ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు:

 


తేది : 27.03.2020
అమరావతి 


అమరావతి, 27 మార్చి: రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. శుక్రవారం వెలగపూడి సచివాలయంలోని నాల్గవ బ్లాక్ ప్రచార విభాగం ఎదురుగా ఉన్న పచ్చిక ఆవరణలో  సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు:


• 2020 - 2021 ఆర్థిక సంవత్సరమునకు గానూ తొలి 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం : 


సాధారణంగా 2020-21వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను మార్చి నెలాఖరుకు ఆమోదించాల్సి ఉంది. కానీ  అత్యవసర పరిస్థితుల దృష్ట్యా కరోనా వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు అసెంబ్లీ నిర్వహించడం సహేతుకం కాదనే ఉద్దేశ్యంతో మంత్రివర్గం చర్చించి 2020 – 2021 ఆర్థిక సంవత్సరమునకుగానూ తొలి మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టే ఆర్డినెన్స్ కు ఆర్టికల్ 213 (1) ప్రకారం కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే గవర్నర్ ను కలిసి ఆర్డినెన్స్ ఆమోదించుకుంటామని తెలిపారు. అనంతరం బడ్జెట్ కు సంబంధించిన సమాచారం వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.


• కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై కేబినెట్ చర్చ:


కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన తదుపరి చర్యల పై  కేబినెట్ చర్చించింది. లాక్ డౌన్ అనంతర పరిస్థితులపై ప్రజలు ఏమనుకుంటారనే అంశంపై కేబినెట్ లో చర్చించామన్నారు. కరోనా వైరస్ నిరోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాలు, అవలంభిస్తున్న చర్యలు ఏవిధంగా ఉన్నాయన్న అంశంపై ప్రజల అభిప్రాయం తీసుకోవాలని కేబినెట్ లో నిర్ణయించామన్నారు. 


• ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: 


ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేబినెట్ గుర్తించిందన్నారు. విశాఖపట్నంలో 3, విజయవాడలో 3 కేసులు, ఇతర ప్రాంతాల్లో మరో 5 కేసులు నమోదయ్యాయని వివరించారు.


• విదేశాల నుంచి ఏపీకి వచ్చినవారు సుమారుగా 28 వేల మంది ఉన్నారని గుర్తింపు:


విదేశాల నుంచి  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారుగా 28 వేల మంది వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్లు, ఏఎన్ఎం, ఆశావర్కర్ల ద్వారా విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు సేకరించామని వెల్లడించారు.  మొదటి దశ సర్వేలో 13వేల మంది లెక్క తేలగా, రెండవ దశ సర్వేలో ఆ సంఖ్య 28వేలకు చేరిందని వివరించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తొలుత మార్చి 31వరకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఉన్నఫలంగా విదేశాల నుంచి వచ్చిన వారు 13వేల మంది అయితే, లాక్ డౌన్ నేపథ్యంలో ఏప్రిల్ 14వరకు కర్వ్యూ కొనసాగుతుందని ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన మేరకు విదేశాల నుంచి హైద్రాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు వచ్చి మన రాష్ట్రానికి చేరుకున్న వారి సంఖ్య ప్రస్తుతం 28వేలకు చేరిందని మంత్రి వివరించారు,


• కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా ఉండడానికి ప్రభుత్వం చర్యలు :


కోవిడ్-19వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న, తీసుకుంటున్న, తీసుకోబోయే చర్యలపై కేబినెట్ చర్చించిందన్నారు. ఈ మేరకు కరోనా కట్టడి కోసం తీసుకున్న చర్యలను వివరించారు. 104 హెల్ప్ లైన్ కు ఒకేసారి 60 మంది కాల్ చేయవచ్చన్నారు. ఈ హెల్ప్ లైన్ 24x7 ప్రజలకు అందుబాటులో ఉండటమే కాక ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తుందన్నారు. ప్రజలకు ప్రాథమిక అవసరాలు, నిత్యావసర వస్తువులు ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. నగరాల్లో పెద్ద పెద్ద ప్రాంగణాలు, స్టేడియాల్లో కూరగాయలు అందుబాటులో ఉండేలా నిర్ణయించిందన్నారు.


• అందుబాటులో 52వేల ప్రత్యేక ఎన్-95 మాస్కులు :


కరోనా వ్యాధి సోకిన వారు మాత్రమే ప్రత్యేక ఎన్-95 మాస్కులు వినియోగించేలా 52వేల మాస్కులు అందుబాటులో ఉంచామన్నారు. అదే విధంగా 10 లక్షల సర్జికల్ మాస్కులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. ఇవే కాకుండా కరోనా బాధితులను పరీక్షించే డాక్టర్లు, నర్సులు,ఇతర సిబ్బందికి 4వేల పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్(పీపీఈ) అందుబాటులో ఉంచామన్నారు. అత్యవసరమైతే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు వాడే ఎక్విప్ మెంట్ కూడా  కూడా అందుబాటులో  ఉన్నాయన్నారు. ఎన్- 95 మాస్కులు కావాలని జిల్లాల నుంచి విజ్ఞప్తులు వచ్చాయని, ఒకట్రెండు రోజుల్లో మాస్కులు కావాలని ఆర్డర్ చేసిన వారికి అందజేస్తామన్నారు.


• రాష్ట్రస్థాయిలో  4  ఆస్పత్రుల్లో కోవిడ్- 19 చికిత్స కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు:


తొలిదశ కింద రాష్ట్రస్థాయిలో విశాఖపట్టణం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి   ఆస్పత్రుల్లో కోవిడ్-19 చికిత్స కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు  చేశామని తెలిపారు. సుమారుగా 400 వెంటిలేటర్లు అందుబాటులోకి వచ్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఒక్కో ప్రాంతంలో 100 చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆయా ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితులకు ఇంటెన్సెవ్ కేర్ తీసుకుంటారన్నారు. జిల్లా స్థాయిల్లో  200 పడకల ఐసోలేషన్ పడకల ఆస్పత్రిని,  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఐసోలేషన్ పడకల ఆస్పత్రులు ఏర్పాటు చేశామన్నారు. 
ఒకవేళ కరోనా వ్యాప్తి తీవ్రమైతే రెండవ దశ కింద పరిస్థితులను  ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని తెలిపారు. ఏక్షణంలో అయినా ఏర్పాట్లు చేయడానికి  సిద్ధంగా ఉన్న విషయాన్ని మంత్రి వివరించారు.


• ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేబినెట్ చర్చ :


కరోనాకు మందు లేని నేపథ్యంలో పలు జాగ్రత్తలను తీసుకుంటే కరోనాను నియంత్రించే అవకాశముందని కేబినెట్ చర్చించిందన్నారు. ముందుగా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని తెలిపారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. మరీ ముఖ్యంగా రైతుబజార్లు, మెడికల్ షాపులు, నిత్యావసర సరకులు కొనే సమయంలో మనిషికి మనిషికి సుమారు మీటర్ దూరం ఉండేట్లు చూసుకోవాలన్నారు. వికేంద్రీకరణ పాటించాలన్నారు. అదే విధంగా ఇంటిపరిసరాలను, ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. చేతులు శుభ్రంగా శానిటైజర్ తో గానీ లేదా సబ్బుతో గానీ కడుక్కోవాలని సూచించారు. విదేశాలు,  పక్క రాష్ట్రాలు, జిల్లాలు, ప్రాంతాల నుంచి వచ్చిన వారిని గుర్తించాలన్నారు. ఒకవేళ అలాంటి వారు వచ్చినట్లు తెలిస్తే గ్రామ, వార్డు వాలంటీర్లకు, ఏఎన్ఎం, ఆశావర్కర్లకు  విషయం తెలపాలన్నారు. ఇది సామాజిక బాధ్యతతో చేయాలన్నారు.


• గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే కూలీలు, సిబ్బందిపై కేబినెట్ లో చర్చ : 


గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేసే కూలీలు, సిబ్బందికి పని చూపించాలన్నారు.  ఉపాధి హామీ, వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లవచ్చని అయితే కచ్చితంగా సామాజిక దూరం పాటించాలని తెలిపారు. పని అయిన అనంతరం ఇంటికి వెళ్లే సమయంలో శానిటైజర్లు కచ్చితంగా వినియోగించాలని తెలిపారు. వ్యవసాయ కూలీలు, కార్మికులు కూడా ఇదే విధానాన్ని పాటించాలన్నారు.


• అన్ని రకాల సరుకుల రవాణా వాహనాలకు అనుమతి :


అన్ని రకాల సరుకుల రవాణా వాహనాలకు(గూడ్స్) అనుమతి ఇచ్చే దిశగా కేబినెట్ లో నిర్ణయించామన్నారు. 


• మత్స్య రంగం ఎగుమతి దారులతో రేపు అత్యవసర సమావేశం :


ఆక్వా రంగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశాలతో మత్స్యరంగం ఎగుమతిదారులతో రేపు పశుసంవర్థక,మత్స్య శాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణ అత్యవసర సమావేశంగా హైలెవల్ మీటింగ్ నిర్వహించనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఆక్వా ఎగుమతిదారులు, సంబంధిత శాఖాధికారులు ఇచ్చే సూచనలు పరిగణలోకి తీసుకొని ఆ రంగం ఇబ్బంది పడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.


• రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు:


రాష్ట్రస్థాయిలో సీనియర్ ఐఏఎస్ కృష్ణబాబు నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన స్టేట్ లెవల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందంలో నలుగురు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో పాటు ఐదుగురు మంత్రులు ఉంటారని తెలిపారు. వీరంతా కరోనా కట్టడి కోసం చేపట్టాల్సిన చర్యలను పర్యవేక్షిస్తారన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిల్లో కలెక్టర్ నేతృత్వంలో డిస్ట్రిక్ లెవల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో స్టేట్ లెవల్ కమిటీలోని మంత్రులు మినహా జిల్లా మంత్రులు, ఇతర అధికారులు ఉంటారన్నారు.  నియోజకవర్గ స్థాయిల్లో కూడా ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు సభ్యులుగా ఉంటారన్నారు. వీరంతా కరోనా కట్టడి విషయంలో కోఆర్డినేటర్ లుగా వ్యవహరిస్తారన్నారు.



• ప్రతి కలెక్టర్ వద్ద రూ.2 కోట్ల అత్యవసర నిధి ఏర్పాటు :


స్థానికంగా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తక్షణమే స్పందించి వినియోగించుకునేందుకు జిల్లా కలెక్టర్ల వద్ద రూ.2 కోట్ల అత్యవసర నిధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


• ముఖ్యమంత్రి విజ్ఞప్తి :


ఇతర రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, స్థానికులకు ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిని మంత్రి మీడియాకు వివరించారు. కరోనా మందులేని మహమ్మారి అని  ప్రభుత్వం నిస్సహాయతను, అచేతన స్థితిని అర్థం చేసుకోవాలన్నారు. దయచేసి ఇది బాధ్యతతో  కూడిన అంశమని, ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ప్రభుత్వ నిస్సహాయతను అర్థం చేసుకోవాలని కోరారు. 14 నుంచి 28 రోజుల పాటు ఈ వ్యాధి లక్షణాలు బయటపడవని, వ్యాధి లేదని ఎక్కడపడితే అక్కడ తిరగొద్దని తెలిపారు. దయచేసి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండాలని కోరుతున్నామన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఉన్న వారికి ఇబ్బంది లేకుండా చూడాలని ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సీఎం, సిఎస్ మాట్లాడుతున్నారన్నారు. హోం శాఖ మంత్రి, డీజీపీలు ఆయా స్థాయి అధికారులతో మాట్లాడారన్నారు. ఎవరు ఎవరితో తిరిగారు చెప్పలేము కనుక అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.  వసతి, భోజనం కల్పించేలా ఆయా రాష్ట్రాలతో మాట్లాడాలని సీఎం ఆదేశించారని చెప్పారు. 


కూడూ, గూడు లేకుండా ఇబ్బందిపడుతున్న బిచ్చగాళ్ళు, అనాధలతో పాటు వేరే ప్రాంతాల నుండి వలస వచ్చి స్వంత ఊళ్లకు వెళ్లే అవకాశం లేక ఇబ్బంది పడుతున్న వారి కోసం స్థానికంగా ఉండే కళ్యాణ మండపాలను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. అందులో భోజన, వసతి సౌకర్యాలు కల్పించే దిశగా నిర్ణయించామన్నారు. దీన్ని పర్యవేక్షించేందుకు ఒక ప్రత్యేక అధికారిని కూడా ఏర్పాటు చేయనున్నామన్నారు.


• సమాజ హితం అవసరం లేదా? :


పొరుగు రాష్ట్రాల్లో ఉండిపోయిన మన వాళ్ళు ఇక్కడికి రాలేక పరిస్థితి బాధాకరమే కానీ కరోనా మహమ్మారి ఈ విచిత్రమైన పరిస్థితి ని కల్పించిందని మంత్రి వివరించారు. ఎక్కడివారు అక్కడే ఉండాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆదేశం. దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలన్నారు. అందుకే ప్రజలకు చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాము ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించకుండా ఇళ్లకు పంపితే ముప్పు తప్పదని హెచ్చరించారు. ఏపీకి రావాలనుకునే వారు 14 రోజుల క్వారంటైన్ కు సిద్ధపడి వస్తే సరిహద్దుల్లో సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. ఒకవేళ పొరపాటున క్వారంటైన్ కు సిద్ధపడకుండా ఇంటికి వెళితే కుటుంబీలకు, పొరుగువారికి, సమాజానికి, రాష్ట్రానికి ప్రమాదమన్నారు. సరిహద్దుల వద్ద ఆందోళన చెందుతున్న ప్రజల విషయంలో కూడా కొన్ని మీడియాలు ప్రభుత్వాన్ని తప్పు పట్టేలా వ్యవహరిస్తున్నాయని ఇది సరైనది కాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ రేటింగ్ కోసం ప్రయత్నించడం సమంజసం కాదన్నారు. క్వారంటైన్ చేయకుండా రాష్ట్రంలోకి ఎలా అనుమతిస్తామని మంత్రి ప్రశ్నించారు. ప్రజలు కూడా ఘర్షణ వాతావరం సృష్టించకుండా సహృదయంతో పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. పోలీసులు అలాంటివారిపట్ల కఠినంగా వ్యవహరించకుండా నోటిమాటద్వారానే సున్నితంగా విషయం చెప్పాలన్నారు. శృతిమించితే చర్యలకు ఆదేశిస్తామన్నారు. యుద్ధ సమయంలో ఆచరించినట్టే సోషల్ కర్ఫ్యూ పాటించాలని సీఎం కోరినట్లు మంత్రి తెలిపారు. పొరుగు రాష్ట్రాలతో ప్రభుత్వం మాట్లాడుతోందని, ఎవరు సరిహద్దులకు రావొద్దని ఎక్కడివారు అక్కడే ఉండాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఎంత పని చేస్తున్నా ప్రజల సహకారం లేకుండా ఏ పని చేసినా విజయవంతం కాలేదని మంత్రి అభిప్రాయపడ్డారు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image