వింజమూరులో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు:  యం.పి.డి.ఓ కనక దుర్గా భవాని

వింజమూరులో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రణాళికలు:  యం.పి.డి.ఓ కనక దుర్గా భవాని


: వింజమూరు, ఏప్రిల్ 12 (అంతిమతీర్పు-దయాకర్ రెడ్డి): మేజర్ పంచాయితీ అయిన వింజమూరులో ఈ వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు సమృద్ధిగా నీటిని అందించేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి ఎస్.కనకధుర్గా భవానీ పేర్కొన్నారు. ఇందుకు గానూ ఆమె గత వారం రోజుల నుండి పంచాయితీ పరిధిలో ఉన్న ఓవర్ హెడ్ ట్యాంకులు, మినీ రక్షిత మంచినీటి పధకాలను పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసుల రెడ్డి సమక్షంలో పరిశీలిస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో పంచాయితీ సిబ్బందిని అప్రమత్తం చేసి ఓవర్ హెడ్ ట్యాంకులలో క్లోరినేషన్ పనులకు శ్రీకారం చుట్టారు. అందుకు అవసరమైన బ్లీచింగ్ ను ఇప్పటికే పెద్ద మొత్తంలో మండల పరిషత్ కార్యాలయంలో సిద్ధం చేసి ఉన్నారు. సాక్షాత్తూ యం.పి.డి.ఓ తరలి పంచాయితీ కార్యదర్శిని వెంటబెట్టుకుని క్షేత్ర స్థాయిలో తాగునీటి పధకాల వద్దకు వెళుతుండటంతో ఆయా శాఖలకు చెందిన సిబ్బంది సైతం పరుగులు పెడుతున్నారు. 20,639 మంది జనాభా కలిగిన వింజమూరు మేజర్ పంచాయితీ పరిధిలోని పలు ప్రాంతాలలో దాదాపుగా 100కు పైగా మినీ రక్షిత మంచినీటి పధకాలు (డైరెక్ట్ పంపింగ్ స్కీములు), 20 వేల నుండి 45 వేల లీటర్ల నీటి సామర్ధ్యం కలిగిన 8 ఓవర్ హెడ్ ట్యాంకులు నీటి అవసరాల నిమిత్తం పని చేస్తుండగా వాటిలో కొన్ని చిన్న చిన్న మరమ్మత్తులతో మొండికేస్తున్నాయి. ప్రస్తుతం అధికారులు వాటిపై దృష్టి సారిస్తున్నారు. గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులు ఎప్పడు వస్తారో తెలియని పరిస్థితులు వింజమూరులో సర్వ సాధారణమైపోయాయి. ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించిన సంధర్భాలలో మాత్రమే తళుక్కుమంటూ తరువాత
 ముఖం చాటేస్తున్నారనే విమర్శలున్నాయి. గత వేసవిలో వింజమూరు ప్రజలు తాగునీటి కోసం భగీరధ ప్రయత్నాలు చేసి ఏకంగా రిలే నిరాహార దీక్షలకు దిగారు. అయితే ప్రస్తుతం అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు ఇటీవల కాలంలో నూతనంగా భాధ్యతలు చేపట్టిన యం.పి.డి.ఓ తనదైన శైలిలో ఇప్పటికే ప్రజల తాగునీటి అవసరాలకు సంబంధించిన నివేదికలను తెప్పించుకుని నిత్యం ఏదో ఒక ప్రాంతంలో క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తున్నారు. విధి నిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరున్న కనకదుర్గా భవానీ ఇప్పటికే తమ స్వీయ పర్యవేక్షణలో ఉన్న సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లను అప్రమత్తం చేస్తూ ఆయా గ్రామల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.