దేశంలో జీరో బడ్జెట్ సహజ వ్యవసాయ ప్రోత్సహం అత్యావశ్యకం
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వ భూషన్ హరిచందన్
విజయవాడ,(హర్యానా, కురుక్షేత్ర) సెప్టెంబర్ 25 :
సున్నా బడ్జెట్ సహజ వ్యవసాయానికి రైతులు సన్నద్దం కావాలని ఆదిశగా ప్రభుత్వాలు దేశంలోని రైతులను ప్రోత్సహించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాన్యనీయ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులతో కూడిన వ్యవసాయం నుండి క్రమంగా దూరం జరగవలసిన తరుణం ఆసన్నమైందని గవర్నర్ శ్రీ బిస్వా భూషన్ హరిచందన్ స్పష్టం చేసారు. హర్యానా, కురుక్షేత్రలోని గురుకులంలో బుధవారం వ్యవసాయ రంగంలో సంస్కరణలు అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో మాన్యనీయ గవర్నర్ పాల్గొన్నారు. 2019-20లో 2.32 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 5.80 లక్షల మంది రైతులను సహజ వ్యవసాయం పరిధిలోకి తీసుకురావటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని బిశ్వ భూషన్ తెలిపారు.
తెలంగాణ గవర్నర్ శ్రీమతి తమిళైసాయి సౌందరాజన్, మహారాష్ట్ర గవర్నర్ శ్రీ భగత్ సింగ్ కోష్యారి, గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్ వ్రత్, హర్యానా గవర్నర్ శ్రీ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, ఎంపి గవర్నర్ శ్రీ లాల్జీ టాండన్ తదితరులు సైతం ఈ సదస్సులో పాల్గొన్నారు. భారతదేశంలో వ్యవసాయ రంగ సంస్కరణలకు అవసరమైన కాలానుగుణ సిఫారసులపై చర్చించారు. సదస్సులో భాగంగా గౌరవ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ లో రైతుల ఉన్నతి కోసం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయ పెట్టుబడులకు సంబంధించి రైతుకు సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైయస్ఆర్ రైతు భరోసా పధకాన్ని, పంట నష్టం జరిగినప్పుడు రైతులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి వైయస్ఆర్ రైతు బీమా వంటి వివిధ రైతు-స్నేహ పూర్వక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని గవర్నర్ శ్రీ హరిచందన్ వివరించారు. సెమినార్ తరువాత, ఆరు రాష్ట్రాల గవర్నర్లు హర్యానాలోని కురుక్షేత్రం సమీప వ్యవసాయ క్షేత్రాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు.