*05.04.2020*
*అమరావతి*
*కోవిడ్ –19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు లాక్ డౌన్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం*
*రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కొనసాగుతున్న కోవిడ్ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్*
*ఇప్పటి వరకు 252 పాజిటివ్ కేసులు:*
రాష్ట్రంలో కొత్తగా మరిన్ని కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 252కి చేరింది.
కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఒక్కరోజే 26 కేసులు నమోదు కావడంతో ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది.
రాష్ట్రంలో కోవిడ్–19 పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు
ఇక కర్నూలు జిల్లాలో అత్యధికంగా 53 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 34, గుంటూరు జిల్లాలో 30, కృష్ణా జిల్లాలో 28, వైయస్సార్ కడప, ప్రకాశం జిల్లాలలో 23 చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఇంకా చిత్తూరు జిల్లాలో 17 కేసులు, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలలో 15 చొప్పున, తూర్పు గోదావరి జిల్లాలో 11, అనంతపురం జిల్లాలో 3 కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.
కాగా, కరోనా వైరస్కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 6 గురు డిశ్చార్జ్ అయ్యారు.
విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, కృష్ణా జిల్లాలో ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు.
లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన పేదలకు రూ.1000 చొప్పున ప్రభుత్వం చేయూత:
1.33 కోట్ల బియ్యం కార్డుదారులకు రూ.1330 కోట్లు కేటాయింపు.
రెండో రోజూ కొనసాగిన రూ.1000 చొప్పున ఆర్థిక సహాయం పంపిణీ.
తొలిరోజు దాదాపు 58% బియ్యం కార్డుదారులకు ఆర్థిక సహాయం పంపిణీ చేయగా, రెండో రోజు సాయంత్రానికి 85.2 శాతం పంపిణీ చేశారు.
1,13,36,799 బియ్యం కార్డుదారులను వార్డు వలంటీర్లు రూ.1000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
*కోవిడ్ –19 విస్తరణ, నివారణా చర్యలపై సీఎం శ్రీ వైయస్ జగన్ సమీక్ష:*
ప్రతి ఆస్పత్రిలోనూ ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం.
ప్రతి జిల్లాలోనూ ఒక టెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశం.
కరోనా వైరస్ సంబంధిత లక్షణాలతో ఎవరు వచ్చినా.. కోవిడ్ పేషెంట్గానే భావించి ఆ మేరకు వైద్య సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందించాలని సీఎం ఆదేశం.
ఢిల్లీలో జమాత్కు వెళ్లిన వారు, వారి ప్రై మరీ కాంటాక్టŠస్కు పరీక్షలు వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశం.
ఇప్పుడున్న ల్యాబ్ల సామర్థ్యాన్ని కూడా పెంచాలని నిర్దేశం.
ప్రతి ఇంటి ఆరోగ్య పరిస్థితిపై నిరంతరాయంగా సర్వే జరుగుతుండాలని మరోసారి స్పష్టం చేసిన సీఎం.
*ఇక జిల్లాల వారీగా వివరాలు:*
*శ్రీకాకుళం జిల్లా:*
లాక్ డౌన్ కారణంగా గుజరాత్లోని వీరావల్ పట్టణంలో చిక్కుకున్న మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ భరోసా ఇచ్చారు. ఆ మత్య్సకారుల స్థితిగతులను పరిశీలించి వారికి అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఆదివారం జిల్లా నుంచి ప్రత్యేక బృందం బయలుదేరింది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వల్ల జిల్లాకు చెందిన 1500 మంది, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన మరో 3500 మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రం సోమ్ గిరినాథ్ జిల్లా వీరావల్ పట్టణంలో చిక్కుకుపోయారని కలెక్టర్ తెలిపారు. అక్కడ జిల్లా యంత్రాంగంతో మాట్లాడి వారికి అవసరమైన రేషన్, ఇతర ఏర్పాట్లను ఇప్పటికే ఏర్పాటు చేశామని చెప్పారు.
సీఎం శ్రీ వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఇప్పుడు జిల్లా నుంచి ప్రత్యేక బృందాన్ని పంపామని, వీరు అక్కడికి వెళ్లి మత్స్యకారుల పరిస్థితులను గమనించి, అక్కడి యంత్రాంగంతో మాట్లాడి వారికి అవసరమైన తాగునీరు, భోజనం, తగిన బస, వైద్య సదుపాయాలు కల్పిస్తారని కలెక్టర్ వెల్లడించారు. ఆ మేరకు అవసరమైన సామాగ్రి తీసుకువెళ్లారని చెప్పారు. మత్స్యకారులు మాత్రమే కాకుండా జిల్లా వాసులు ఎక్కడన్నా చిక్కుకుపోతే వారిని కూడా ఆదుకుంటామని స్పష్టం చేశారు.
*విజయనగరం జిల్లా:*
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కోవిడ్–19పై ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ను కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్, ఎస్పి బి.రాజకుమారితో కలిసి ఆదివారం పరిశీలించారు. అక్కడి నుంచి నిర్వహిస్తున్న కార్యక్రమాలను, ఏర్పాటు చేసిన విభాగాలను, వాటి విధులను అసిస్టెంట్ కలెక్టర్ కేతన్ గార్గ్ వారికి వివరించారు. క్యూఐసి, క్వారంటైన్, సర్వైలెన్స్, హూమన్ రీసోర్స్, డాటా అనలైజింగ్ తదితర విభాగాలను ఏర్పాటు చేశామని గార్గ్ చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్లాల్ మాట్లాడుతూ జలుబు, దగ్గు, జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది తదితర కరోనా లక్షణాలు ఉన్నప్పడు పరీక్షలు చేయించుకొనేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా వారిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఈ మేరకు వారికి దైర్యం, నమ్మకం కల్పించేలా కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది పని చేయాలని కోరారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరాన్ని పాటించడమే కరోనా మహమ్మారిని నియంత్రించడంలో కీలక పాత్ర అని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అదే విధంగా తరచూ చేతులను సబ్బుతో కడుకొనేలా చైతన్య పరచాలని కలెక్టర్ సూచించారు.
*తూర్పు గోదావరి జిల్లా:*
జిల్లాలో 450 కరోనా వైరస్ లక్షణాల అనుమానిత కేసుల శాంపిళ్లను లాబ్ పరీక్షలకు పంపగా, 362 కేసులు వైరస్ నెగిటీవ్గా నిర్థారణ అయ్యాయని, 11 కేసులలో వైరస్ పాజీటీవ్ గా తేలిందని, మరో 77 శాంపిళ్లకు టెస్ట్ రిపోర్టులు రావలసి ఉందని వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి తెలియజేశారు.
జిల్లాలో 14.65 లక్షల కుటుంబాలను హౌస్ టు హౌస్ సర్వే టీములు సందర్శించి మొత్తం 17409 మందిని కోవిడ్–19 సర్వైలెన్స్ లో పర్యవేక్షిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ నోడల్ అధికారి తెలిపారు.
వీరిలో 12,080 మంది గ్రామీణ ప్రజలు, 5329 మంది పట్టన ప్రజలు ఉన్నారని తెలిపారు.
సర్వేలైన్స్లో ఉన్న 17,409 మందిలో 8105 మంది 28 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకోగా.. 8627 మంది 15 నుంచి 28 రోజుల పర్యవేక్షణ కాలంలో ఉన్నారు. మరో 677 మంది 14 రోజులలోపు పర్యవేక్షణలో ఉన్నారు.
జిల్లాలో 165 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయగా, 6,509 ఐసోలేషన్ బెడ్లు సిద్ధం చేశారు.
కరోనా వైరస్ నివారణ కార్యక్రమాల్లో 140 వైద్యులు, 389 మంది పారా మెడికల్, నర్సింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు.
ఇప్పటి వరకూ తూర్పు గోదావరి జిల్లాలో గుర్తించిన 11 పాజిటీవ్ కేసులలో ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకిన వారు ఒకరు, విదేశాల నుండి వచ్చిన వ్యక్తి, 5 గురు డిల్లీలో మత కార్యక్రమానికి హాజరై వచ్చిన వారు ఉన్నారు.
మరో 5 గురికి సెకండరీ కాంటాక్ ద్వారా వైరస్ సోకిన కేసులుగా నమోదైయ్యాయి.
కరోనా వైరస్ అనుమానిత కేసుల నుండి నమూనాల సేకరణకు మొబైల్ టీమ్లు ఏర్పాటు చేశారు.
*పశ్చిమ గోదావరి జిల్లా:*
జిల్లాలో 15 కరోనా పాజిటివ్ కేసుల నమోదు
ఇప్పటి వరకూ సేకరించిన నమూనాల సంఖ్య 310
నెగిటివ్ రిపోర్టు వచ్చిన సంఖ్య 63
ౖ ఇంకా రిపోర్టులు రావాల్సిన నమూనాల సంఖ్య 232
ౖ గృహ నిర్బంధంలో ఉన్న విదేశాల నుంచి వచ్చిన వారు 4,821
28 రోజుల గృహ నిర్బంధం పూర్తి చేసుకున్న వారు 3,076 మంది
ఇంకా గృహ నిర్బంధంలో ఉన్న వారు 1,745 మంది
*కృష్ణా జిల్లా:*
జిల్లాలో నిన్నటి వరకు 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, కొత్తగా ఎక్కడా గుర్తింపబడలేదు. కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్న విజయవాడలోని పలు ప్రాంతాల్లో కంటోన్మెంట్ జోన్లుగా ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారు.
పాజిటివ్ కేసులు ఉన్న నూజివీడు, జగ్గయ్యపేట, మచిలీపట్నంలోనూ రెడ్ జోన్లు ఏర్పాటు ఏర్పాటు చేశారు.
రెడ్ జోన్ లో నిబంధనలు కచ్చితంగా పాటించాలని లేకుంటే చర్యలు తీసకుంటామని అధికారులు హెచ్చరించారు.
కృష్ణా జిల్లా వ్యాప్తంగా కరోనా నియంత్రణ కోసం అధికారులు సోడియం హైపో క్లోరైడ్ స్ప్రే చేస్తున్నారు.
కూరగాయల కోనుగోలు కోసం ప్రజలు ఒకేచోట గుమికూడకుండా వికేంద్రీకరణతో ఎక్కడికక్కడ రైతు బజార్లు ఏర్పాటు చేయడంతో దుకాణాల వద్ద రద్దీ లేదు.
ఉన్న ఒకరిద్దరు కూడా సామాజిక దూరం పాటిస్తూ తమకు కావాల్సిన వాటిని కోనుగోలు చేస్తున్నారు.
మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ విజయవాడ పశ్ఛిమ నియోజకవర్గ వ్యాప్తంగా నిరుపేదలకు రూ.5 లక్షల విలువైన కూరగాయలను పంపిణీ చేశారు.
గుడివాడ డివిజన్ పరిధిలో అన్ని గ్రామాల్లో లాక్ డౌన్ పకడ్బందిగా అమలవుతోంది.
ప్రజలు నిత్యావసర వస్తువులు, కూరగాయులు కొనుగోలుకు ఉదయం 9 గంటలపు మాత్రమే బయటకు వస్తున్నారు.
డివిజన్ పరిధిలో అనుమానితులైన వారు 128 హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. కొందరు గుడివాడ పట్టణంలోని హోమిపతికళాశాలలో ఏర్పాటు చేసిన క్యారంటైన్ కేంద్రంలో ఉన్నారు.
ఎవరికీ కరోనా లక్షణాలు లేనప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కావడంతో 14 రోజుల పాటు ఈ కేంద్రంలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ప్రతి రోజు పురపాలక సంఘం అధికారులు, సిబ్బంది ప్రజల ఆరోగ్య దృష్ట్యా పట్టణంలో సోడియం హైడ్రోక్లోరిన్, బ్లీచింగ్ ను రహదారులు, డ్రైనేజీల్లో పిచికారి చేస్తున్నారు.
గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో మంత్రి శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు (నాని) పేద ప్రజలకు హ్యాండ్ శానిటైజర్లు, మాస్కులను అందజేశారు.
*గుంటూరు జిల్లా.*
జిల్లాలో ఇప్పటి వరకు 30 పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. తాజాగా ఏ కేసూ నమోదు కాకున్నా, మరికొన్ని శాంపిల్స్ రిజల్ట్ రావాల్సి ఉంది.
జిల్లాలో మొత్తం 428 శాంపిల్స్ తీయగ అందులో పాజిటివ్–30, నెగెటివ్–326 రాగా, రిజల్ట్ రావాల్సినవి 72 ఉన్నాయి.
వాటిలో ఫారిన్ రిటర్న్–8, ఫారిన్ కాంటాక్ట్స్–1, ఢిల్లీ రిటర్న్–200, ఢిల్లీ కాంటాక్ట్స్–77 ఉండగా, ఇతరులు 16 మంది ఉన్నారు.
ఎక్కువ పాజిటివ్ కేసులు ఢిల్లీ రిటర్స్, వారి కాంటాక్ట్స్లోనే నమోదయ్యాయి. దీంతో జిల్లా యంత్రాంగం వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టింఇ.
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులలో.. గుంటూరు టౌన్–15 మాచర్ల–5, అచ్చంపేట–3, క్రోసూరు–1, కారంపుడి–1, మంగళగిరి–2 వంతున ఉన్నాయి.
జిల్లా నుంచి ఢిల్లీ మత ప్రార్ధనకు వెళ్లివచ్చిన 187 మందిలో ఇప్పటి వరకు 146 మందిని ట్రేస్ అవుట్ చేసి శాంపిల్స్ తీసారు.
కరోనా పాజిటివ్ వచ్చిన వాళ్లకి చికిత్స చేస్తున్నారు. నెగెటివ్ ఉన్న వాళ్లని క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు.
అదే విధంగా వాళ్లకి కాంటాక్ట్లో ఉన్న వారిని కూడా క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు.
జిల్లాలో 68 క్వారంటైన్ కేంద్రాలు ఉన్నాయి.
వీటితో పాటు 9500 బెడ్లు సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో పాజిటివ్ కేసులకు ట్రీట్మెంట్ చేసేందుకు వివిధ ఆస్పత్రుల్లో బెడ్లు సిద్ధం చేస్తున్నారు.
ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో–200, కాటూరిలో–124, గుంటూరు లలిత ఆసుపత్రిలో–60, తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో–40 బెడ్లు సిద్దం చేస్తున్నారు.
అదే విధంగా ఇప్పటివరకు సర్వేలెన్స్లో 2633 మంది, ఐసొలేషన్లో 332, ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయిన వారు 96 మంది ఉన్నారు.
*ప్రకాశం జిల్లా:*
జిల్లాలో తాజాగా 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 22కు చేరింది.
దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు ఎక్కడికక్కడ లాక్డౌన్ను పక్కాగా అమలు చేస్తున్నారు.
ప్రజలకు ఇబ్బంది కలగకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కాలనీల్లో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేస్తున్నారు.
మరోవైపు క్వారంటైన్ కేంద్రాలను బలోపేతం చేయడంపైనా జిల్లా అధికారులు దృష్టి పెట్టారు.
హోమ్ ఐసోలేషన్లో 1,000 మంది ఉండగా, అబ్జర్వేషన్లో 28 రోజులు పూర్తైన వారు 117 మంది ఉన్నారు.
పరీక్షల కోసం ల్యాబ్కు 192 శాంపిల్స్ పంపగా, ఇంకా 110 శాంపిల్స్ రిజల్ట్ రావాల్సి ఉంది.
ముందు జాగ్రత్తగా జిల్లాలో ఇప్పటికే 500 బెడ్లు సిద్ధం చేశారు.
*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:*
జిల్లా నుంచి 219 శాంపిల్స్ పరీక్షలకు పంపితే 32 పాజిటివ్ గానూ, 116 నెగిటివ్ గానూ రాగా, ఇంకా 71 మంది ఫలితాలు రావాల్సి ఉంది.
– కరోనా పాజిటివ్ కేసులు గుర్తించిన చోట్ల పారిశుద్ధ్యం పనులు ముమ్మరం చేస్తున్నారు.
హోం ఐసోలేషన్ లో 896 మంది ఉండగా, ఆస్పత్రి క్వారంటైన్లో 105 మంది ఉన్నారు.
జిల్లాలో ప్రజలకు రేషన్ సరుకులతో పాటు, రూ.1000 ఆర్థిక సహాయం పంపిణీ చేస్తున్నారు.
మరోవైపు కూరగాయలు, నిత్యావసరాల కొరత లేకుండా అధికారులు జాగ్రత్త పడుతున్నారు.
కూరగాయల కిట్లు సిద్ధం చేసిన మార్కెటింగ్ శాఖ వాటిని నేరుగా వినియోగదారులకు పంపిణీ చేస్తోంది.
జిల్లా నుంచి విదేశాల నుంచి 1700 మంది రాగా, వారందరిని ట్రాక్ చేశారు.
కరోనా పాజిటివ్ కేసుల చికిత్స కోసం జిల్లాలో 2200 బెడ్లు సిద్ధం చేశారు.
*చిత్తూరు జిల్లా:*
జిల్లాలో ఇప్పటివరకు 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా వెల్లడించారు. తిరుపతిలో 5, పలమనేరులో 3, శ్రీకాళహస్తిలో 3, రేణిగుంటలో 2, నగరిలో 2, నిండ్ర, ఏర్పేడులో ఒకటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులను గుర్తించినట్లు ఆయన తెలిపారు.
జిల్లాలో నమోదైన కరోనా పాజిటివ్ 17 కేసుల్లో జమాత్కి వెళ్లిన వారితో సంబంధం ఉన్న వారు 14 మంది కాగా, ఒకరు విదేశాల నుంచి వచ్చిన వారని కలెక్టర్ చెప్పారు. కాగా, మరో ఇద్దరికి ఈ వైరస్ ఎలా సోకిందన్న వివరాలు ఆరా తీస్తున్నామని తెలిపారు. వైరస్ సోకిన వారి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్కు తరలించామని, ఇంకా ఆయా ప్రాంతాలకు మూడు కిలోమీటర్ల మేర రెడ్ జోన్గా ప్రకటించి, ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను రంగంలోకి దించామని కలెక్టర్ వెల్లడించారు. మరోవైపు ఇంటింటికి పూర్తి స్థాయిలో సర్వే ప్రక్రియ చేపట్టి కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించడంతో పాటు, వారి శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపిస్తున్నామని వివరించారు.
జిల్లాలో ఇప్పటికే 10 వేల లీటర్ల శానిటైజర్ పంపిణీ చేశామని, 5 వేల వ్యక్తిగత భద్రత ఉపకరణాలు (పీపీఈ) సిద్ధంగా ఉన్నాయని, వాటిని డాక్టర్లకు పంపిణీ చేస్తున్నామని, ఇంకా 70 వేల మాస్కులు ఇప్పటికే పంపిణీ చేశామని కలెక్టర్ చెప్పారు. కరోనా కట్టడికి పని చేసే వారి కోసం ప్రతి మండలానికి 2500 మాస్కులు, తిరుపతి అర్బన్ పోలీసులకు 50 వేలు, చిత్తూరు పోలీసులకు మరో 50 వేల మాస్క్లు ఇచ్చామని వివరించారు.
తిరుపతిలో..
నగరంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన 11 డివిజన్లలో కమిషనర్ గిరీషా ఆదేశాల మేరకు పారిశుద్ధ్య సిబ్బంది చురుగ్గా సానిటేషన్ పనులు చేస్తున్నారు. నగరంలోని త్యాగరాజనగర్, యశోదానగర్లో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతాలను కమిషనర్ రెడ్ జోన్ గా ప్రకటించారు. పాజిటివ్ కేసులు నమోదైన ఇంటిని కేంద్రంగా చేసి సుమారు కిలో మీటర్ పరిధిలో చుట్టుపక్కల రాపిడ్ రెస్పాండ్ టీం, అలాగే రెగ్యులర్ శానిటేషన్ సిబ్బంది అ ప్రాంతాల్లో శానిటేషన్ పనులు చురుగ్గా చేస్తున్నారు. రెడ్ జోన్గా ప్రకటించిన 11 డివిజన్లలో సుమారు 30 వేల ఇళ్ల వద్ద బ్లీచింగ్ చల్లి, డ్రైనేజీలు శుభ్రం చేసి, సోడియం హైపో క్లోరైడ్ పిచికారీ చేశారు. అలాగే నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా శానిటేషన్ పనులు ముమ్మరంగా చేస్తున్నారు.
*అనంతపురం జిల్లా:*
కరోనా వైరస్ మహమ్మారిని జయించేందుకు రానున్న రెండు వారాలు అత్యంత కీలకమని, కావున అన్ని రాష్ట్రాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ చెప్పారు. కోవిద్–19 కేసులు అధికంగా నమోదు అవుతున్న జిల్లాల కలక్టర్లు, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వైరస్ వ్యాప్తి నియంత్రణకు అనుసరించాల్సిన కంటైన్మెంట్ విధానం పై ఓరియంటేషన్ కమ్ ట్రైనింగ్ సెషన్ ను ఆదివారం ఆయన ఢిల్లీ నుండి వీడియో సమావేశం ద్వారా నిర్వహించారు.
అనంతపురంలోని ఎన్ఐసి భవనం నుంచి వీడియో కాన్ఫరెన్సో్ల జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎస్పీ సత్య ఏసుబాబు, జెసి ఢిల్లీ రావు, జెసి2 రామ్మూర్తి, అసిస్టెంట్ కలెక్టర్ జాహ్నవి, డి ఆర్ ఓ గాయత్రి దేవి, డి ఎం హెచ్ ఓ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కరోనా విపత్తు నేపథ్యంలో రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్ పర్సన్ కాపు భారతి చేయూత, నిత్యావసర సరుకులు పంపిణీ, ఒక్కో పాత్రికేయుడి కుటుంబానికి అవరమైన 25 కేజీల బియ్యం పాకెట్ తో పాటు కంది బేడలు, బెల్లం, నూనె, ఇతర సరుకులు పంపిణీ చేశారు. అలాగే రెండు మాస్క్ లు, శానిటైజర్ కూడా ఇచ్చారు.
అనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ 19 టెస్టింగ్ ల్యాబ్ కి ఆదివారం కర్నూలు జిల్లా నుంచి 33 శాంపిల్స్ పరీక్షల కోసం అందాయి.
*వైయస్సార్ కడప జిల్లా:*
జిల్లా కేంద్రంలోని రైతు బజారులో షాపుల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని కిరాణా షాప్లు దారికి అడ్డంగా ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు అమ్ముతున్నారని దీంతో ప్రజలు రైతు బజారులోకి రావాలంటే పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉప ముఖ్యమంత్రి–మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. రైతు బజారులో రోజురోజుకు షాపుల నిర్వహణ చాలా దారుణంగా మారుతుందని ఆయన ఆక్షేపించారు. కరోనా వైరస్ వల్ల ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలని అధికారులు, ప్రజా ప్రతినిధులు పదే పదే చెబుతూ ఉంటే రైతు బజారులో మాత్రం అందుకు విరుద్ధంగా షాపు నిర్వహిస్తూ గుంపులు గుంపులుగా ప్రజలు నిత్యవసర వస్తువులు కూరగాయలు కొనుగోలు చేస్తున్నారని, ఇది ఏ మాత్రం సరి కాదని డిప్యూటీ సీఎం అన్నారు.
కరోనా వైరస్ను దృష్టిలో ఉంచుకొని రైతు బజారులో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలన్నారు. నిత్యవసర వస్తువులు కూరగాయలు అధిక ధరలకు విక్రయించ రాదన్నారు. ఎక్కువ ధరలకు అమ్మితే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రైతు బజారులో రైతులు పండించిన ఉత్పత్తులు విక్రయించుకోవాలికానీ ఇక్కడ కిరాణా షాపులు ఉండకూడదుకదా అని ఎస్టేట్ అధికారికి తెలిపారు. రైతు బజారులో అరటి పళ్ళ మండి ఎందుకు ఉందన్నారు. రైతు బజారు కు సంబంధించి ఆక్రమణలకు గురైన దారిని వెంటనే తొలగించాలని మంత్రి అంజాద్బాషా మున్సిపల్ కమిషనర్కు సూచించారు.
*కర్నూలు జిల్లా:*
జిల్లాలో కరోనా కట్టడి చేసేందుకు ప్రోటోకాల్ ప్రకారం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రజలు భయాందోళనలకు గురి కాకుండా అత్యంత అప్రమత్తంగా ఉండి ఇళ్లకే పరిమితం కావాలని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ విజ్ఞప్తి చేశారు. జిల్లాలో కొత్తగా 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నగరంలోనే 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో నగరమంతా లాక్డౌన్ను మరింత తీవ్ర కఠినతరం చేసి అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరిని బయటకు తిరగనీయకుండా అష్ట దిగ్బంధనం చేస్తామని, ప్రజలందరూ జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు.
పాజిటివ్ కేసులుగా నిర్ధారణ అయిన వారందరిని జిల్లా కోవిడ్–19 హాస్పిటల్లో ఉంచి వైద్య చికిత్సలు అందిస్తున్నామన్నారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల మూడు కిలోమీటర్ల పరిధిలో కంటైన్మెంట్ జోన్గా పరిగణించి ఎవరిని బయట తిరగకుండా దిగ్భంధనం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కోవిడ్–19 ప్రోటోకాల్ ప్రకారం పాజిటివ్ కేసులు వచ్చిన పట్టణ ప్రాంతాల్లో చుట్టు పక్కల 3 కిలోమీటర్ల కంటైన్మెంట్ జోన్, 5 కిలో మీటర్ల బఫర్ జోన్, గ్రామీణ ప్రాంతాలలో 3 కిలోమీటర్ల కంటైన్ మెంట్ జోన్, 7 కిలోమీటర్ల బఫర్ జోన్ లుగా ప్రకటించి ముమ్మర పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు.