*హైటెక్ వ్యభిచారం ముఠా గుట్టురట్టు.. నిర్వహకుడి ప్లాన్లు తెలిసి ఆశ్చర్యపోయిన పోలీసులు*
విశాఖపట్నం: హైటెక్ పద్ధతిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును రెండో పట్టణ పోలీసులు రట్టు చేశారు. ముంబై, బెంగళూరుకు ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకోగా విటులు పరారైపోయారు. నిర్వాహకుడు ఎక్కడో వుంటూ ఫోన్ ద్వారానే లావాదేవీలు నడిపిస్తుండడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి సంబంధించి టూటౌన్ సీఐ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ముంబైకి చెందిన యువతి హైదరాబాద్ నుంచి ఈనెల 20న, బెంగళూరుకి చెందిన యువతి కోల్కతా నుంచి ఈనెల 22న విమానంలో నగరానికి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా కారులో అల్లిపురంలోని విశాఖ ఇన్ హోటల్కు చేరుకుని అప్పటికే వారి పేరిట బుక్ చేసి వున్న గదుల్లో దిగారు. హోటల్లోని వారి గదుల్లోకి కొంతమంది విటులు వెళ్లి వస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈనెల 22న టూటౌన్ సీఐ సీహెచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు హోటల్పై దాడి చేయగా ఇద్దరు యువతులు పట్టుబడ్డారు. విటులు మాత్రం కొద్దిసేపటికి ముందే బయటకు వెళ్లిపోవడంతో తప్పించుకున్నారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా హైటెక్ పద్ధతిలో జరుగుతున్న వ్యభిచారం గుట్టు విప్పారు.
తమకు రిషి అనే వ్యక్తి మాత్రమే తెలుసునని, ఆయన చెప్పినట్టు తాము చేస్తామని తెలిపారు. తాము ఎక్కడికి వెళ్లాలనేది ఫోన్లోనే చెబుతాడని, తమకు విమానం టిక్కెట్లు కూడా అతనే బుక్ చేసి మెయిల్ చేసేస్తాడని వివరించారు. ఏ నగరానికి వెళ్లినా అక్కడ హోటల్ రూమ్ నుంచి కారు వరకూ అన్నీ బుక్ చేసి తమ ఫోన్కు వాటి వివరాలు మెసేజ్ చేస్తాడని తెలిపారు. ఏ నగరానికి వెళ్లినా రెండు రోజులు మాత్రమే వుంటామని, తర్వాత రూమ్ ఖాళీ చేసి వేరే రాష్ట్రానికి వెళ్లిపోతుంటామని వివరించారు. ఒక్కో విటుడికి రూ.1,500 చొప్పున తమ ఖాతాకు జమ చేస్తాడని పట్టుబడిన యువతులు వివరించారు. విటులు కూడా నేరుగా రిషినే సంప్రతిస్తారని, వారి పేరును మాత్రం తమకు ఫోన్ చేసి చెబుతాడని చెప్పడం గమనార్హం. పట్టుబడిన యువతులను శనివారం పునరావాస కేంద్రానికి తరలించామని, హోటల్ను మెజిస్ర్టేట్ సమక్షంలో తనిఖీ చేసినట్టు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. రిషి కోసం గాలిస్తున్నామని త్వరలోనే అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.