న్యాయం జరిగే దాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు: చంద్రబాబు
గుంటూరు : చంద్రబాబుతో టీడీపీ సీనియర్ నేతల సమావేశం జరిగింది. రేపు 'ఛలో ఆత్మకూరు' నేపథ్యంలో పరిణామాలు... వైసీపీ బాధితుల పునరావాస శిబిరానికి పోలీసు అధికారుల రాక.. తదుపరి అంశాలపై చర్చించినట్టు టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరులో 'వైసీపీ బాధితుల శిబిరం' పెట్టి 8 రోజులయ్యిందన్నారు. 110 రోజులుగా గ్రామాలకు దూరంగా వేలాది మంది బాధితులున్నారని వెల్లడించారు. వైసీపీ బాధితులను అధికారులు తీసుకెళ్తామంటున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. మరోవైపు గురజాల డివిజన్లో 144సెక్షన్ విధించారన్నారు. సమస్య పరిష్కారం కావాలన్నదే టీడీపీ ఆకాంక్ష అన్నారు. బాధితులకు న్యాయం చేయాలన్నదే టీడీపీ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది కేవలం పల్నాడు ప్రాంత సమస్య మాత్రమే కాదన్నారు. రాష్ట్రమంతా శాంతిభద్రతల సమస్య ఉందన్నారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలు అన్నింటిలో ఇవే వేధింపులు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బాధితులంతా గుంటూరు చేరుకుంటున్నారన్నారని చంద్రబాబు స్పష్టం చేశారు. బాధితులందరికీ న్యాయం జరగాలని, తప్పుడు కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ధ్వంసమైన ఆస్తులకు నష్ట పరిహారం చెల్లించాలని, బాధితులకు అండగా ఉంటుందన్నారు. న్యాయం జరిగేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బాధితులందరినీ ఆదుకోవాలన్నదే టీడీపీ దృఢ సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేశారు.
న్యాయం జరిగే దాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు: చంద్రబాబు