ప్రసార మాధ్యమాల గొంతు నొక్కేస్తారా..? : చంద్రబాబు

ప్రసార మాధ్యమాల గొంతు నొక్కేస్తారా..?
అసెంబ్లీలో ప్రతిపక్షం.. ఇప్పుడు చానెళ్లు!
72 గంటల్లో ఎంఎస్‌వోలు స్పందించకపోతే ట్రాయ్‌కు ఫిర్యాదు చేయాలని సూచన
ఏపీలో కొన్ని వార్తా చానెళ్ల ప్రసారాల నిలిపివేతపై చంద్రబాబు రియాక్షన్
ఏపీలో కొన్ని వార్తా చానెళ్ల ప్రసారాలను నిషేధించడంపై టీడీపీ అధినేత మన చంద్రబాబు స్పందించారు. శుక్రవారం నాడు టీడీపీ సీనియర్‌ నేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ క్రమంలో కొన్ని వార్తా చానెళ్ల ప్రసారాల నిలిపివేత ప్రస్తావన వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు.. ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూస్‌ చానెళ్ల ప్రసారాలను నిలిపేయాలని మంత్రులే బెదిరించడమేంటని ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రసార మాధ్యమాల గొంతు నొక్కేస్తారా..? అంటూ ఆయన కన్నెర్రజేశారు.
అసెంబ్లీలో ప్రతిపక్షం.. ఇప్పుడు చానెళ్లు!
'బాధితుల బాధలు ప్రసారం చేసిన వార్తా చానళ్లను బంద్ చేయడం ఏమిటి..?. న్యూస్‌ చానెళ్ల ప్రసారాలను నిలిపేయాలని మంత్రులే బెదిరించడమా..?. ప్రసార మాధ్యమాల గొంతు నొక్కేస్తారా..?. అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు నొక్కేయాలని చూశారు.. ఇప్పుడు న్యూస్‌ చానెళ్ల గొంతు నొక్కేస్తున్నారు. ఛానళ్ల ఎంపిక వినియోగదారుల అభీష్టం. తమకు ఏ చానళ్ళు కావాలో వినియోగదారులే ఎంచుకుంటారు. దానికి ఒక నియంత్రణ వ్యవస్థ ట్రాయ్ ఉంది. నచ్చిన చానళ్ళు ఇవ్వాలని ముందుగా ఎంఎస్‌వోలను కోరాలి. 72 గంటల్లో ఎంఎస్‌వోలు స్పందించకపోతే ట్రాయ్‌కు ఫిర్యాదు చేయాలి' అని టీడీపీ నేతలకు బాబు సూచించారు. కాగా ఈ వ్యవహారంపై ఏపీకి చెందిన పలువురు నేతలు, మాజీ మంత్రులు స్పందిస్తూ.. సర్కార్ తీరుపై తీవ్రఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.