*జనార్ధనపురంలో పిడుగు పడి వ్యక్తి మృతి* వింజమూరు, సెప్టెంబర్ 7 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని జనార్ధనపురం బి.సి కాలనీలో సోమవారం సాయంత్రం పిడుగు పడి ఇండ్ల.మాలకొండయ్య (అలియాస్ పుల్లయ్య) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాలలోకి వెళితే జనార్ధనపురంలోని బి.సి. కాలనీకి చెందిన ఇండ్ల.మాలకొండయ్య, సుశీల దంపతులు మర్రిపాడు మండలంలోని సండ్రపల్లిలో ఉంటున్నారు. ఈ నేపధ్యంలో సోమవారం సాయంత్రం మాలకొండయ్య స్వగ్రామమైన జనార్ధనపురంకు వచ్చాడు. అప్పటికే వర్షం పడుతుండటంతో ప్రయాణంలో తడిసి ముద్దయిన మాలకొండయ్య ఇంటి ఆవరణలోని రేకుల షెడ్డు క్రింద బట్టలు మార్చుకుంటున్న సమయంలో పిడుగుపాటుకు గురయ్యాడు. వెంటనే ఇంటిలో ఉన్న ఆయన చెల్లెలు బయటకు వచ్చి చూడగా మాలకొండయ్య విగతజీవిగా పడి ఉన్నాడు. కాగా మృతి చెందిన మాలకొండయ్యకు పెద్ద మాల్యాద్రి, చిన్న మాల్యాద్రి, మల్లికార్జున ముగ్గురు కుమారులు, దనమ్మ, భాగ్యమ్మ అను ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మాలకొండయ్య మృతితో జనార్ధనపురం గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.