నిర్మాణానికి కృషిచేశారు.