తేది. 30-09-2019
మాచర్లలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాన్ని ఖండించిన చంద్రబాబునాయుడు
జైలు గోడల మధ్య కూడా హత్యలు చేయించిన చరిత్ర వైఎస్ కుటుంబానిది
అహింస, సేవాతత్పరత వంటి గాంధీ సిద్ధాంతాలే టీడీపీ సిద్ధాంతాలు
అక్టోబర్ 2 పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
చట్టాన్ని చేతిలో తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదని పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ న్యాయవాద విభాగం సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు గారు మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గంగలగుంట గ్రామంలో పార్టీ మారలేదన్న కక్షతో తప్పుడు కేసులను బనాయించి మాచర్ల రూరల్ ఇన్స్పెక్టర్ భక్తవత్సలరెడ్డి అక్రమంగా 12 రోజుల పాటు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న బలహీన వర్గానికి చెందిన బత్తుల శ్రీరాములు, మేకల రమణయ్య, బత్తుల శ్రీనులను పీఎస్లో నిర్బంధించి వేధించడాన్ని ఆయన ఖండించారు. వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు ఊరి నుంచి తరిమివేసి.. పంట పొలాలను నాశనం చేయడం దుర్మార్గమన్నారు. జైలు గోడల మధ్య కూడా హత్యలు చేయించిన చరిత్ర వైఎస్ కుటుంబానికి ఉందన్నారు. అభివృద్ధిని వదిలేసి రాజకీయపరమైన ఆధిపత్యం కోసం హింసాత్మక నేరాలకు పాల్పడటం వైకాపా నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని చంద్రబాబు గారు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులకు, పెడుతున్న అక్రమ కేసులకు జగన్మోహన్రెడ్డినే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారిస్తే చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పెడుతున్న అక్రమ కేసులు, సోషల్మీడియా వాలంటీర్లపై పెడుతున్న కేసులు, వేధింపుల గూర్చి పార్టీ న్యాయవాద విభాగంతో సమీక్షించారు. వైకాపా నాయకులు చట్టాలను ఉల్లంఘిస్తున్న వైనానికి రాష్ట్ర ప్రజల తరపున పోరాటానికి సిద్ధమని చంద్రబాబునాయుడు గారు తెలిపారు.
అక్టోబర్ 2న జాతిపిత, స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మగాంధీ 150వ జయంతి వేడుకలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10.50 గం.లకు నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. అహింత ద్వారానే మానవ సమాజం హింస నుంచి బయటపడుతుందని చెప్పిన మహనీయుడు గాంధీ అని చంద్రబాబు గారు తెలిపారు. అందరికీ ఉపాధి, నివాసం, విద్య, ఆరోగ్యం ఉండాలన్న గాంధీ ఆశయాలే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలన్నారు. నిరాడంబరమైన జీవితంతో ప్రపంచ చరిత్రను మలుపుతిప్పిన గాంధీజీ జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. అహింస, సేవాతత్పరత, రుజువర్తన వంటి గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ రామకృష్ణ, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, మాజీ జెడ్పీ ఛైర్పర్సన్ అనురాధ, టీడీపీ లీగల్సెల్ సభ్యులు పాల్గొన్నారు.