అమరావతి.
*రెండు రోజుల ఢిల్లీ పర్యటనకు సిద్ధమైన పరిశ్రమలు,వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
• కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల సమీకరణ లక్ష్యంతో సాగనున్న మంత్రి పర్యటన
• ఢిల్లీలో ఆరుగురు కీలక కేంద్ర మంత్రులతో రెండు రోజుల పాటు మంత్రి మేకపాటి భేటీ
• 25వ తేదీన తొలిరోజున కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, రవిశంకర్ ప్రసాద్, అరవింద్ గణపత్, అనురాగ్ ఠాకూర్ లతో భేటీ
• ఆర్థిక సహాయం, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటుపై మంత్రులతో చర్చించనున్న మేకపాటి
• ఐ.టీ, ఇండస్ట్రీ పాలసీ, సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమల గురించీ చర్చించనున్న మంత్రి
• 26వ తేదీ, రెండో రోజున రాజ్ కుమార్ సింగ్, రామేశ్వర్ తేలిలను కలిసే అవకాశం
అమరావతి, సెప్టెంబర్ 24 : కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టడమే లక్ష్యంగా పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 25, 26 తేదీలలో రెండు రోజుల పాటు (బుధ,గురువారం) ఐదుగురు కేంద్రమంత్రులతో సమావేశమవనున్నారు. పర్యటనలో భాగంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ; ఐ.టీ , న్యాయ, కమ్మునికేషన్ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్; నైపుణ్యాభివృద్ధి, విద్యుత్ శాఖ సహాయ మంత్రి రాజ్ కుమార్ సింగ్; ఆర్థిక , కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్; ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలనుకుంటోన్న ప్రపంచ స్థాయి నైపుణ్య శిక్షణ గురించి రాజ్ కుమార్ సింగ్ తో చర్చించనున్నారు. నైపుణ్య కేంద్రాల ఏర్పాటుకు నియమించిన జాయింట్అ టాస్క్ ఫోర్స్ గురించి ఆర్థిక మంత్రి అనురాగ్ సింగ్ కు వివరించి, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే నిధులపై మంత్రి మేకపాటి చర్చించనున్నారు. ఎగుమతులకు అనివార్యమైన రవాణారంగం , పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి వంటి అనేక అంశాలపై కేంద్రమంత్రులకు స్పష్టంగా వివరించనున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ప్రత్యేకంగా పరిగణించి సహాయ, సహకారాలు అందించాలని మేకపాటి కోరనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో పెట్టుబడులు ఆకర్షించేందుకు కసరత్తు చేస్తున్న ఐ.టీ పాలసీ, పారిశ్రామిక విధానాలలో ప్రాధాన్యతలపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చర్చించనున్నారు.