మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం : వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి

ఫ్రంట్‌ లైన్‌ సిబ్బందికి కరోనా
విజయవాడ : వైద్యులు, పారా మెడికల్, రెవిన్యూ, పోలీస్ సిబ్బందిలో కొందరికి కరోనా వైరస్ సోకిందని వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. ఫ్రంట్ లైనులో ఉన్న వారికి కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ 6306 శాంపిళ్లు పరిశీలించాము. 62 శాంపిళ్లు పాజిటివ్ వచ్చాయి. మొత్తం 54341 శాంపిళ్లను పరీక్షించాం. ప్రతి మిలియన్‌కు 1018 మందికి పరీక్షలు చేస్తున్నాం. ఆరేడు జిల్లాల్లో స్టేట్ యావరేజ్ కంటే ఎక్కువగానే పరీక్షలు చేశాం. 46 కేసులు ప్రస్తుతమున్న కరోనా క్లస్టర్సులోనే ఉన్నాయి. 16 కేసులు ఎనిమిది కొత్త క్లస్టర్లలో వచ్చాయి. 7 మండలాల్లో కొత్తగా కేసులు నమోదయ్యాయి. 566 మండలాలు గ్రీన్ కేటగిరిలో ఉన్నాయి. ప్రస్తుతం 100 మంది పేషంట్లు డిశ్చార్జ్ కావడానికి సిద్దంగా ఉన్నారు. వారికి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం మనం యుద్ధం చేస్తున్నాం. ర్యాలీలు చేపట్టొద్దని, సమావేశాలు పెట్టొద్దని నిబంధనలున్నాయి. నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకుంటాం. మిగిలిన రాష్ట్రాల కంటే ఏపీలో మరణాల సంఖ్య ఎక్కువే.. మరణాల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేస్తున్నా’’మని పేర్కొన్నారు.