క్రీడలు ఒక గౌరవప్రదంగా ఉండాలి :చెవిరెడ్డి


తిరుపతి, నవంబర్ 16: క్రీడలు ఒక గౌరవప్రదంగా, మన పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలని చంద్రగిరి నియోజకవర్గ శాసన సభ్యులు మరియు తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి పేర్కొన్నారు. శనివారం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో గల ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో తిరుపతిలోని తారక రామ స్టేడియంలో ఈ నెల 23, 24, 25 తేదీల్లో జరగనున్న 17వ జాతీయ అంతర్జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ మీట్ ( నిడ్జామ్ -2019 ఏర్పాట్లలో) భాగంగా పిడి లు, పిఈటి లు, అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి హాజరైన తుడా చైర్మన్ మాట్లాడుతూ భారతదేశంలోని వివిధ జిల్లాల నుండి తిరుపతి తారక రామ స్టేడియంలో ఈ నెల 23నుండి ఈ నెల 25వ తేది వరకు నిడ్జామ్ లో పాల్గొనేందుకు క్రీడాకారులు వస్తున్నారన్నారు. తిరుపతిలో క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. క్రీడల్లో పాల్గొనేందుకు వచ్చే క్రీడాకారులను మన కుటుంబ సభ్యులుగా భావించాలన్నారు. నిడ్జామ్ క్రీడలకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా నేను ముందుంటానని తెలిపారు. క్రీడాకారుల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిడ్జామ్ క్రీడలకు టిటిడి తరఫున మైక్ సెట్ ఏర్పాటుకు ముందుకొచ్చారన్నారు. నిడ్జామ్ కు ఎంత ఆర్ధిక సాయం కావాలన్నా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. క్రీడలలో గెలుపు, ఓటములు సహజమని, ఇక్కడ నుండి క్రీడాకారులు తిరిగి సంతోషంగా వెళ్లాలని కోరుకుంటున్నానన్నారు. నిడ్జామ్ లో అధికారులకు ఏదైతే విధులు కేటాయించారో ఆ విధులను అధికారులు తూచా తప్పకుండా నిర్వహించాలన్నారు. ఇక్కడకి వచ్చే క్రీడాకారులకు మనం ఆతిథ్యం కల్పించడం ఎంతో ఆనందంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా తుడా చైర్మన్ నిడ్జామ్ లోగో ను ఆవిష్కరించారు. 
 జేసి 2 చంద్రమౌళి మాట్లాడుతూ తిరుపతిలోని తారక రామా స్టేడియంలో ఈ నెల 23 నుండి 25 వరకు 17వ జాతీయ అంతర్జిల్లాల జూనియర్ అథ్లెటిక్స్ మీట్ (నిడ్జామ్ – 2019) పోటీలు జరగనున్నదన్నారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు భారతదేశంలోని 469 జిల్లాల నుండి 5,111 మంది క్రీడాకారులు, అధికారులు క్రీడలలో పాల్గొంటున్నారన్నారు. అండర్ 14, అండర్ 16 క్రీడలు జరగనున్నదని తెలిపారు. ఈ నిడ్జామ్ లో 2,711 మంది బాలురు, 1,736 మంది బాలికలు, 806 మంది కోచ్ లు పాల్గొంటున్నారని తెలిపారు. ఈ క్రీడల ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం, టిటిడి, తిరుపతి నగర పాలక సంస్థ సంయుక్తంగా చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లలో భాగంగా దాదాపు 1,500 మందికి పైన ఉద్యోగస్తులు తమ విధులను నిర్వహించనున్నారని తెలిపారు. 5,111 మంది క్రీడాకారులకు 12 వెన్యూలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రతి వెన్యూకు ఒక అధికారి ఇంచార్జ్ గా ఉంటారన్నారు. పిడి లు, పిఈ టి లు 620 మందిని 469 జిల్లాలకు కేటాయిస్తున్నామని అలాగే 60 మందిని రిజర్వులో ఉంచడం జరిగిందన్నారు. పిడి లు, పిఈటి లు ఈ నెల 19 వ తేది ఉదయం 10 గం లకు తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో హాజరు కావాలన్నారు. ఒక్కొక్క రోజుకు దాదాపు 1,800 నుండి 2,000 మంది క్రీడాకారులు తిరుపతికి వస్తున్నారన్నారు. క్రీడాకారులను ఎస్.వి యూనివర్సిటీ స్టేడియంకు తీసుకురావలసి ఉంటుందన్నారు. ప్రతి వెన్యూలో కూడా సెక్యూరిటీ ఉంటుందని, అలాగే 3 లేక 4 బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్యాంపస్ హై స్కూల్ లో కామన్ కిచెన్ ఉంటుదన్నారు. ఎస్.వి. యూనివర్సిటీ స్టేడియం ఆవరణంలో భోజనం తయారు చేయడం జరుగుతుందన్నారు. అలాగే క్రీడాకారుల కోసం తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్ల వద్ద బస్సులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి వెన్యూలో కూడా క్రీడాకారుల కోసం బెడ్ షీట్, బకెట్, తదితర సదుపాయాలను కల్పించడం జరుగుతుందన్నారు. రిసెప్షన్ ను డిఆర్డిఏ పిడి, హౌసింగ్ పిడిలు పర్యవేక్షిస్తారన్నారు. ఏ రోజుకారోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలకు సంబంధించి కూపన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఎస్.వి యూనివర్సిటీ స్టేడియం ఆవరణంలో 6 పడకల ఆసుపత్రి ఉంటుందని తెలిపారు. క్రీడాకారులు ఎవరైనా పుణ్య క్షేత్రాలకు వెళ్ళాలనుకుంటే టూరిజం ప్యాకేజి కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిడ్జామ్ విధుల నిర్వహణలో ఏ అధికారికి మినహాయింపు లేదన్నారు. చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి నిడ్జామ్ ఏర్పాట్లకు సహాయంగా రూ.10 లక్షల చెక్కును అందజేయడం జరిగిందని తెలిపారు. అధికారులందరూ ఒకరికోరు సమన్వయంతో పని చేసి నిడ్జామ్ విజయవంతానికి కృషి చేయాలన్నారు. 
 ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా స్థాయి అధికారులు, పిడి లు, పిఈటి లు, వెన్యూ ఇంచార్జ్ లు, కమిటీ లు, తదితరులు పాల్గొన్నారు.