ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు


*అమరావతి :


*కోవిడ్‌ –19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు లాక్‌ డౌన్‌ వల్ల ప్రజలకు ఇబ్బంది కలగకుండా పలు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం*


*రాష్ట్ర వ్యాప్తంగా కొసాగుతున్న కోవిడ్‌ నివారణ, నియంత్రణ చర్యలతో పాటు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై రిపోర్ట్‌.


*రాష్ట్రంలో 534 పాజిటివ్‌ కేసులు:*
 రాష్ట్రంలో పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు జిల్లాలలో మూడు చొప్పున కొత్తగా 9 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  
 దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 534 కి చేరింది. 
 రాష్ట్రంలో ఇప్పటి వరకు గుంటూరు జిల్లాలో అత్యధికంగా 122 కేసులు నమోదు కాగా, ఆ తర్వాత కర్నూలు జిల్లాలో 113, నెల్లూరు జిల్లాలో 58, కృష్ణా జిల్లాలో 48, ప్రకాశం జిల్లాలో 42,  వైయస్సార్‌ కడప జిల్లాలో 36, కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
 పశ్చిమ గోదావరి జిల్లాలో 34, చిత్తూరు జిల్లాలో 23, విశాఖపట్నం జిల్లాలో 20, అనంతపురం జిల్లాలో 21, తూర్పు గోదావరి జిల్లాలో 17 కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటి వరకు ఒక్క  కేసు కూడా నమోదు కాలేదు.
 కాగా, కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి 20 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. విశాఖపట్నం జిల్లాలో 10 మంది, కృష్ణా జిల్లాలో 4గురు, తూర్పు గోదావరి జిల్లాలో ముగ్గురు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలలో ఒక్కొక్కరు.. మొత్తం 20 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ఆస్పత్రుల్లో 500 మంది చికిత్స పొందుతున్నారు.
 మరోవైపు ఇప్పటి వరకు 14 మంది చనిపోయారు. గుంటూరు, కృష్ణా జిల్లాలలో 4గురు చొప్పున, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో ఇద్దరు చొప్పున చనిపోయారు.  


కోవిడ్‌ –19 నివారణ చర్యలపై సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ సమీక్ష:


కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం. 
కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా నిబంధనలు అమలు చేయాలని సీఎం స్పష్టీకరణ:
వివిధ సెంటర్ల నుంచి క్వారంటైన్‌ పూర్తి చేసుకున్న వారిని ఇంటికి పంపేటప్పుడు బీదలకు రూ.2 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం ఆదేశం.
ముందు జాగ్రత్త చర్యగా వారిని మనం క్వారంటైన్లో పెడుతున్నాం:
తిరిగి ఇంటికి పంపించినప్పుడు రూ.2 వేల డబ్బు చేతిలో పెట్టాలి:
పౌష్టికాహారం తీసుకోవాలని వారికి సూచనలు చేయాలి:
లేదంటే.. మళ్లీ సమస్య మొదటికి వచ్చే ప్రమాదం ఉంటుంది:
క్వారంటైన్‌ నుంచి ఇంటికి పంపేటప్పుడు వారికి సూచనలు చేయాలి:
మనం ఇచ్చే డబ్బు ద్వారా పాలు, గుడ్డు, కూరగాయలు లాంటి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం సమాజానికి కూడా మంచిది:
అన్ని రోజులు క్వారంటైన్‌లో పెట్టి ఒకేసారి మనం ఇంటికి పంపితే.. పస్తు ఉండే పరిస్థితి ఉండకూడదు:


*ఇక జిల్లాలలో కోవిడ్‌–19 నివారణ చర్యలు:*


శ్రీకాకుళం జిల్లా:
 ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాని ఈ జిల్లాలో రెండో విడత ఉచిత రేషన్‌ పంపిణీ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా సరుకుల పంపిణీని జాయింట్‌ కలెక్టర్‌ డా.కె. శ్రీనివాసులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో దాదాపు 8.29 లక్షల బియ్యం కార్డులు ఉండగా.. బియ్యం కార్డులు లేని అర్హులైన 14,677 మందిని ఇప్పటికే గుర్తించారు. జిల్లాలో మొత్తం 13,300 టన్నుల బియ్యం, 824 టన్నుల శనగలు పంపిణీ చేయనున్నారు.
 ఇక కోవిడ్‌–19 నివారణకు వ్యక్తుల మధ్య భౌతిక దూరం పాటించడం అవసరమని కోవిడ్‌ జిల్లా ప్రత్యేక అధికారి ఎం.ఎం.నాయక్‌ అన్నారు. పాతపట్నం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు, పునరావాస కేంద్రం, క్వారంటీన్‌ కేంద్రాన్ని ప్రత్యేక ఆయన పరిశీలించారు. చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అప్పుడే జిల్లా సురక్షితంగా ఉంటుందని నాయక్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తత కీలకమని అన్నారు. అనుమతి లేని ఏ ఒక్కరిని వదలరాదని కోవిడ్‌ జిల్లా ప్రత్యేక అధికారి ఆదేశించారు.



*విజయనగరం జిల్లా:*


 జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. ఇక లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక సహాయం కింద పేదలకు రెండో విడత ఉచిత రేషన్‌ పంపిణీ జిల్లా వ్యాప్తంగా ఇవాళ ప్రారంభించారు. భౌతిక దూరం పాటిస్తూ రేషన్‌ సరుకుల కోసం వరుసలో నిల్చున్న రేషన్‌ కార్డుదారులకు కూపన్ల వారీగా బియ్యం అందజేశారు. 
 జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసులు లేనప్పటికీ రానున్న రోజుల్లో కూడా కేసులు లేని సురక్షితమైన జిల్లాగా కొనసాగాలంటే ఇతర రాష్ట్రాలు, రాష్ట్రంలోని కరోనా కేసులు ఉన్న జిల్లాల నుంచి జిల్లాలోకి ప్రవేశిస్తున్న వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉందని జిల్లా కలెక్టర్‌ డా.ఎం.హరిజవహర్‌లాల్‌ అన్నారు. జిల్లా సరిహద్దులు ఎంతగా మూసివేసినప్పటికీ ఇతర ప్రాంతాలకు వలస పోయిన వారంతా తిరిగి వస్తున్నారని, వారందరినీ వారి గ్రామాలకు పంపించకుండా నేరుగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలకు పంపించాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు. అక్కడ 14 రోజుల గడువు పూర్తయి ఆరోగ్య తనిఖీలు పూర్తయిన తర్వాతే వారి స్వస్థలాలకు పంపించాలని ఆదేశించారు. 
 జిల్లాకు పెద్ద ఎత్తున వలస కార్మికులు తరలివస్తున్న కారణంగా ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాలను అన్ని వసతులతో వినియోగానికి సిద్ధంగా ఉంచాలని కలెక్టర్‌ ఆదేశించారు. క్షేత్ర స్థాయి సిబ్బంది, జిల్లా యంత్రాంగం గత నెల రోజులుగా చేసిన కృషి కారణంగా జిల్లాను రాష్ట్రంలోనే సురక్షితమైన జిల్లాగా నిలపగలిగామని అన్నారు. ఈనెల 20వ తేదీ వరకు ప్రస్తుత లాక్‌ డౌన్‌ నిబంధనలే కొనసాగుతాయని ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే సడలింపుల ఆధారంగా కరోనా కట్టడిపై తదుపరి వ్యూహాన్ని రూపొందించి అమలు చేస్తామని కలెక్టర్‌ చెప్పారు.


*విశాఖపట్నం జిల్లా:*


జిల్లాలో కరోనా నియంత్రణకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.
కూపన్లు తీసుకున్న  లబ్ధిదార్లందరికీ తప్పనిసరిగా బియ్యం, పప్పులు పంపిణీ చేయాలని పౌర సరఫరాల కమిషర్‌ కోన శశిధర్‌ స్పష్టం చేశారు.
గురువారం అమరావతి నుంచి జాయింట్‌ కలెక్టర్లు, ఐటీడీఏ పి.వోలతో నిత్యావసర సరుకుల పంపిణీపై ఆయన వీడియో కాన్ఫరెన్స్‌  నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక సమస్యలు తలెత్తినా లబ్ధిదారుల సంతకం తీసుకుని సరుకులు అందించాలని సూచించారు. ప్రజలు ఎక్కువ సమయం వేచి ఉండకూడదని చెప్పారు.
 అదే విధంగా సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు. రెండవ విడత రేషన్‌ పంపిణీలో లబ్ధిదారులు భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ ఆదేశించారు.
విశాఖ జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసులు–వివరాలు:
– కరోనా పాజిటివ్‌ కేసులు: 20
– ఐసోలేషన్‌ లో ఉన్నవారు: 72
– ఛాతీ ఆసుపత్రి లో ఐసోలేషన్‌లో ఉన్న వారు: 31
– పద్మజ ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో ఉన్న వారు: 41 
– గీతం హాస్పిటల్‌లో కరోనా అనుమానితులు: 10
– కరోనా నెగిటివ్‌ వచ్చిన వారి సంఖ్య: 51
– రిపోర్టులు రానివారి సంఖ్య: 70
– ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల సంఖ్య: 73
– అందుబాటులో ఉన్న ఐసోలేషన్‌ సింగిల్‌ రూమ్స్‌: 500
– ఐసోలేషన్‌కు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ పడకలు: 3471
– అందుబాటులో ఉన్న క్వారంటైన్‌ పడకలు: 3382
– జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణీకులు: 2795  


*తూర్పు గోదావరి జిల్లా:*


 జిల్లాలో ఇప్పటివరకు 2737 కరోనా వైరస్‌ లక్షణాల అనుమానిత శాంపిళ్లను లాబ్‌ పరీక్షలకు పంపగా,  1610 కేసులు వైరస్‌ నెగిటీవ్‌గా నిర్థారణ అయ్యాయి. 17 కేసులు పాజిటివ్‌గా తేలగా, ఇంకా 1110 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉందన్న వైద్య ఆరోగ్య శాఖ నోడల్‌ అధికారి.
 జిల్లాలో 14.65 లక్షల కుటుంబాలను హౌస్‌ టు హౌస్‌ సర్వే టీములు సందర్శించి మొత్తం 17,751 మందిని కోవిడ్‌–19 సర్వైలెన్స్‌లో ఉంచారు.
వారిలో 15,560 మంది 28 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకోగా, 1749  మంది 15 నుండి 28 రోజుల పర్యవేక్షణ కాలంలో ఉన్నారు.
కరోనా వైరస్‌కు చికిత్స పొంది ఆస్పత్రుల నుంచి ముగ్గురు డిశ్చార్జ్‌ అయ్యారు. 
కరోనా వ్యాధిగ్రస్తుల కోసం జిల్లాలో 62 క్వారంటైన్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, మొత్తం 9603 ఐసోలేషన్‌ బెడ్లు సిద్ధం చేశారు.
3442 మంది హోమ్‌ ఐసోలేషన్‌ లోనూ, 53 మందిని క్వారంటైన్‌ కేంద్రాలలోనూ ఉంచి పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో 7 మండలాల్లో కరోనా పాజిటీవ్‌  కేసులు గుర్తించిన 8 ఆవాసాలను, వాటి పరిసర ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించి కట్టుదిట్టమైన సర్వైలెన్స్, పారిశుద్ధ్య కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. 


*పశ్చిమ గోదావరి జిల్లా:*


 జిల్లాలో కోవిడ్‌–19 నివారణ చర్యలపై కొవ్వూరు మున్సిపల్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత.
కొవ్వూరు పట్టణంలో కోవిడ్‌–19 కేసులు నమోదు కావడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరిన మంత్రి.
ఇతర ప్రాంతాల వాసులు ఎవ్వరూ కొవ్వూరు రావొద్దని కోరిన మంత్రి.
లాక్‌ డౌన్‌ నిబంధనలు అమలయ్యేలా అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించిన మంత్రి తానేటి వనిత.
అత్యవసర సమయంలో ఒకరు మాత్రమే ద్విచక్ర వాహనంపై ఇళ్ల బయటకు రావాలని, ఇద్దరు వస్తే శిక్షార్హులను మంత్రి తానేటి వనిత హెచ్చరించారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన కోవిడ్‌ ఆసుపత్రుల్లో వైద్య పరికరాలు, మందులు, ఇతర సౌకర్యాల కల్పనపై అధికారులు, వైద్యులతో జిల్లా కలెక్టర్‌ ముత్యాలరాజు సమీక్ష.
కరోనా నివారణలో భాగంగా అవసరమైన అన్ని వైద్య పరికరాలు, మందులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచామన్న కలెక్టర్‌.
కరోనా వైరస్‌ నివారణలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించిన కలెక్టర్‌.
రెడ్‌ జోన్, బఫర్‌ జోన్‌ ప్రాంతాల్లో నివాసముంటున్న అందరి రక్త నమూనాలను సేకరించి పరీక్షించాలని కలెక్టర్‌ ముత్యాలరాజు ఆదేశం.
రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లోకి రానూ పోనూ ఒకటే మార్గం ఉంచాలని, అక్కడ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పుటు చేయాలని ఆదేశించిన కలెక్టర్‌.
రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో అవసరమైన నిత్యావసర వస్తువులను ఇళ్లకే నేరుగా అందించేలా చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్‌.


*కృష్ణా జిల్లా:*


 జిల్లాలో కరోనా వ్యాధి చికిత్స పొంది పూర్తిగా కోలుకున్న 4గురు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. జిల్లాలో ఇంకా 40 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.
జిల్లాలో పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో లాక్‌ డౌన్‌ పటిష్టంగా అమలు చేస్తున్నారు. రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో ప్రజలను బయటకు రానివ్వడం లేదు. 
లాక్‌ డౌన్‌ నేపథ్యంలో పెడన నియోజకవర్గంలో పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో జిల్లా ఎస్పీ రవీంద్రబాబు పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు.
రెడ్‌ జోన్‌ ప్రాంతాలలో నిత్యావసర సరుకులు డోర్‌ డెలివరీ చేస్తున్నారు.
గుడివాడలో ప్రయోగాత్మకంగా వాలంటీర్ల ద్వారా నేరుగా ఇంటికే రెండో విడత ఉచిత రేషన్‌ సరుకులు అందిస్తున్నారు.
మచిలీపట్నంలో మంత్రి శ్రీ పేర్ని నాని రెండో విడత రేషన్‌ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్దిదారులకు వారి ఇంటి వద్దనే తూకం వేసి అందించారు. 


*గుంటూరు జిల్లా:*


 జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 3387పైగా శాంపిల్స్‌ పరీక్షకు పంపగా, వాటిలో పాజిటివ్‌ 122, నెగెటివ్‌ 1632 రాగా ఇంకా 1639 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉంది. నరసరావుపేటలో ఒక ఆర్‌ఎంపీ వైద్యుడికి కరోనా పాజిటివ్‌ ఉందని తేలడంతో అతనితో వైద్యం చేయించుకున్న 300 మందిని గుర్తించి వారికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు.
 జిల్లాలో కరోనా కేసులు పెరగడంతో గుంటూరులో 12 రెడ్‌ జోన్‌ ప్రాంతాలు గుర్తించి, 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. టౌన్‌లలో మాస్క్‌ లేకుంటే బయటి వస్తే రూ.1000 ఫైన్, గ్రామీణ ప్రాంతాలలో అయితే రూ.500 ఫైన్‌ విధిస్తున్నారు. ఇంకా పీడీ చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. ప్రజలు హోం డెలివరీ సద్వినియోగం చేసుకోవాలని, వారానికి సరిపడ సరుకులు కొనుక్కోవాలని, కరోనా వైరస్‌ లక్షణాలు ఉంటే 104 టోల్‌ ఫ్రీ నెంబర్‌కి ఫిర్యాదు చేయాలని కలెక్టర్‌ సూచించారు.
 గుంటూరు సిటీలో ఎక్కువ కేసులు నమోదు కావడంతో నిబంధనలు కఠినతరం చేశారు. నగరంలోని ఆనందపేట, కుమ్మరి బజార్లో కొత్తగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఆ ప్రాంతంలో పాజిటివ్‌ ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ ఉన్న వాళ్లని క్వారంటైన్‌కు తరలించారు. 


*ప్రకాశం జిల్లా:*


 జిల్లాలో పారిశుద్ధ్య పనుల్లో భాగంగా డ్రోన్ల సహాయంతో ఇస్లామ్‌పేటలో లిక్విడ్‌ స్ప్రే చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌ కేసులు గుర్తించిన ప్రాంతాలను హాట్‌ స్పాట్లుగా ప్రకటించి ప్రత్యేకంగా పారిశుధ్ద్య పనులు చేపడుతున్నారు.
 జిల్లాలో హోమ్‌ ఐసోలేషన్‌ లో 300 మంది ఉన్నారు. మరోవైపు కేసులు పెరుగుతుండటంతో రెడ్‌ జోన్లు కూడా పెరుగుతున్నాయి. జిల్లాలో 11 రెడ్‌ జోన్స్, 15 కరోనా సెంటర్స్‌ ఉన్నాయి.
పట్టణాల కన్నా గ్రామాల్లో కరోనాపై చైతన్యం కనిపిస్తోంది. గ్రామాల్లో ఎక్కువగా లాక్‌ డౌన్‌ పాటిస్తున్నారు.
నియోజకవర్గానికి ఒక క్వారంటైన్‌ కేంద్రం, మండలానికి ఒక రిలీఫ్‌ సెంటర్‌ ఏర్పాటుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 
మరోవైపు రిలీఫ్‌ సెంటర్లలో ఉన్న వారికి మంచి మెనూతో భోజన వసతి కల్పిస్తున్నారు.


*శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా:*


జిల్లాలో ఐసోలేషన్‌లో 54 మంది ఉండగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. జిల్లా అంతటా పోలీసులు లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు.
క్వారంటైన్‌ కేంద్రాలలో 408 ఉండగా, ఆస్పత్రి ఐసొలేషన్‌లో మరో 46 మంది ఉన్నారు.
ఆస్పత్రి క్వారంటైన్‌ కేంద్రాలు 8 ఏర్పాటు చేయగా, వాటిలో ఇప్పుడు 35 మందిని ఉంచారు.
ప్రజలకు అవసరమైన నిత్యావసరాలను ఆన్‌లైన్‌లో పంపిణీ చేస్తూ, ప్రజలు ఒకో చోట గుమి గూడకుండా చూస్తున్నారు.


*చిత్తూరు జిల్లా:*


జిల్లాలో రెడ్‌ జోన్‌ ప్రాంతాలుగా ప్రకటించిన ఏడు కేంద్రాలలో నిత్యావసర సరుకులతో పాటు, ఇవాళ్టి నుంచి ఇస్తున్న రేషన్‌ను నేరుగా ఇళ్ల వద్దనే పంపిణీ చేశారు.
జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ నారాయణభరత్‌ గుప్తా తిరుపతిలోని కోవిద్‌ సెంటర్, ఐసోలేషన్‌ సెంటర్‌ మరియు క్వారన్‌టైన్‌ సెంటర్లు పరిశీలించారు.
జిల్లా వ్యాప్తంగా వయోవృద్ధులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులను దాదాపుగా గుర్తించారు. ఒకటి రెండు రోజుల్లో వారి జాబితాను జిల్లా కార్యాలయానికి అందజేస్తారు. అనంతరం వారికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. 


*అనంతపురం జిల్లా:*


 జిల్లాలోని కంటైన్మెంట్‌ జోన్లలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, అత్యవసర మందులు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా అందించేలా వార్డు/ గ్రామ వాలంటీర్లకు, వార్డ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీలతో టీంలను ఏర్పాటు చేయాలని, ఆయా టీంల ద్వారా అన్నింటిని ప్రజల ఇంటి వద్దకే అందించాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ఆదేశించారు. కరోనా వైరస్‌ బారిన పడకుండా కాపాడేందుకు, ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ మందుల పంపిణీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఆయుష్‌ శాఖ ఆధ్వర్యంలో ఆర్షనిక్‌ ఆల్బం–30 మందుల పంపిణీని కలెక్టర్‌ ప్రారంభించారు. కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ముద్రించిన కరపత్రాలను ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆవిష్కరించారు.
 మరోవైపు జిల్లాలో కోవిడ్‌–19 అనుమానిత వ్యక్తుల శాంపిల్స్‌ పరీక్షల అనంతరం నెగిటివ్, పాజిటివ్‌ల వివరాలు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా బాధితులకు తెలిపే సమాచార కేంద్రాన్ని కలెక్టర్‌ గంధం చంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రాంరంభించారు. 
 జిల్లాలో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులుగా మొట్టమొదట నమోదైన ఇద్దరు వ్యక్తులకు ప్రస్తుతం నెగెటివ్‌ రిపోర్టు రావడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వారిలో హిందుపురం, లేపాక్షి ప్రాంతాలకు చెందిన ఒక బాలుడు, మహిళ ఉన్నారు.
 జిల్లాలో ఇప్పటి వరకు కరోనా అనుమానిత లక్షణాలతో ఆస్పత్రిలో 19 మంది చికిత్స పొందుతున్నారు. 


*వైయస్సార్‌ కడప జిల్లా:*


జిల్లాలో కరోనా కేసుల తీవ్రతను బట్టి ముందు జాగ్రత్తగా అదనంగా 3  కోవిడ్‌ ఆసుపత్రుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ సి.హరికిరణ్‌ వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్‌)లో అదనపు కోవిడ్‌–19 ఆసుపత్రి ఏర్పాటును ఆయన ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వ్యాధి సోకిన వారు ఎక్కువైతే ప్రస్తుతం ఉన్న జిల్లా కోవిడ్‌ ఫాతిమా ఆసుపత్రికి అదనంగా 2వ విడతగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి( రిమ్స్‌) నందు, 3 విడతగా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి, 4 వ విడతగా పులివెందల ఏరియా ఆసుపత్రులను  కోవిడ్‌ ఆసుపత్రులుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
 ప్రస్తుతం ఫాతిమా కోవిడ్‌ ఆసుపత్రి నందు 500 పడకలకు వసతి కలదని అవి పూర్తిగా కరోనా సోకిన వారితో నిండిపోతే, అదనంగా కడప నందు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రిమ్స్‌లో కోవిడ్‌ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు.
 ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి రిమ్స్‌ నందు 210 పడకలు ఏర్పాటు చేసేందుకు వసతి ఉన్నదని, ఉన్న ఇన్‌ పేషెంట్‌ (ఐ పి) బ్లాకులో రెండు విభాగాలు చేస్తున్నామని అన్నారు. ఇందులో కోవిడ్‌ విభాగానికి, మరో  విభాగంలో అన్ని కార్యకలాపాలు ప్రస్తుతం అలాగే కొనసాగించేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ రెండు విభాగాలకు సంబంధం లేకుండా మధ్యలో పార్టిషన్‌ కొరకు జింక్‌ షీట్లతో వేరు చేసి పార్టీషన్‌ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ రెండింటిని పూర్తిగా విడగొట్టడం జరుగుతుందన్నారు. ఈ రెండూ విభాగాలను రెండు ఆస్పత్రులుగా చేయడం జరుగుతుందన్నారు.
 దీనివల్ల సాధారణ పేషెంట్స్‌కు, కోవిడ్‌ బాధితులకు సంబంధం ఉండదని కలెక్టర్‌ చెప్పారు. ఇందులో 210 పడకల ఏర్పాటకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇంకా 24 ఐసియు బెడ్లు, 186 నాన్‌ ఐసియూ బెడ్లు రెగ్యులర్‌ వార్డులో ఏర్పాటు చేస్తామని కలెక్టర్‌ హరికిరణ్‌ వివరించారు.


*కర్నూలు జిల్లా:*


కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ కోసం జిల్లాకు 3 వేల వ్యక్తిగత రక్షణ ఉపకరణాలు (పీపీఈ కిట్లు), 2 వేల ఎన్‌–95 మాస్కులు, 96 వేల హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ మాత్రలు.
జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల్లో ఒక్క నగరంలోనే గనీగల్లీలో 12, బుధవారిపేటలో 7 కేసులు గుర్తించడంతో ఆ రెండు ప్రాంతాల్లో హైరిస్క్‌ అలర్ట్‌ ప్రకటించిన జిల్లా కలెక్టర్‌.
జిల్లాలో కరోనా వైరస్‌ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు కావడంతో అప్రమత్తమైన అధికారులు.
ప్రజల్లో రోగ నిరోధక శక్తి పెంచడంపై దృష్టి. 
జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పండ్ల తోటల యజమానుల సమన్వయంతో ఉద్యానవనశాఖ పండ్ల డోర్‌ డెలివరీ ప్రారంభం.
8 అరటి, 5 తీపి నారింజ, 5 నిమ్మ, 1 బొప్పాయి, 1 పుచ్చకాయ మరియు ఒక మాస్క్‌ కిట్‌ కలిపి రూ.100కు బ్యాగ్‌ డోర్‌ డెలివరీ.


Popular posts
అంతర్జాతీయ మాతృ దినోత్సవం
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
రేపే జగనన్న విద్యాదీవెన పధకం ప్రారంభం
Image
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image