గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కృషి
* తిరుపతిలో జాతీయ గిరిజన సాంస్కృతికోత్సవాలు
* గోడ పత్రికను ఆవిష్కరించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ (అవంతి శ్రీనివాస్)
అమరావతి: రాష్ట్రంలో గిరిజనుల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) అన్నారు. సచివాలయంలో మంత్రి తన కార్యాలయంలో శుక్రవారం జాతీయ గిరిజన సాంస్కృతికోత్సవ వేడుకల గోడపత్రికను ఆవిష్కరించి విడుదల చేశారు. రాష్ట్ర గిరిజన విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో తిరుపతి ఎస్.వి. యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో ఈ నెల 22, 23 తేదీల్లో వేడుకలు వైభవంగా జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరవుతున్నట్లు గిరిజన విద్యార్థి సమాఖ్య వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు వడిత్యా శంకర్ నాయక్ వెల్లడించారు. గతంలో ఏ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి పని చేయలేదని, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గిరిజన సామాజిక వర్గాల పట్ల ఎనలేని ప్రేమాభిమానాలు చాటారని మంత్రి అవంతి శ్రీనివాస్ వివరించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్తో పాటుగా రాష్ట్ర పంచాయితీరాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డిలతో సహా పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. గిరిజనులకు తొలిసారిగా ఉపముఖ్యమంత్రి పదవితో పాటు తమ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు గిరిజన సంక్షేమ శాఖను అప్పగించడం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్పతనానికి నిదర్శనమని అన్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో గిరిజన ఎమ్మెల్యేలు, ఒక ఎండి పదవిని కట్టబెట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్వదా రుణపడి ఉంటామని కొనియాడారు. ఈ జన్మలో గిరిజనులంతా సీఎం జగన్కు కట్టుబడి పనిచేస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక, యువజన, క్రీడలు, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కుమార్, ఎండీ ప్రవీణ్కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు జి. మల్లిఖార్జున నాయక్, రాష్ట్ర నాయకులు డి.భాస్కర్ నాయక్, శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కృషి