డిఎవి పబ్లిక్ స్కూల్లో నమూనా ఐక్యరాజ్య సమితి

డిఎవి పబ్లిక్ స్కూల్లో నమూనా ఐక్యరాజ్య సమితి
హైదరాబాద్  : హైదరాబాదు సఫిల్ గూడ లో ప్రఖ్యాతి చెందిన స్థానిక డిఎవి పబ్లిక్ స్కూల్లో నమూనా ఐక్యరాజ్య సమితి నిర్వహించడం జరిగింది. దాదాపు 15 పాఠశాలల నుండి 300 మంది విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ సెమినార్ ను 8 నవంబరు నుండి 10 నవంబరు వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా సాంఘిక మరియు గిరిజన ఆశ్రమ పాఠశాలల సెక్రటరీ ప్రవీణ్ కుమార్  ముఖ్యఅతిథిగా  పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేసారు.ఈ ఎంయూఎన్ లో పాల్గొన్న విద్యార్ధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ  ప్రవీణ్ కుమార్ నేడు ప్రపంచాన్ని పట్టి వేధిస్తున్న వివిధ సమస్యలపై విద్యార్ధులు అవగాహన కలిగి ఉండాలని, పేపర్లపై ప్రణాళికలకు, క్షేత్ర స్థాయిలో జరిగే వాస్తవాలకు మధ్య గల వైరుధ్యాలను అర్ధం చేసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం విద్యావిధానంలో తీసుకొస్తున్న మార్పులను వివరించారు. ప్రపంచ రాజకీయాల మీద, అంతర్జాతీయంగా దేశాల మధ్య గల సంబంధ బాంధవ్యాల మీద ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను గురించి వివరించారు. ఈ ఎంయూఎన్ లో జాతీయంగా వివిధ పాఠశాలల ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్లు, సభ్యులు పాల్గొనడంతో ఇది జాతీయ స్థాయి సెమినార్ గా రూపుదిద్దుకొంది. డిఎవి పబ్లిక్ స్కూల్, సఫిల్ గూడ ప్రిన్సిపాల్  కె. పార్తిపన్ మాట్లాడుతూ విద్యార్ధులు ధారాళంగా మాట్లాడడం లోనూ, సంస్కార వంతమైన ప్రవర్తనకూ, ఆరోగ్య కరమైన చర్చలకూ, సమీకృత కార్య సాధనకూ, ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ ఎంయూఎన్ లో వివిధ అంతర్జాతీయ సమస్యలైన ఆఫ్ఘనిస్తాన్, లింగ వివక్ష లేని సమ సమాజం, అంతర్జాతీయ భద్రత, డ్రగ్స్ మరియు నేరాలపై ఐరాస, లోక్ సభ మున్నగు విషయాలపై డెలిగేట్స్ మధ్య చర్చలు జరుగనున్నాయి. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్ధులలో నాయకత్వ లక్షణాలు, సమిష్ఠి కృషి వంటి ఉత్తమ గుణాలు పెంపొందుతాయని వక్తలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన భూమిక గా బ్రింగ్ యువ ఓన్ బాటిల్ అనే నినాదాన్ని విడుదల చేసారు.