ఓం శ్రీ స్వామియే...శరణం అయ్యప్పా..        

ఓం శ్రీ స్వామియే...శరణం అయ్యప్పా..        


వింజమూరు:


వింజమూరులోని ప్రసన్నరెడ్డి నగర్ నందు పోస్టాఫీసు వీధిలో వెలసియున్న శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి సన్నిధిలో కార్తీక మాసమును పురస్కరించుకుని మాలధారణ భక్తులకు అన్నదానం చేసేందుకు పలువురు దాతలు బారులు తీరుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం నాడు మూరం రెడ్డి. రమణారెడ్డి జ్ఞాపకార్ధం ఆయన సతీమణి పెంచల లక్ష్మమ్మ, వారి కుమారులు రవిచంద్రారెడ్డి, వెంగళరెడ్డిలు అయ్యప్ప, గోవింద మాలధారణ భక్తులకు అన్నదానం చేశారు. వింజమూరులో రెండు దశాబ్ధాల నుండి కూడా శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ఎంతో ప్రాచుర్యం పొందింది. అక్టోబర్ నెల నుండి కూడా ఈ దేవస్థానంలో అయ్యప్ప మాలలు వేసేందుకు భక్తులు ఉత్సాహం చూపుతుంటారు. ప్రతి యేడాది కూడా గురుస్వాములు ఈ ఆలయంలో మాలధారణ భక్తులకు పూజా కైంకర్యాల విషయంలో సకల సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రత్యేకంగా శబరిమల యాత్రకు బస్సులు నడుపుతూ భక్తుల విశ్వాసమును చూరగొంటున్నారని చెప్పవచ్చు. కార్తీక మాసంలో అన్నదానం చేసేందుకు ఈ ఆలయంలో పలువురు ముందుగానే రిజర్వ్ చేసుకోవడం ఈ ఆలయం ప్రత్యేకత. ఇంటిల్లిపాదీ భక్తులకు ఆశీర్వచనాలు పలికి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేస్తుంటారు. బుధవారం నాటి అన్నదాన కార్యక్రమాలలో ఆలయ నిర్వాహకులు చేబ్రోలు.వసంతరావు, ఏ.సి.డి.సి ప్రసాద్, చాకలికొండ హైస్కూలు పి.ఇ.టి మాస్టారు వెలుగోటి.క్రిష్ణ, మనం పౌండేషన్ చైర్మన్, వి మొబైల్స్ ప్రొప్రయిటర్ చిట్టమూరి.హరీష్, పూర్ణా షాపింగ్ మాల్ అధినేత శేగు.పూర్ణచంద్రరావు, బొగ్గల.మస్తాన్ రెడ్డి, సూరం.అయ్యపురెడ్డి, కరకల.కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు...