మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేక కంట్రోల్ రూములు *

మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేక కంట్రోల్ రూములు
* మురికివాడలపై ప్రత్యేక దృష్టి 
* కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు 
* అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో మంత్రి బొత్స సత్యనారాయణ 
విజయవాడ: రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలను సమర్ధంగా నిర్వహించాలని పురపాలక శాఖ కమిషనర్లను, అధికారులను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజల ఆరోగ్య స్థితిగతుల సమాచారంతో పాటు, ముఖ్యxగా విదేశాల నుంచి వచ్చిన వారి పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లోని ప్రజల్లో అవగాహన పెంచాలని, ఇందు కోసం స్వయం సహాయక బృందాల సహాయ సహకారాలను తీసుకోవాలని సూచించారు. క్వారంటైన్ సెంటర్ల నిర్వహణ, మార్కెట్లలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణతోపాటు, అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ అమలు, మొబైల్ రైతు బజార్లు, వలస కూలీల సమస్యలు తదితర అంశాలపై పురపాలక శాఖ ఉన్నతాధికారులతో కలిసి పురపాలక శాఖ కమిషనర్లతో సిఆర్డీడిఎ కార్యాలయం నుంచి  వీడియోకాన్ఫరెన్సు నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా అనుగుణంగా రాష్ట్రంలో కరోనా వ్యాధి ప్రబలకుండా తీసుకుంటున్న చర్యలు, ఇకపై అమలు చేయాల్సిన కార్యాచరణపై కమిషనర్లకు స్పష్టమైన సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్ కు సంబంధించిన సమాచారం నిమిత్తం ప్రతిచోటా ప్రత్యేకంగా కంట్రోల్ రూం లను ఏర్పాటు చేయాలన్నారు. వార్డు వాలంటీర్లు, సెక్రటేరియట్ ల  నుంచి ఎప్పటికప్పుడు నిర్దేశిత నమూనాలో సమాచారాన్ని తెప్పించుకోవాలని, వాటిలోని అంశాల ఆధారంగా ఆయా ప్రాంతాల్లో చర్యలు తీసుకోవాలని, అలాగే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో ఎంతమంది క్వారంటైన్ లేదా స్వీయ నిర్బంధంలో  లో ఉన్నారు, ఇంకా ఎంతమంది ఈ విధంగా నిర్చంధంలోకి రావాల్సి ఉంది వంటి అంశాలతో పాటు, ఇలాంటి వారు వారి బయట తిరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై మంత్రి కమిషనర్లతో సమీక్షించారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ చర్యల్లో భాగంగా పంపిణీ అవుతున్న మాస్కుల నాణ్యతతో పాటు, అవసరమైన మేర సోడియం హైపో క్లోరైట్, బ్లీచింగ్ పౌడర్ ల వంటివి ఉన్నాయా లేదా అన్న వాటిపై మంత్రి ఆరా తీశారు. అలాగే పారిశుద్ధ్య విధులు నిర్వహిస్తున్న వారికి రవాణా సదుపాయాల వంటి వాటిపై కూడా మంత్రి వాకబు చేశారు.  మార్కెట్ ప్రాంతాల్లో సోషల్ డిస్టెన్సింగ్ ను విధిగా పాటించడంతోపాటు, నిర్ణీత వేళల్లోనే అవి పనిచేసేలా చూడాలని మంత్రి స్పష్టంగా ఆదేశించారు. అలాగే ఆన్ లైన్ ద్వారా ఇంటింటికీ సరఫరా చేసే ప్రక్రియలో నిర్దేశించిన మార్గదర్శకాలు పాటిస్తున్నారా లేదా అన్న అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. అలాగే మెస్ లు, రెస్టారెంట్లపై ఆధారపడ్డ విద్యార్ధులను కూడా గుర్తించాలన్నారు. ముఖ్యంగా వలస కూలీల కోసం ఏర్పాటు చేస్తున్న శిబిరాల నిర్వహణపై కూడా ఆయన సమీక్షించారు. వీటితో పాటు వేసవి కాలం దృష్ట్యా మంచినీటి లభ్యత, కొరత ఉన్న చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా మంత్రి బొత్స సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో పురపాలక శాఖ కార్యదర్శి  జె.శ్యామలరావు,  కమిషనర్ మరియు డైరక్టర్ విజయ్‌కుమార్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.