ఇసుక వారోత్సవాలు అంటే పొరపాటు పడ్డా..: లోకేష్

ఇసుక వారోత్సవాలు అంటే పొరపాటు పడ్డా..: లోకేష్
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సోమవారం నాడు ట్విట్టర్ వేదికగా 'ఇసుక వారోత్సవాలు'పై లోకేష్ వరుస ట్వీట్స్ చేశారు.
ఇసుక వారోత్సవాలు అంటే పొరపాటు పడ్డా : "ఇసుక వారోత్సవాలు అని వైఎస్ జగన్‌ గారు అంటే ప్రజలకి ఇసుక అందుబాటులోకి తీసుకొస్తారనుకుని పొరపాటు పడ్డాను. జగన్ గారు అన్నది ఇసుక 'వార్' ఉత్సవాలు అని తరువాత అర్థం అయ్యింది. ఇసుక వార్‌లో భాగంగా ఇసుక వాటాల కోసం వైకాపా నాయకులు కర్రలతో దాడులు చేసుకొని, తలలు పగలు కొట్టుకుంటున్నారు. ఒక పక్క వైకాపా నాయకులు ఇసుకలో వాటాల కోసం వీధిరౌడీల్లా కొట్టుకుంటుంటే గుంటూరు జిల్లా, పెదకాకానిలో జగన్ గారి చేతగాని పాలనకి మరో భవన నిర్మాణ కార్మికుడు పీట్ల శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డారు. వైకాపా ఇసుక వార్ ఉత్సవాలు, ఇసుక పంచాయితీలు ఆపి కార్మికులకు బతుకు భరోసా ఇవ్వండి జగన్ గారు" అని లోకేష్ హితవు పలికారు. ఈ ట్వీట్‌కు ఇసుక కోసం కొట్టుకుంటున్న వీడియోను సైతం లోకేష్ జత చేశారు. మరి లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.