రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించడానికి అధికార వైకాపా ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. మంగళవారం నాడు క్యాబినెట్ సబ్కమిటీ సమావేశం తరువాత బుధవారం నాడు మంత్రివర్గసమావేశాన్ని నిర్వహించబోతున్నారు. ఈ సమావేశంలో రాజధాని తరలింపుపై అధికారిక నిర్ణయాన్ని తీసుకుని...శాఖల తరలింపు గురించి చర్చిస్తారని సమాచారం. ఇప్పటికే పలు శాఖాధిపతులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో రాజధాని తరలింపుపై అధికారికంగా చెప్పబోతున్నారు. దీంతో రాజధాని తరలింపు జనవరి రెండో వారం నుంచే మొదలు కానుంది.
ఒకవైపు రాజధానిని ఇక్కడే కొనసాగించాలని రాజధాని ప్రాంతంలోని రైతులు భారీ స్థాయిలో ఉద్యమిస్తుంటే...వారి ఉద్యమాన్ని పట్టించుకోకుండానే ప్రభుత్వం తాము చేయాలనుక్ను పనులను వరుసగా చేసుకుంటూపోతోంది. రాజధాని రైతుల ఆందోళన పతాకస్థాయికి చేరినా, వారి ఉద్యమానికి అన్ని వైపుల నుంచి మద్దతు వస్తున్నా...ప్రభుత్వం మాత్రం దాన్ని గుర్తించడం లేదు. అది ఫెక్ ఉద్యమమని చెబుతూ కొంతమంది రియల్ఎస్టేట్ బ్రోకర్లు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారని మంత్రులు,ఎమ్మెల్యేలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. రాజధానిని ఇక్కడే కొనసాగించాలని టిడిపి,బిజెపి,జనసేన, సిపిఐ,సిపిఎం తదితర పార్టీలు చెబుతున్నా..ప్రభుత్వం మాత్రం వారి మాటలను కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని తరలింపుపై ప్రజల్లో అసహనం, ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా రాయలసీమ వాసులు..విశాఖలో రాజధానిని ఏర్పాటు చేస్తే...తమకు చాలా దూరం అవుతుందని, ఉంటే రాజధానిని 'అమరావతి'లో కొనసాగించాలని, లేకుంటే రాయలసీమలో పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వారి డిమాండ్ను కానీ, ఇతర ప్రాంతాలవారి డిమాండ్ను కానీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండా, తరలింపుకు న్యాయపరమైన అడ్డంకులు రాకుండా చర్యలు తీసుకుంటూ తాను తీసుకున్ననిర్ణయాన్ని అమలు చేయబోతోంది.
ఈ నేపథ్యంలో ముందుగా 32శాఖలను విశాఖపట్నం తరలించాలని ప్రయత్నాలు చేస్తోంది. సచివాలయంలోని జిఎడిని ముందుగా తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. దానితోపాటు విద్యాశాఖను కూడా తరలిస్తారంటున్నారు. ఇక హోం, ఆర్థికశాఖలతో పాటు ఇతర ముఖ్యమైన శాఖలను జనవరి ఆఖరి లోపే విశాఖపట్నానికి తరలిస్తారని, ఫిబ్రవరి, మార్చి నాటికి తరలింపు పూర్తి అవుతుందంటున్నారు. ఆగమేఘాలపై రాజధాని తరలించడంపై సచివాలయ ఉద్యోగులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు విశాఖపట్నం వెళ్లడం ఎలా వీలవుతుందని అంతర్గతంగా ప్రశ్నించుకుంటున్నారు. కానీ..ఏఒక్కరు కూడా రాజధాని తరలింపుపై కనీస నిరసన వ్యక్తం చేయడానికి ముందుకు రావడం లేదు. ఎవరికి వారు భయంతో..తమకెందుకులే..అందరూ ఎలా అయితే తాము అలా అంటూ మౌనంగా బాధను వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తాను అనుకున్నట్లే 'జగన్' రాజధాని జనవరిలోనే విశాఖకు తరలిస్తారనే దానిపై అటు ప్రభుత్వ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లోనూ స్పష్టత తెస్తున్నారు.