కరోనా కల్లోలం లోనూ నిమ్మగడ్డ ఆలోచనలేనా?

పగ...ప్రతీకారం !             కరోనా కల్లోలం లోనూ నిమ్మగడ్డ ఆలోచనలేనా?


అమరావతి ఏప్రిల్11 (అంతిమ తీర్పు) :


జగన్ ఆ అవమానం సహించలేకపోతున్నారా?
అందుకే నిమ్మగడ్డ రమేష్ పదవికి ఎసరు
 ఆర్డినెన్స్‌పై వెంటనే గవర్నర్ ఆమోదం
కోర్టుల్లో చెల్లదంటున్న న్యాయనిపుణులు
కుదరదన్న బాబు, కన్నా,  రామకృష్ణ
రాజ్యాంగవిరుద్ధమని గవర్నర్‌కు కన్నా లేఖ
(అమరావతి ప్రత్యేక ప్రతినిధి)
దేశమంతా కరోనా వైరస్ నివారణలో తలమునకలయింది. వైరస్ విస్తరించకుండా చేపట్టవలసిన చర్యలపై, కేంద్రం కంటిమీదకునుకు లేకుండా పనిచేస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకూ, అందరూ కరోనా మహమ్మారిని ఎలా తరిమివేయాలన్నదానిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నారు. అటు  కరోనా అనుమానితులకు చికిత్స అందించేందుకు, వైద్యులు యుద్ధక్షేత్రంలో ముందుండి అహోరాత్రులు కృషి చేస్తున్నారు. లాక్‌డౌన్ అమలు కోసం, పోలీసులు సిపాయిల మాదిరిగా పనిచేస్తున్నారు. పారిశుధ్యపనివారు, నర్సులు తమ కర్తవ్య నిర్వహణలో మునిగిపోయారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం.. ఈ క్లిష్ట సమయంలో కూడా,  స్థానిక సంస్థలు పూర్తి చేయాలన్న తన కోరికను భగ్నం చేసిన, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను ఎలా తొలగించాలి? తమకు కావలసిన వారిని ఎంతమందిని  సలహాదారులుగా నియమించాలి? కరోనాపై కేంద్రం ఇచ్చిన వెయ్యిరూపాయల సాయాన్ని, తన సర్కారు సాయం ఖాతాలో ఎలా వేసుకోవాలన్న ఆలోచనలో నిమగ్నమయినట్లు ఆయన చర్యలు స్పష్టం చేస్తున్నాయి.


స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తూ మార్చి 15న ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై జగన్మోహ న్‌రెడ్డి సర్కారు ఏప్రిల్ 10న ప్రతీకారం తీర్చుకుంది. ఆయన పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించడం ద్వారా, నిమ్మగడ్డపై వేటు వేసింది. ఆమేరకు ఆర్డినెన్స్ ఇవ్వాలన్న జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ కోరికను గవర్నర్ వెంటనే తీర్చడం, రాష్ట్ర న్యాయశాఖ ఆమోదం తెలపడం, ఆ ప్రకారంగా నిబంధనల ప్రకారం, నిమ్మగడ్డ పదవీకాలం ముగిసినట్లు  పంచాయితీరాజ్‌శాఖ జిఓ 31, న్యాయశాఖ 617,618 ఉత్తర్వులి ఆదేశాలివ్వడం చకచకా జరిగిపోయింది. ఇందులో ఎక్కడా తొలగిస్తున్నామన్న పదం లేకుండా జాగ్రత్త పడటం విశేషం.  చివరకు దీనిపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు గవ్నరర్‌కు లేఖ రాసినా,  ఫలితం లేకుండా పోయింది. అయితే, దీనిని కోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు.


ఆ అవమానం మర్చిపోలేకపోతున్నారా?
కరోనా పాజిటివ్ కేసులు ఓవైపు… దాని మరణాల తీవ్రత మరోవైపు పెరుగుతున్నాయి. ఈ క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌ను, ఏవిధంగా ఆ పదవి నుంచి తొలగించాలన్న ప్రయత్నాల్లో బిజీగా ఉండటం విస్మయపరుస్తోంది. దీన్నిబట్టి.. జగన్మోహన్‌రెడ్డి తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోలేకపోతున్నారని, ఎన్నికలు నిలిపివేయడంతోపాటు, తాను నియమించిన ఎస్పీ, కలెక్టర్, డీఎస్పీలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వేటు వేయడాన్ని, నెలరోజులు దాటుతున్నా జీర్ణించుకోలేకపోతున్నారన్నది స్పష్టమయింది. తనను అవమానించిన వారిని ఆయన వదిలిపెట్టరన్న సంకేతం కూడా ఇచ్చింది.


నిబంధనలు ఏమంటున్నాయి?
రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ స్థానంలో, ఒక హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించాలని, ప్రస్తుతం ఉన్న ఆరేళ్ల పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించేలా ఆర్డినెన్స్ ఇవ్వాలని కోరుతూ, జగన్ సర్కారు తాజాగా గవర్నర్‌కు ప్రతిపాదన పంపించడం సంచలనం సృష్టిస్తోంది. కరోనా కారణంగా, స్థానిక సంస్థల ఎన్నిక లు వాయిదా వేస్తూ నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయంపై, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి భగ్గుమన్నారు. ఎప్పుడూ మీడియాతో మాట్లాడని ఆయన, హటాత్తుగా ప్రెస్‌మీట్ ఏర్పాటుచేసి.. నిమ్మగడ్డను విమర్శిస్తూ, ఆయనకు కులాన్ని ఆపాదించేలా బహిరంగంగానే విరుచుకుపడ్డారు. సీఎం నేనా? ఆయనా? అని హుంకరించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని కూడా సీఎం మనసెరిగి, నిమ్మగడ్డకు లేఖ రాశారు. రాష్ట్రంలో మరో నాలుగువారాలు కరోనా వైరస్ ప్రభావం ఉండే అవకాశం లేనందున, స్థానిక సంస్థల నిర్వహణకు అనుమతించాలని లేఖలో కోరారు. ఈ మధ్యలో ఎన్నికల సంఘం మాజీ కమిషనర్‌ని హుటాహుటిన పిలిపించి, నిమ్మగడ్డను ఎలా సాగనంపాలో మంతనాలు జరిపారు.


జగన్మోహన్‌రెడ్డి మనోభావాలకు అనుగుణంగానే.. స్పీకర్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేల వరకూ నిమ్మగడ్డను.. వాడు, వీడు అని సంబోధిస్తూ విమర్శలు కురిపించారు. ఓ ఎమ్మెల్యే అయితే లోఫర్ అని కూడా తూలనాడారు. ఇంకో ఎమ్మెల్యే కులగజ్జి వెధవ అని తిట్టిపోస్తూ,  నిమ్మగడ్డకు కులాన్ని ఆపాదించారు.
హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ చెప్పినా…
స్థానిక సంస్ధల ఎన్నికల వాయిదాపై, నిమ్మగడ్డ నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్ధించింది. అయినా సరే.. పగ, ప్రతీకారంతో రగిలిపోతున్న జగన్మోహన్‌రెడ్డి సర్కారు, సుప్రీంకోర్టుకు వెళ్లింది. అక్కడ కూడా నిమ్మగడ్డ నిర్ణయానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. విచిత్రంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ నిమ్మగడ్డ నిర్ణయాన్ని స్వాగతించాయి. నిమ్మగడ్డ అధికారం తగ్గిస్తూ మరో ఇద్దరిని కమిషనర్లుగా నియమించే ఆలోచన కూడా చేసినా, ఎందుకో దానిని అమలుచేయలేదు. చివరాఖరకు ఆ హోదా స్థానంలో హైకోర్టు మాజీ జడ్జిని నియమించి, మూడేళ్ల పదవీకాలానికి పరిమితం చేసేలా ఆర్డినెన్స్ ఇవ్వాలని గవర్నర్‌ను కోరగా, మూడేళ్ల పదవీకాల పరిమితిని కుదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు.


నిమ్మగడ్డ లేఖతో కలకలం
కాగా, తనకు రక్షణ లేదని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో లేవంటూ నిమ్మగడ్డ, కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపింది. తొలుత దానిని వైసీపీ ఫేక్ లెటర్‌గా యాగీ చేసింది. తర్వాత కేంద్రహోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి, ఆయన లేఖ రాసిన మాట వాస్తవమేనని వెల్లడించడంతో వైసీపీ వర్గాలు తెల్లముఖం వేయాల్సి వచ్చింది. నిమ్మగడ్డ లేఖ తర్వాత, ఆయనతోపాటు, బెజవాడలోని ఆయన ఆఫీసుకు భద్రత పెంచారు. తాను హైదరాబాద్‌లోనే ఉంటూ విధులు నిర్వర్తిస్తానని నిమ్మగడ్డ లేఖలో పేర్కొన్న నేపథ్యంలో, ఆ విషయాన్ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్.. తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఇదీ జగన్ వర్సెస్ నిమ్మగడ్డ వ్యవహారంలో జరిగిన సంఘటనలు.
చెల్లదంటున్న న్యాయనిపుణులు
అయితే.. జగన్ ప్రయత్నాల ఫలితంగా వచ్చిన ఆర్డినెన్స్  రాజ్యాంగపరంగా చెల్లుబాటు కావని న్యాయనిపుణులు స్పష్టం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా, అసలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్లుగా హైకోర్టు మాజీ న్యాయమూర్తులు లేరని గుర్తు చేస్తున్నారు.  జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం గవర్నర్‌కు చేసిన ఈ సిఫార్సు, ఇచ్చిన ఆర్డినెన్స్ కూడా,  రాజ్యాంగవిరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయవాది గల్లా సతీష్ వ్యాఖ్యానించారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 1951లో ఏర్పడిన ఈ చట్టంలో.. సెక్షన్ 19 ఏ ప్రకారం, కేంద్ర ఎన్నికల కమిషనర్ తన విధులు నిర్వహించుకునేందుకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్లను నియమించిదని చెప్పారు. ఆ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో నియమించబడిన సదరు రాష్ట్ర ఎన్నికల కమిషనర్, విధిగా అఖిలభారత సర్వీసుకు చెందిన వారై ఉండాలని చట్టం పేర్కొందని వివరించారు. సెక్షన్ 146 (బి) ప్రకారం..  సదరు అధికారి తన విధులను ఎక్కడనుంచయినా నిర్వర్తించుకునే అధికారం కూడా ఉందని చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం ఆరేళ్లు లేదా 65 సంవత్సరాలుగా నిర్దేశించారని వివరించారు. ఒకవేళ ఆయనను తొలగించాలంటే, కేంద్ర ఎన్నికల కమిషన్ లేదా లోక్‌సభకు ఆ అధికారం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఆయనను తొలగించకుండా, పదవీకాలం తగ్గిస్తూ సిఫార్సు చేసినందున.. రాజ్యాంగం ప్రకారం, అది కూడా చెల్లదని స్పష్టం చేశారు. దీనిపై గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చినా చెల్లదని, ఆ అధికారం కేవలం సీఈసీకే ఉందని చెప్పారు. ఆరేళ్ల ఎన్నికల సంఘం కమిషనర్ల పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించాలంటే, రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. ఎవరైతే నియమిస్తారో, వారే తొలగించాల్సి ఉంటుందన్నారు.  హైకోర్టు మాజీ న్యాయమూర్తులు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్లుగా దేశంలో ఎక్కడా లేరని, చట్టంలో కూడా ఆవిధంగా లేదని గల్లా సతీష్ వివరించారు.


ఆర్డినెన్స్‌కు ఇది సందర్భమా?
దేశం మొత్తం కరోనా కల్లోలంలో మునిగి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలని ఆరాటపడుతున్న సమయంలో.. నిమ్మగడ్డ వ్యవహారంపై దృష్టి సారించడాన్ని,  అన్ని వర్గాలు ఆక్షేపిస్తున్నాయి. అసలు లాక్‌డౌన్ ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి. స్వయంగా ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ కొనసాగించాలని కేంద్రాన్ని కోరింది. అంటే కరోనా తీవ్రత, వైరస్ ప్రభావం ఏ స్ధాయిలో ఉందో స్పష్టమవుతూనే ఉంది. ఈ విపత్తు సమయంలో, సర్వశక్తులూ దానిపైనే కేంద్రీకరించాల్సింది పోయి, వ్యక్తిగత కక్షలకు, ప్రతిష్టకు వెళ్లడాన్ని ప్రతిపక్షాలు నిరసిస్తున్నాయి. దీన్నిబట్టి.. జగన్ ప్రభుత్వం తనను వ్యతిరేకించేవారిని, సమయం సందర్భం లేకుండా వెంటాడుతోందన్న విషయం స్పష్టమవుతోందంటున్నారు. అసెంబ్లీ పంపిన బిల్లును వెనక్కి పంపినందుకు, కౌన్సిల్‌ను కూడా రద్దు చేశారని గుర్తు చేస్తున్నారు.


ఇదేం పద్ధతి?: విపక్షం
కాగా జాతి విపత్తు సమయంలో కూడా.. తనను వ్యతిరేకించిన వారిని తొలగించడం, కావలసిన వారికి పదవులిస్తూ ఉత్తర్వులిస్తున్న ప్రభుత్వాన్ని ఇక్కడే చూస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఆర్డినెన్స్ ద్వారా, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని జగన్ రుజువుచేశారన్నారు. జగన్ తీరు చూస్తుంటే హైకోర్టును కూడా రద్దు చేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఇంతటి అరాచకాలు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నారని, కిట్లు లేవని చెప్పినందుకు నిమ్మగడ్డ రమేష్‌ను సాధించేందుకు, జగన్ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆరేళ్ల పదవీకాలం నిర్దేశాన్ని ఇప్పుడు మార్చడం కుదరదన్నారు. దీనిపై తాము గవర్నర్‌కు లేఖ రాశామన్నారు. కరోనాపై దేశమంతా యుద్ధం చేస్తుంటే, జగన్ మాత్రం తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిపైనే ఎక్కువ దృష్టి సారించడం దురదృష్టకరమన్నారు. ఈ శ్రద్ధ పాలనపై పెట్టాలని కన్నా సూచించారు.


ఆర్డినెన్స్‌పై తెలుగుదేశం అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు కూడా విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రక్రియ సగంలో ఆగి ఉన్న సమయంలో, దొడ్డిదారిన ఎస్‌ఈసీని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు ఈ-మెయిల్ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని సెక్షన్ 243 (కె) ప్రకారం,  2016లో ఆరేళ్ల పదవీకాలానికి నిమ్మగడ్డ నియమింపబడ్డారని గుర్తు చేశారు. ఎలాంటి నిబంధనయినా కమిషనర్ పదవీకాలం ముగిసిన తర్వాతనే చేయాలని, ఈలోగా ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని బాబు  కోరారు.
జగన్ కక్షసాధింపు, ఫ్యాక్షనిస్టు మనస్తత్వం మరోసారి బయటపడిందని, తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు విరుచుకుపడ్డారు. జగన్ ప్రయత్నాలు కోర్టులో చెల్లవని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కూడా కక్ష సాధింపు చర్యలేమిటని నిలదీశారు. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ కూడా, ఎస్‌ఈసీ విషయంలో జగన్ ప్రయత్నాలను ఖండించారు. గవర్నర్ ఇలాంటి వాటిని ప్రోత్సహించకూడదన్నారు. గవర్నర్ ఆర్డినెన్స్ దురదృష్టకరమని, ప్రజాస్వామ్యానికి ఇదో గాయమన్నారు.


Popular posts
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
*అనుమానాస్పద స్థితిలో యువకుని మృతదేహం లభ్యం...* వింజమూరు,అక్టోబర్ 20 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా వింజమూరులో నూతన ప్రభుత్వ వైద్యశాల సమీపంలోని ముళ్లపొదల్లో వింజమూరు మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన జోకా. హరిప్రసాద్ అనే యువకుని మృతదేహాన్ని గుర్తించినట్టు ఎస్సై ఏ బాజిరెడ్డి తెలిపారు. మృతుని సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాల కోసం దర్యాప్తు చేపట్టారు. సదరు వ్యక్తి కూలి పనిచేసుకునే వ్యక్తి అని భార్యతో కలిసి జీవిస్తున్నాడని తెలిపారు. మృతుడు సోమవారం రాత్రి మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం పశువుల కాపరి అటుగా వెళ్లి మృతదేహాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులు తెలియజేశారని సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉందని యస్ ఐ బాజిరెడ్డి తెలిపారు.
Image