నగదు రహిత ప్రయాణం
ఆర్టీసీలో నూతన విధానం
ఈ నెల నుంచి అమల్లోకి
తుని : ఆర్టీసీ బస్సులో ఇకపై నగదు రహిత ప్రయాణం చేయవచ్చు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు చర్యలు ప్రారంభించారు. రాష్ట్రంలో ఎక్కడికైనా ఈ కార్డు ద్వారా నగదు లేకుండానే ప్రయాణం చేయవచ్చు. ఈనెల నుంచి జిల్లాలో ఈ నూతన విధానం అమల్లోకి రానుంది.
ఆర్ఎఫ్ఐడీ కార్డులు : రేడియో ఫ్రీకెన్సీ ఐడెంటిఫికేషన్ డిజిటల్ విధానం అమ ల్లోకి రానుంది. ఈ విధానంలో ప్రయాణికుడికి ఓ కార్డు అందిస్తారు. బస్సులో ప్రయాణించే సమయంలో కండక్టర్కు ఈ కార్డును చూపించాలి. ఈ కార్డు నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నామో ఆ మొత్తాన్ని ప్రత్యేక టిమ్ మిషన్లో నమోదు చేస్తారు. ఈ నూతన విధానంలో ఇటు ప్రయాణికులకు, అటు ఆర్టీసీ సిబ్బందికి మేలు కలుగుతుంది.
ప్రయోజనాలివి : టికెట్టు పోయిన సమయంలో తనిఖీ అధికారులకు యంత్రంలో ప్రయాణికుడి వివరాలు చూపించేందుకు వీలుంటుంది.
చిల్లర సమస్య ఎదురుకాదు. ఆర్టీసీ సిబ్బందికి సమయం ఆదా అవుతుంది. నగదు లేకపోయినా కార్డు ద్వారా ప్రయాణం చేయవచ్చు.
ప్రతిరోజూ ప్రయాణం చేసే ఉద్యోగులకు, వ్యాపారులకు ఉపయోగకరంగా ఉంటుంది. అందుబాటులో కార్డులు : ఆర్ఎఫ్ఐడీ కార్డులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచనున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్లు, డిపోలతోపాటు బస్సులో కండక్టర్లవద్ద ఈ కార్డులు అందుబాటులో ఉంచుతారు.
గరిష్ఠంగా రూ.రెండు వేలు : ప్రయాణికులు గరిష్ఠంగా రూ.రెండువేలు ఆర్ఎఫ్ఐడీ కార్డులో నగదు ఉంచవచ్చు. ఈ నగదు పూర్తయిన తర్వాత తిరిగి మళ్లీ రీచార్జి చేసుకునే సదుపాయం కల్పించారు. ఆర్ఎఫ్ఐడీ కార్డుకు మాత్రం ప్రయాణికులు రూ.50 నుంచి రూ.60 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంతో ప్రయోజనం : పద్మావతి, డిపో మేనేజర్, తుని
ఆర్ఎఫ్ఐడీ విధానం ఈ నెలలోనే అందుబాటులకి రానుంది. ఈ విధానంలో ఇటు ప్రయాణికులకు, అటు ఆర్టీసీ సిబ్బందికి ప్రయోజనం కలుగుతుంది. ప్రజలందరికీ ఈ కార్డులు అందుబాటులో ఉంచుతాం. నగదు రహిత ప్రయాణానికి ఈ కార్డులు ఉపయోగపడతాయి. ఆర్టీసీ ప్రయాణికులు ఈ విధానం వినియోగించుకోవాలి.
నగదు రహిత ప్రయాణం