ఇబ్బందుల్లో ఉన్నారు.. కనీసం రూ.5వేలివ్వండి

ఇబ్బందుల్లో ఉన్నారు.. కనీసం రూ.5వేలివ్వండి
ప్రభుత్వం వాస్తవాలు దాచకూడదు
రైతు కుదేలయ్యే పరిస్థితి తేవొద్దు
మీడియా సమావేశంలో  తెదేపా అధినేత చంద్రబాబు
హైదరాబాద్‌: కరోనా మహమ్మారి వల్ల అందరూ బాధపడుతున్నారని తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. దీంతో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయని చెప్పారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపును అందుకొని ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వాములై సంఘీభావం తెలిపారన్నారు. మనం పరిశుభ్రంగా ఉంటూ.. పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచించారు. వారంలో ప్రపంచవ్యాప్తంగా 62 శాతంకరోనా వైరస్‌ కేసులు పెరిగాయని ఆందోళన వ్యక్తంచేశారు. గత వారం రోజుల్లో మన దేశంలో 222 శాతం కరోనా కేసులు పెరిగాయన్నారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మన రాష్ట్రంలో అత్యధికంగా ఒక్క వారంలో వెయ్యి శాతానికి పైగా కరోనా పెరిగింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు బాధ్యతగా ప్రవర్తించాలి. ప్రజలకు వాస్తవాలు చెప్పివారిని మరింత సమాయత్తం చేయాలి. ప్రజలు కూడా ప్రభుత్వాల సూచనలు పాటించాలి. భౌతిక దూరం పాటించాలి. మత, రాజకీయపరమైన సదస్సులు వాయిదా వేసుకోవాలి’’ అని సూచించారు. 
భయపడనక్కర్లేదు.. జాగ్రత్తగా ఉంటే చాలు..!
‘‘కరోనా వైరస్‌ గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. జాగ్రత్తలు తీసుకుంటే చాలు. దీనిపై దుష్ప్రచారాలను నమ్మకూడదు. అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు యోగా, ధ్యానం చేయాలి. రోగ నిరోధక శక్తి ఎలా పెంచుకోవాలో ఆలోచించాలి. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.. ప్రభుత్వాలు వారిని ఆదుకోవాలి. మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. అత్యవసర సేవల సిబ్బందికి కావాల్సినవన్నీ ఇచ్చేలా చూడాలి’’  


రైతుబజార్లు విరివిగా ఏర్పాటు చేయాలి
‘‘పరీక్షలు తక్కువ చేస్తే కేసులు మరిన్ని ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. పరీక్షలు ఎక్కువ చేస్తే కేసులు బయటపడతాయి. వాటికి అనుగుణంగా వెంటిలేటర్లు ఉంచాలి. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించడం సరికాదు. కరోనా పాజిటివ్‌ వచ్చినవారందరినీ వేరు చేయాల్సిన అవసరం ఉంది. వైద్యులు, క్షేత్రస్థాయిలో పనిచేసేవారికి రక్షణ పరికరాలు వెంటనే అందజేయాలి.  ఇలాంటి క్లిష్ట సమయాల్లో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మొబైల్‌ రైతు బజార్లు విరివిగా ఏర్పాటు చేయాలి. ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని కోరారు. 


ఆ నగదు అభ్యర్థులు పంచడమేంటి?
‘‘రాష్ట్రంలో పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనిచేస్తే గానీ పూటగడవని ఎంతోమంది పేద ప్రజలను ఏవిధంగా ఆదుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ సాయానికి అదనంగా కొన్ని రాష్ట్రాలు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చాయి. దిల్లీ ప్రభుత్వం రూ.5వేలు ఇస్తోంది. అలాగే, ఏపీలో కూడా పేదలకు తొలివిడతగా కనీసం రూ.5వేలు చొప్పున ఇచ్చి ఆదుకోవాలి. రాష్ట్రంలో రూ.1000 చొప్పున ఇస్తున్న నగదును వైకాపా అభ్యర్థులు పంచడమేంటి? రేషన్‌, పింఛన్లలో అనేకమందికి కోత విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు కుదేలయ్యే పరిస్థితి తీసుకురావొద్దు. అరటి, మామిడి, బత్తాయి, టమాటా రైతులను ఆదుకోవాలి. కూరగాయలు, పండ్ల తోటల రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. వారందరినీ ఆదుకోవాలి’’ అని చంద్రబాబు కోరారు.