వెరీ వెరీ స్పెషల్‌’కు శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్

'వెరీ వెరీ స్పెషల్‌'కు శుభాకాంక్షలు తెలుపుతూ చంద్రబాబు ట్వీట్
అమరావతి : టీమిండియా మాజీ క్రికెటర్‌ వీవీఎస్ లక్ష్మణ్‌కు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. తన అద్భుతమైన ఆటతీరుతో భారతదేశ క్రికెట్ రంగానికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. క్రికెట్ అభిమానులతో 'వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్'గా పిలిపించుకుని, తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేశారని అభినందించారు. 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్న లక్ష్మణ్‌ పూర్తి పేరు వంగీవరపు వెంకట సాయి లక్ష్మణ్. 1996లో క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హైదరాబాదీ.. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. మొత్తం 134 టెస్టుల్లో 8781 పరుగులు, 86 వన్డేల్లో 2338 రన్స్ చేశారు. భారత క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ సొగసరి బ్యాట్స్‌మెన్.. సచిన్, ద్రవిడ్, గంగూలీల సరసన చేరాడు. ఆస్ట్రేలియాతో ఈడెన్ గార్డెన్స్‌లో ఆడిన 2001నాటి టెస్ట్ మ్యాచ్‌లో లక్ష్మణ్‌ చేసిన 281 పరుగులు.. కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా చెబుతుంటారు. అంతేగాక ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్ ఇన్నింగ్స్‌గా క్రికెట్ నిపుణులు అభివర్ణిస్తుంటారు.