గ్రామీణ ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్ కి 7 కి.మీ వెలుపల ఉన్న అన్ని పరిశ్రమలు నిర్వహించుకోవచ్చు

 


     *నెల్లూరు, 30-04-2020*


లాక్ డౌన్ నిబంధనల వలన జిల్లాలో నిన్నటి వరకు పరిశ్రమల నిర్వహణకు కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయని.., దీనిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల నిర్వహణకు సంభందించిన నిబంధనలను సవరించిందని డి.ఐ.సి. జనరల్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు.


 నెల్లూరు నగరంలోని నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించిన డి.ఐ.సి. జనరల్ మేనేజర్... గ్రామీణ ప్రాంతాల్లో కంటైన్ మెంట్ జోన్ కి 7 కి.మీ వెలుపల ఉన్న అన్ని పరిశ్రమలు నిర్వహించుకోవచ్చన్నారు. పరిశ్రమల యజమానులు రాష్ట్ర పరిశ్రమల శాఖ వెబ్ సైట్  ద్వారా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని.., కమిటీ సభ్యులు దరఖాస్తులు పరిశీలించి అనుమతి మంజూరు చేస్తారన్నారు.


 నెల్లూరు జిల్లాలో కీలకమైన కృష్ణపట్నం పోర్టు, ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమలు, పవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయని.., ఈ పరిశ్రమల నిర్వహణకు ప్రత్యేక అనుమతి మంజూరు చేయాలని కలెక్టర్ యం. వి.శేషగిరి బాబు.. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో.., 
కృష్ణపట్నం పోర్టు, ఎడిబుల్ ఆయిల్ పరిశ్రమలు, పవర్ ప్రాజెక్ట్స్ నిర్వహణకు ప్రభుత్వం  ప్రత్యేక అనుమతులు మంజూరు చేసిందన్నారు
గతంలో గ్రీన్ జోన్ మండలంలో పరిశ్రమ ఉంటే, ఆ మండలంలోని కార్మికులు మాత్రమే ఆ పరిశ్రమలో పనిచేయడానికి అనుమతి ఉండేదని.., ప్రస్తుతం మాత్రం గ్రీన్ జోన్ మండలంలో ఉండే పరిశ్రమలో.., సమీపంలోని ఇతర గ్రీన్ జోన్ మండలాల వారు కూడా పనిచేయవచ్చన్నారు. కార్పొరేషన్, మునిసిపాలిటీ పరిధిలోని పరిశ్రమల నిర్వహణకు గతంలో ఉన్న నిబంధనలు అమల్లో ఉంటాయని, వీటికి మాత్రం ఎలాంటి ప్రత్యేక అనుమతులు కల్పించలేదని డి.ఐ.సి. జనరల్ మేనేజర్ ప్రసాద్ వెల్లడించారు.