తొలివిడతగా ఆరు జిల్లాల్లో రూ. 12,308 కోట్లతో పనులకు శ్రీకారం.

అమరావతి
12.04.2020


- రాష్ట్రంలో మంచినీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం.


-  ‘‘వాటర్ గ్రిడ్’’ తో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి సరఫరాకు ప్రణాళిక.


- సుమారు రూ.57,622 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ అమలు.


- తొలివిడతగా ఆరు జిల్లాల్లో రూ. 12,308 కోట్లతో పనులకు శ్రీకారం.


- ఈ నెల 16 లోగా జ్యుడీషియల్ ప్రివ్యూకు వాటర్ గ్రిడ్ టెండర్ల ప్రతిపాదనలు.


- 30 ఏళ్ళ అవసరాలకు అనుగుణంగా మంచినీటి సరఫరా వ్యవస్థ.


- తొలివిడతలో 6 జిల్లాలు ఎంపిక. 
- ఉద్దానం, పల్నాడుతో పాటు తీవ్ర ప్రభావిత ప్రాంతాల ఎంపిక. 
- గోదావరిజిల్లాల్లోని తీరప్రాంతాలకు తొలగనున్నమంచినీటి కష్టాలు 
ఆంధ్రప్రదేశ్ లో మంచినీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కు రూపకల్పన చేసింది. ఏకంగా 57,622 కోట్ల రూపాయలతో వచ్చే 30 సంవత్సరాల పాటు తాగునీటి అవసరాలను తీర్చే భారీ ప్రాజెక్ట్ కు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తొలివిడతలో భాగంగా తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న ఆరు జిల్లాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందుకు గానూ 12,308 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్దిశాఖ నుంచి పరిపాలనా అనుమతి ఇస్తూ ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి. తాజాగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ పనులను ప్రారంభించేందుకు తుది ఆదేశాలు వెలువడ్డాయి. దీనితో వాటర్ గ్రిడ్ పనులకు టెండర్లు నిర్వహించేందుకు గానూ ముందుగా జ్యుడీషియల్ ప్రివ్యూకు ఈ నెల 16వ తేదీలోగా సదరు పనుల వివరాలను పంపాలని నిర్ణయం తీసుకున్నారు. జ్యుడీషియల్ ప్రివ్యూ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ పనులకు జూన్ మొదటి వారం కల్లా టెండర్లు నిర్వహించడం, పనులను ప్రారంభించేందుక గ్రామీణ మంచినీటి సరఫరా (ఆర్ డబ్ల్యుఎస్) అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 


*ప్రభావిత ప్రాంతాలకే తొలి ప్రాధాన్యత* 
రాష్ట్రంలో మంచినీటి సమస్య తీవ్రంగా వున్న ప్రాంతాలను తొలి విడతలో ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనిలో భాగంగా తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడపజిల్లాలు ఎంపికయ్యాయి. వీటిలోనూ శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో సురక్షిత నీరు లేకపోవడం వల్ల కిడ్నీవ్యాధులు అత్యధికంగా నమోదవుతున్నాయన్న అంశానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రాంతంలో వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటిని అందించనున్నారు. అలాగే పల్నాడు ప్రాంతంలోనూ ఎన్నో ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న తాగునీటి కష్టాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. జీవనదిగా వున్న గోదావరి ప్రవహిస్తున్నా... ఆక్వాసాగుతో సముద్రతీర ప్రాంతాల భూగర్భ జలాలు కలుషితమై, మంచినీటి కోసం తపిస్తున్న ఉభయగోదావరి జిల్లాలను కూడా వాటర్ గ్రిడ్ ద్వారా ఆదుకోనున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం, వైఎస్ఆర్ కడపజిల్లాలోని పులివెందుల ప్రాంతాల్లో శాశ్వతంగా మంచినీటి సమస్యకు చెక్ పెట్టేందుకు వాటర్ గ్రిడ్ లో ఎంపిక చేశారు. రోజుకు ఒక మనిషికి పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, మున్సిపల్ కార్పోరేషన్‌ ల పరిధిలో 150 లీటర్ల నీటిని అందించేలా ప్రతిపాదనలను సిద్దం చేశారు. 


*2024 నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి* 
వాటర్ గ్రిడ్ లో భాగంగా 2024 నాటికి ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 30 ఏళ్ల పాటు ఎటువంటి మార్పులు లేకుండా వినియోగించుకునేలా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్ట్‌ ను అధికారులు రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 48,662 హ్యాబిటేషన్లకు తాగునీటి కష్టాలకు పూర్తిస్థాయిలో పరిష్కారం లభించనుంది. రాష్ట్రంలోని 94.13 లక్షల నివాసాలకు గారూ ఇప్పటికే 31.58 లక్షల మందికి కుళాయి కనెక్షన్లు వన్నాయి. మిగిలిన నివాసాలకు వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి కుళాయిలను అందించనున్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 540.68 లక్షల మంది, అర్భన్ ప్రాంతాల్లో 198.10 లక్షల మందికి మంచినీరు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం మొత్తం 90 టిఎంసిల నీరు అవసరం కాగా, అందుకోసం 52 రిజర్వాయర్ లను నీటి వనరుల కోసం గుర్తించారు. ప్రాజెక్ట్ ను ప్రారంభించిన నాలుగు సంవత్సరాల్లో మొత్తం పనులను పూర్తి చేయాలని, పన్నెండేళ్ళ పాటు దాని నిర్వహణా బాధ్యతలను కూడా కొనసాగించాలని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. 
ఆరు జిల్లాలకు ‘వాటర్ గ్రిడ్’ కోసం నిధులు కేటాయింపు 
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ లో తొలి విడతలో ఆరు జిల్లాల్లో చేపట్టనున్న పనులకు గానూ ప్రభుత్వం నిధులను కేటాయించింది. తూర్పు గోదావరిజిల్లాకు రూ.3,960 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాకు 3,670 కోట్లు, శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి రూ.700 కోట్లు, గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి రూ. 2,665 కోట్లు, ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి రూ. 833 కోట్లు, వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల ప్రాంతానికి రూ.480 కోట్ల రూపాయలను కేటాయించారు. నిధుల సమీకరణలో భాగంగా బ్యాంక్‌ ల నుంచి రూ.2500 కోట్ల రుణం కోసం అధికారులు చర్చలు జరిపారు. అలాగే మరో 7,300కోట్ల రూపాయల రుణం కోసం కూడా ప్రభుత్వం ఆర్థికసంస్థలతో చర్చలు జరుపుతోంది. కేంద్రప్రభుత్వ సంస్థలైన నాబార్డ్, జల్ జీవన్ మిషన్, గ్రామీణ ఉపాధి హామీ పథకం ల ద్వారా కూడా మిగిలిన నిధులను వాటర్ గ్రిడ్ కోసం సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 110 అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ (యుఎల్‌బిఎస్‌) లకు 1418.49 ఎంఎల్‌డిల నీరు సరఫరా జరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో స్థానికంగా వున్న రిజర్వాయర్లు, జలవనరుల నుంచి తాగునీటి అవసరాలకు పైప్‌ లైన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. రిజర్వాయర్లు లేని ప్రాంతాల్లో భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. అయితే వేసవికాలంలో భూగర్భజలాలు అడుగుంటుతున్న నేపథ్యంలో తాగునీటి కష్టాలు ప్రారంభమవుతున్నాయి. మరోవైపు తీరప్రాంతంలోని భూగర్భ జలాలు ఉప్పుశాతం పెరిగిపోయి తాగేందుకు వీలు లేకుండా పోతున్నాయి. ఈ మొత్తం పరిస్థితికి పరిష్కారంగా రాష్ట్రప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథకాన్ని ముందుకు తీసుకువచ్చింది. 
భూగర్భ జలాల అధిక వినియోగానికి కట్టడి 
వాటర్ గ్రిడ్ అమలు ద్వారా ఇప్పటి వరకు తాగునీటి అవసరాల కోసం పరిమితిని మించి జరుగుతున్న భూగర్భ జలాల వినియోగాన్ని కట్టడి చేయనున్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా సాగునీటి ప్రాజెక్ట్ ల నుంచి వ్యవసాయ, ఆక్వా, ఇతర పరిశ్రమల అవసరాలను మినహాయించి మిగిలిన అదనపు నీటి వనరులను నీటిశుద్ది కేంద్రాలకు తరలిస్తారు. అక్కడి నుంచి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటిని అందిస్తారు. అందుకోసం నదులు, చెరువులు, వాగులు,రిజర్వాయర్ లలోని నీటి లభ్యతను గుర్తించి, దానికి అనుగుణంగా ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం వాటర్ గ్రిడ్ అనుసంధానంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి నీటిని అందించడం ద్వారా సహజవనరుల ద్వారానే తాగునీటి లభ్యత మెరుగవుతుంది. కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న భూగర్భ జలాల అధిక వినియోగంకు తగ్గించేందుకు, ప్రత్యామ్నాయ వ్యవస్థగా వాటర్ గ్రిడ్ ముందుకు వస్తోంది. దీనివల్ల తీరప్రాంతాల్లోని భూగర్భజలాలు సెలినిటీ భారిన పకుండా సమతూల్యత వుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఫ్లోరైడ్ వంటి సమస్యలకు కూడా వాటర్ గ్రిడ్ తో పరిష్కారం లభిస్తుంది. ప్రకృతి సమతూల్యకు అనుగుణంగా ఒకవైపు భూగర్భజలాలను వాడుకుంటూనే, మరోవైపు ఇతర జలవనరులను కూడా సద్వినియోగం చేసుకునేలా వాటర్ గ్రిడ్ ను రూపొందించారు.


Popular posts
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
సిమెంట్ ధరల వ్యత్యాసం నియంత్రణ కు "వైయస్ఆర్ నిర్మాణ్” ప్రారంభం
Image
పాలన... రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలి •ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలుపెట్టాలి •రాజకీయాల్లో కొత్త తరం వచ్చే సమయం ఇది •రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష •కరోనా వల్ల తలెత్తిన ఈ క్లిష్ట పరిస్థితుల్లో యువత ఆత్మస్థైర్యంతో ఉండాలి •ఈబీసీ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేసి తీరాలి •వైద్య విద్యార్థులకు స్టైఫండ్ సకాలంలో ఇవ్వడంతోపాటు బోనస్ ప్రకటించాలి •జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు •విద్యార్థులు, యువత, మెడికోలతో వెబినార్ ద్వారా జనసేన చర్చా కార్యక్రమం ప్రభుత్వం మనల్ని పట్టించుకోవట్లేదు అనే భావనను యువత వదిలి... అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో యువత పట్టించుకోవడం మొదలు పెడితే కచ్చితంగా పాలనలో మార్పు మొదలవుతుందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. రాజకీయ వ్యవస్థలో మార్పు తెచ్చే సత్తా యువతకు ఉందన్నారు. వర్తమానంలో పాలనపరమైన, రాజకీయపరమైన నిర్ణయాల్లో యువత పాత్ర తప్పక ఉండాలని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో యువత భాగస్వామ్యం బలంగా ఉండాలన్నదే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష అని తెలిపారు. పాలసీల రూపకల్పనలో60 - 70 ఏళ్ల వారిని నియమిస్తే వారు యువతకు తగ్గ ఆలోచనలు ఇవ్వలేరు, యువతకు పాలసీ రూపకల్పనలో భాగం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జనసేన యువతకు ప్రధాన భాగం ఇస్తుందన్నారు. ఐదేళ్లుకోసారి ఓటు వేస్తే బాధ్యత అయిపోయినట్లే అని భావించకుండా ... వ్యవస్థల్లో జరగుతున్న అవినీతిని ప్రతిరోజు ప్రశ్నించడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి వల్ల అనుకోని మార్పులు సంభవిస్తున్నాయనీ, విద్య, ఉపాధి అంశాల్లో చోటు చేసుకొంటున్న మార్పులకు యువత ధైర్యం కోల్పోరాదని సూచించారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారన్నారు. కోవిడ్ 19 సమయంలో ఎదురైన సవాళ్లు, వాటిని యువత ఎదుర్కొన్న తీరు, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై ఆదివారం మధ్యాహ్నం 13 జిల్లాలకు చెందిన విద్యార్ధులు, మెడికోలు, యువ వైద్యులతోపాటు యువత ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్జీవోల ప్రతినిధులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో వెబినార్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ డా.పంచకర్ల సందీప్ ఈ వెబినార్ కు నేతృత్వం వహించారు. పలు సమస్యలపై విద్యార్ధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “కరోనా కష్టకాలాన్ని అధిగమించడానికి యువత కీలక పాత్ర పోషిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో ఇబ్బందుల్లో ఉన్నవారికి అండగా నిలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వలస కూలీల ఆకలి తీర్చారు. కరోనాతో పోరాటం చేస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, శానిటైజర్లు, మాస్క్ లు పంపిణీ చేశారు. నిస్వార్ధంగా, సేవాభావంతో పనిచేస్తున్న ఇలాంటి యువత భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని కోరుకుంటున్నాను. శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆశయాలు, జనసేన సిద్ధాంతాలను విద్యార్థులు, యువత ఆచరణలో చూపించారు. •పోరాటం మనవల్ల కాదులే అనుకోవద్దు దేశ భవిష్యత్తూ, జాతి భవిష్యత్తూ యువతపైనే ఉంది. కారణం దేశ జనాభాలో యువత అరవై శాతం పైనే కావడం. అంటే అద్భుతమైన మానవ వనరులున్న దేశం మనది. వాటిని మనం సక్రమంగా వినియోగించుకుంటే, జాగ్రత్తగా కాపాడుకుంటే దేశ ప్రగతిలో భాగస్వాములుగా చేస్తే ప్రపంచ దేశాలకు ధీటుగా మనం ఎన్నో అద్భుత ఆవిష్కరణలు చేయొచ్చు. వ్యవస్థతో పోరాటం చేయడం మన వల్ల కాదులే అనుకోవద్దు. వ్యవస్థలో మీరు కూడా భాగస్వాములే. ప్రభుత్వం, పాలన గురించి ప్రతిరోజు తెలుసుకుంటేనే నాయకులుగా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. తిత్లి తుఫాన్ సమయంలో శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఒక యువకుడు... మాకు 25 కేజీల బియ్యం కాదన్న... పాతికేళ్ల భవిష్యత్తు కావాలని అన్నాడు. యువత ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వాలు చాలా పెద్ద పెద్ద మాటలు చెబుతారు. విద్య, వైద్యానికి వేల కోట్లు కేటాయించామని గొప్పలు చెబుతాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచన విధానాలను మార్చుకొని విద్యా, వైద్యంపై ఎక్కువ నిధులు ఖర్చు చేయగలిగితే దేశానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. •ఈబీసీ రిజర్వేషన్ కోసం బలంగా నిలబడతాం సామాజికంగానూ, విద్యాపరంగానూ వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో దేశంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఇంకా అమలు చేయడం లేదు. ఈ రిజర్వేషన్లు అమలు చేయాలని జనసేన బలంగా నిలబడుతుంది. అగ్రవర్ణాల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ఉత్పత్తుల వినియోగం పెంచాలి. ‘మన ఉత్పత్తి, మన ఉపాధి, మన అభివృద్ధి’ అని శ్రీ పవన్ కల్యాణ్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని ఉచితంగా రేషన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి రాష్ట్రానికి 8 లక్షల టన్నులు ఆహార ధాన్యాలను కేటాయించింది. అయితే ప్రతి రాష్ట్రం 6 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను మాత్రమే తీసుకున్నాయి. అందులో సరఫరా చేసింది 2 లక్షల టన్నులే. కరోనా విలయతాండవంలో ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న మెడికల్ స్టూడెంట్స్ కు గత నాలుగైదు నెలలుగా స్టైఫండ్ ఇవ్వకపోవడం బాధాకరం. జూలై 25న ప్రభుత్వానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు విజ్ఞప్తి చేశారు. ఆ తరవాత నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు అధికారులు స్టైఫండ్ రిలీజ్ చేయలేదు. ఇలాంటి కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న మెడికోలకు స్టైఫెండ్ కాదు బోనస్ ఇవ్వాలి. మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం అవుతోంది. ప్రభుత్వం దిశా చట్టం కేవలం పబ్లిసిటీ కోసం తెచ్చింది తప్ప, మహిళలను రక్షించడానికి తీసుకువచ్చినట్లు నాకు అనిపించడం లేదు. రాజకీయాల్లో అవినీతి అనేది చాలా చిన్న పదంగా మారిపోయింది. రాజకీయాల్లోకి రావాలి కోట్లు వెనకేసుకోవాలి, రెండు మూడు లగ్జరీ కార్లు కొనాలి అనుకుంటున్నారే తప్ప ప్రజలకు సేవ చేద్దామని ఎవరూ అనుకోవడం లేదు. రాజకీయాలను కూడా ఒక కెరీర్ గా తీసుకుంటే తప్ప రాజకీయాల్లో మార్పు రాదు. జనసేన పార్టీ పరంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మంచి యువతను గుర్తించి నాయకులుగా తయారు చేద్దామని నిర్ణయించుకున్నాం” అన్నారు. డా.పంచకర్ల సందీప్ మాట్లాడుతూ “అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆలోచనలు జాతీయ స్థాయిలో ప్రభావితం చేసే స్థాయిలో ఉంటాయి. ఇటీవల విద్యా విధానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశం ఆ కోవకు చెందినవే. లాక్డౌన్ సమయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా యువత ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది” అన్నారు. అమెరికాలో చదువుతున్న శ్రీకాకుళంకి చెందిన వినీల్ విశ్వంభర దత్ మాట్లాడుతూ “జనసేన పార్టీలో పని చేయడం, వివిధ వర్గాల ప్రజలతో మమేకం అయిన అనుభవం నాకు అమెరికాలో ఉపయోగపడుతోంది. ఉచిత స్కీముల గురించి తప్ప, విద్యా విధానం గురించి మాట్లాడే పార్టీలు కరవయ్యాయి. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాతృభాషా బోధన, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంశాలు మాట్లాడి భవిష్యత్ తరాల కోసం పుట్టిన పార్టీ జనసేన అని నిరూపించార”న్నారు. గుంటూరు జిల్లాకి చెందిన విద్యార్ధి కౌశిక్ మాట్లాడుతూ కోవిడ్ ముసుగులో కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నాయి, బ్రెజిల్, కెనడా లాంటి దేశాల్లో వైద్య విధానాలు ఎలా ఉంటాయన్న అంశాలు వెబినార్ లో పంచుకున్నారు. విశాఖకు చెందిన మెడికో డాక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ “విపత్కాలంలో పని చేస్తున్నా ప్రభుత్వం స్టైఫండ్ ఇవ్వడం లేదు. ప్రభుత్వం జీవో విడుదల చేసింది తప్ప ఏమీ ఇవ్వలేదు. కోవిడ్ టెస్టులు నిర్వహించే వారికి అందుకు అవసరం అయిన నైపుణ్యాలు సరిగా లేవు. పీపీఈ కిట్స్, వెంటిలేటర్స్ తగినన్ని అందుబాటులో లేవు” అన్నారు. పంజాబ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్ధి శ్రీ సందీప్ మాట్లాడుతూ.. “లాక్ డౌన్ సమయంలో సొంత రాష్ట్రానికి రావడానికి విద్యార్ధులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ కొంత మంది అక్కడే ఉన్నారు. కాలేజీల యాజమాన్యాలు ఈ పరిస్థితుల్లో కూడా డెడ్ లైన్లు పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నాయి” అన్నారు. నాగార్జున యూనివర్శిటీ విద్యార్ధిని కుమారి కావ్య మాట్లాడుతూ అర్హత ఉన్నా రైతులు ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్న అంశాన్ని, మహిళలు, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలను ప్రస్తావించారు. బయో ఇన్ఫోటెక్ సంస్థకు చెందిన పవన్ కెల్లా మాట్లాడుతూ “ప్రతి విద్యార్ధి కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. విద్యార్ధి దశలోనే తమ ఆలోచనలకు కాపీ రైట్, పేటెంట్ సాధించాలి. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. ఒకరు సాధించిన దాన్ని ఇంకొకరు దోచుకోని పరిస్థితి రావాలి” అన్నారు. కర్నూలు జిల్లాకు చెందిన స్టార్టప్ ప్రొఫెషనల్ ఫయాజ్ మాట్లాడుతూ లెర్నింగ్ మిషన్, యువత ఆలోచనలకు రూపం ఇచ్చేందుకు క్షేత్ర స్థాయిలో కో ఆర్డినేషన్ విభాగం ఆవశ్యకతను వివరించారు. జనసేన పార్టీ భగత్ సింగ్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్ లో ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో విద్యాభ్యాసం చేస్తున్న తెలుగు విద్యార్ధులు కలిపి సుమారు 200 మందికి పైగా పాల్గొన్నారు.
Image