నిఘా నీడలో రొట్టెల పండుగ
నగర వ్యాప్తంగా పోలీసు బందోబస్తు
1979 మంది పోలీసులకు విధులు
సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
మఫ్టీలో పోలీసు బృందాలు
పిక్పాకెటర్లు, దొంగలపై ప్రత్యేక నిఘా
పార్కింగ్ ప్రాంతాల గుర్తింపు
నెల్లూరు : ప్రతిష్ఠాత్మకంగా రొట్టెల పండుగకు పోలీసులు సిద్ధమయ్యారు. ఐదు రోజులు జరిగే రాష్ట్ర పండగకు వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రొట్టెల పండుగ జరిగే ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దర్గా ప్రాంగణం, స్టాల్స్, స్వర్ణాల చెరువు, బోటు షికారు, పార్కు, పార్కింగ్ ప్రాంతాలు ఇలా పండుగకు సంబంధించిన ప్రతి ప్రాంతంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి సూచనల మేరకు సిబ్బందిని నియమించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల కోసం పలుచోట్ల పార్కింగ్ ప్రాంతాలను గుర్తించారు. వాటిలోనే వాహనాలు నిలపాలని పోలీసులు సూచిస్తున్నారు.
1979 మంది సిబ్బంది : ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు రొట్టెల పండగ జరగనుంది. దీనికోసం 1979 మంది సిబ్బందితో పోలీసు శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఎస్పీ పర్యవేక్షణలో 13 మంది డీఎస్పీలు, 46 మంది సీఐలు, 118 మంది ఎస్ఐలు, 1602 మంది సివిల్ పోలీసులు, 200 ఏఆర్, కృష్ణపట్నం పోర్టు సిబ్బంది ఇలా మెత్తం 1979 మందిని బందోబస్తుకు ఉపయోగిస్తున్నారు.
50 కెమెరాలతో నిఘా : బారా షహీద్ దర్గా ఆవరణ మొత్తం 50 కెమెరాలను పోలీసు శాఖ ఏర్పాటు చేయనుంది. వాటిలో 40 ఫిక్స్డ్ కెమెరాలు, ఎనిమిది రొటేటెడ్ కెమెరాలు, రెండు డ్రోన్లతో నిరంతరం పోలీసులు పర్యవేక్షించనున్నారు. దర్గా ఆవరణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పోలీసు శాఖ ఐదు మానిటరింగ్ టీవీల్లో వీక్షించనున్నారు. స్వర్ణాల చెరువు వద్ద రెడ్ మార్కును ఎవరైనా భక్తులు దాటితే అప్రమత్తం చేసేందుకు ఓ కెమెరాను ఏర్పాటు చేశారు. భక్తులు రెడ్ మార్కు దాటగానే పోలీసు శాఖ అలర్ట్ చేస్తుంది. హైటెక్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఆధ్వర్యంలో ఓ సాఫ్ట్వేర్ ద్వారా బారా షహీద్ దర్గాలోకి ఎంత మంది భక్తులు వస్తున్నారనే దానిపై ఎప్పటికప్పుడు కౌంటింగ్ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
నగరంలో ఎక్కడికెక్కడ నిఘా : రొట్టెల పండుగ కోసం పలు రాష్ట్రాల నుంచేకాక విదేశాల నుంచీ భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. దీంతో రొట్టెల పండుగ జరిగే రోజుల్లో నెల్లూరు నగరం యాత్రికులతో కిటకిటలాడుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వేలాది వాహనాలు, లక్షలాది మంది ప్రజలతో నగరంలో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఈ సమయంలోనే దొంగలు కూడా విజృంభించే అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఎక్కడికక్కడ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు, ప్రధాన కూడళ్లలో ప్రత్యేక నిఘా ఉంచుతున్నారు.
నిఘా నీడలో రొట్టెల పండుగ