*పేదలకు వరప్రసాదినిలా 108, 104 సేవలు* తిప్పిరెడ్డి.నారపరెడ్డి..... వింజమూరు, జూలై 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం లాంచనంగా ప్రారంభించిన 108, 104 అంబులెన్సు వాహనాలు పేద వర్గాల ప్రజలకు వరప్రసాదినిగా మారనున్నాయని మండల వై.సి.పి కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలో వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 108, 104 సేవలను విస్తరించనున్నామని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ నేపధ్యంలో దాదాపుగా 201 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి 1088 అంబులెన్సు వాహనాలను విజయవాడలోని బెంజి సర్కిల్ కూడలి వద్ద ప్రారంభించడం అభినందనీయమని నారపరెడ్డి కొనియాడారు. దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నాడు ఆరోగ్యశ్రీతో పాటు 108 వాహనాలను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. కాలక్రమేణా 108 వాహనాల వ్యవస్థ మరుగున పడి వాటి మనగడే ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ తండ్రి బాటలో పయనిస్తూ ఒకేసారి 1088 అంబులెన్సు వాహనాలను ప్రజలకు సేవ చేసేందుకు ప్రారంభించి అటు తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ ఇటు ఆపదలలో ఉన్నవారికి ఆపద్భాంధవునిలా నిలిచారన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ఈ అంబులెన్సు వాహనాలు త్వరలోనే ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కేటాయించనున్నారని నారపరెడ్డి తెలియజేశారు. ప్రజల సం క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న యువ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పధకాలతో పాటు అదనంగా కొత్త పధకాలకు శ్రీకారం చుడుతుండటం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ప్రజల సం క్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్న సి.యం జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తిప్పిరెడ్డి.నారపరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.