పత్రికా సమావేశం
తేది: 13.03.2020
అమరావతి
విదేశాల నుండి వచ్చిన వారు 14 రోజులపాటు విధిగా హోం ఐసోలేషన్లో ఉండాలి
• కరోనా నియంత్రణకు వ్యక్తిగత శుభ్రత, హోం క్వారంటైన్ పాటించడం మార్గం
• ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుండి వచ్చినవారి గుర్తింపునకు ఇంటింటా సర్వే
• కరోనా లక్షణాలు కనపడితే 104 హెల్ప్ లైన్,0866-2410978 కాల్ సెంటర్ కు తెలియజేయండి
• కరోనా పరీక్షలకై తిరుపతి,విజయవాడల్లో లేబరేటరీలు సిద్ధం
• ప్రభుత్వాసుపత్రుల్లో 300,ప్రవేట్ ఆసుపత్రుల్లో 350 ఐసోలేషన్ వార్డులు,పడకలు: వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ సిఎస్ జవహర్ రెడ్డి
అమరావతి,13 మార్చి: రాష్ట్రంలో కరోనా వైరస్(కోవిద్-19) నియంత్రణకు ప్రభుత్వం అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరుగుతోందని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కెఎస్. జవహర్ రెడ్డి వెల్లడించారు.కరోనా వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై శుక్రవారం అమరావతి సచివాలయంలోని నాల్గవ భవనం ప్రచార విభాగంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రస్తుతం కోవిద్ 118 దేశాలకు విస్తరించిందని ఇప్పటి వరకూ ప్రపంచ వ్యాప్తంగా లక్షా 25వేల 48 కరోనా కన్ఫార్డ్ కేసులు నమోదు కాగా 4 వేల 613 మంది చనిపోయారని తెలిపారు. కాగా భారతదేశంలో ఇప్పటి వరకూ 14 రాష్ట్రాలు,దేశ రాజధాని ఢిల్లీ సహా 3కేంద్రపాలిత ప్రాంతాల్లో 73 కరోనా కన్ఫార్మ్డ్ కేసులు నమోదయయ్యాయని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయితే ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నెల్లూరులో ఇటలీ నుండి వచ్చిన ఒక వ్యక్తికి పాజిటివ్ కేసు నమోదు అయిందని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు. కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపట్టిందని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల స్థాయిలో జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్య తదితర శాఖల అధికారులతో వీడియో సమావేశాలు, సమీక్షలు నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. జనవరి 28 నుండి విదేశాల నుండి వచ్చిన ప్రయాణీకులను విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కడప తదితర విమానాశ్రయాలు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవుల్లో ధర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని వివరించారు. అంతేగాక రాష్ట్ర స్థాయిలో 0866-2410978 నంబరుతో కూడిన 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడంతో పాటు 104 నంబరుతో కూడిన హెల్ప్ లైన్ ను కూడా అందుబాటులోకి తేవడం జరిగిందని ఆయన మీడియాకు వివరించారు.
కరోనా పరీక్షల నిర్వహణకై తిరుపతిలోని స్విమ్స్ లోను, విజయవాడలోను రెండు ల్యాబ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని మరో వారం రోజుల్లో కాకినాడలో కూడా ల్యాబ్ అందుబాటులోకి రానుందని జవహర్ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలో ప్రభుత్వ ప్రవేట్ ఆసుపత్రుల్లో 56 ఐసోలేషన్ వార్డులు, 428 ప్రత్యేక పడకలు ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.అంతేగాక జిల్లాకు ఒకటి వంతున 13జిల్లా ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను, 13 అంబులెన్సులను అందుబాటులో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు. కరోనా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తిరుపతిలో 500 పడకలతోను, విశాఖపట్నంలో 200 పడకలతో కూడిన క్వారైంటైన్ సౌకర్య కేంద్రాలు ఏర్పాటుకు గుర్తించి తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.కాగా ఇప్పటి వరకూ 55మంది నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షల నిమిత్తం పూణే లోని ల్యాబ్ కు పంపగా వాటిలో 47 నెగెటివ్ ఫలితాలు రాగా నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తికి పాజిటివ్ రాగా మరో 7శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు.కాగా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇటలీ నుండి రాగా అతనిని నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో చేర్చి తగిన వైద్య చికిత్సలు అందిస్తుండగా ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని 14 రోజుల పర్యవేక్షణ అనంతరం పూర్తిగా కోలుకున్నాక అతనిని డిశ్చార్జ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.ఆవ్యక్తి ఐదుగురు వ్యక్తులను కలవగా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని గుర్తించి ఆసుపత్రి క్వారంటైన్ అబ్జర్వేషన్లో ఉంచడం జరిగిందన్నారు.
ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన వారిని గుర్తించేందుకు రాష్ట్రంలోని కోటి 40లక్షల కుటుంబాలను ఇంటింటా సర్వే ప్రక్రియ చేపట్టగా ఇప్పటికే 89వేల కుటుంబాల సర్వే పూర్తికాగా 3వేల మంది వరకూ విదేశాలకు వెళ్లి వచ్చినట్టు గుర్తించడం జరిగిందని జవహర్ రెడ్డి వెల్లడించారు. ఆవిధంగా గుర్తించిన వారికి కరోనా లక్షణాలేమైనా ఉన్నాయా అనేదానిపై పరిశీలన చేసి వారిని 14రోజుల పాటు ఇంటిలోనే ఉండి కుటుంబ సభ్యులు సహా ఎవరినీ కలవకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా సూచించడం జరుగుతోందని తెలిపారు. అంతేగాక వారు తినే ఆహారం ,వాడే వస్తువులు తదితరమైనవన్నీ వారే సక్రమంగా డిస్పోజ్ చేసుకోవాలని ఎవరికైనా దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి కరోనా లక్షణాలు కనపడితే వెంటనే 104 హెల్ప్ లైన్లో అందుబాటులో ఉన్న డాక్టర్ ను సంప్రందించాలని సూచించామని చెప్పారు.
కరోనా వైరస్ ముందు జాగ్రత్త చర్యల్లో ప్రజలు చేయదగిన చేయకూడని(Do’s&Dont’s) చర్యల్లో భాగంగా ప్రజలు విదేశాల నుండి వచ్చిన వారి బంధువులను దగ్గరగా వచ్చి కలవడం కొంత కాలం వరకూ చేయవద్దని జవహర్ రెడ్డి హితవు చేశారు.అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం చేయవద్దని ఒకవేళ దగ్గు, తుమ్ములు వంటివి వచ్చినపుడు చేతి రుమాలుతో ముక్కును మూసుకుని మాత్రమే దగ్గడం,తుమ్మడం చేయాలని తరచూ చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఇన్చార్చి కమిషనర్ వి.విజయరామరాజు, వైద్య ఆరోగ్యశాఖ సంచాలకురాలు డా.అరుణ కుమారి తదితరులు పాల్గొన్నారు.