నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది. 

అమరావతి
పుర ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది. 
ఇందుకు సంబంధించి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. 
ప్రతి జిల్లాల్లో రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం కూడా పూర్తైంది. 
వారికి మార్గదర్శకాల కోసం బుక్​లెట్​లు అందజేశారు. 
ఎన్నికల ప్రక్రియ మొత్తానికి వారే బాధ్యత వహిస్తారు.
నామినేషన్లను ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తారు. భోజన విరామం లేదు.
జిల్లా ఎన్నికల అధికారిగా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. సహాయ ఎన్నికల అధికారులుగా కమిషనర్లు ఉంటారు. నామినేషను వేసే సమయంలో నలుగుర్ని మాత్రమేలోనికి అనుమతిస్తారు. అభ్యర్థితోపాటు ఇద్దరు ప్రతిపాదించేవారు, ఒక ఏజంట్‌ వెంట ఉండవచ్చు.
నామినేషన్‌ దాఖలు కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ఇతరులు ఉండాలి. ప్రతి కేంద్రంలో ఒక రిటర్నింగ్‌ అధికారి, ఇద్దరు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు ఉంటారు.
అభ్యర్థి స్థానిక సంస్థకు ఎలాంటి బకాయిలు ఉండకూడదు. ఇంటి పన్ను, కుళాయి పన్ను, దుకాణాల అద్దెలు బకాయి ఉంటే పోటీకి అనర్హులవుతారు.
నియమనిబంధనలు
కార్పొరేటర్‌/ కౌన్సిలర్‌గా పోటీ చేసే వారికి 21 ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. స్థానిక సంస్థ పరిధిలో ఓటరై ఉండాలి.
నామినేషన్‌ వేసే వారు ఆ వార్డు, డివిజన్‌కు చెందిన ఇద్దరితో ప్రతిపాదింపజేసుకోవాలి. ఆస్తుల వివరాలతో సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలి
1-6-1994 నాటికి ముందు ముగ్గురు పిల్లలు కలిగి ఉంటే పోటీకి అర్హులు. ఆ తరువాత అయితే అనర్హులు.
నామినేషన్‌ వేయడానికి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.5 వేలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే రూ.2,500 రుసుం చెల్లించాలి. పురపాలక ఖజానా లేదా బ్యాంకులో ఆ మొత్తాన్ని చెల్లించి సంబంధిత రశీదును నామినేషన్‌ పత్రాలతో కలిపి సమర్పించాలి. పోటీ నుంచి తప్పుకుంటే రుసుం తిరిగి ఇచ్చేస్తారు.
ప్రతి అభ్యర్థీ నాలుగు నామినేషను పత్రాలు సమర్పించవచ్ఛు. రుసుం ఒకసారి చెల్లిస్తే సరిపోతుంది. నామినేషను పత్రాలను అభ్యర్థి నేరుగా లేదా అతని తరఫున ఎవరైనా అందజేయవచ్చు