రెండోవిడత ఉచిత రేషన్ పంపిణీకి సర్వం సిద్దం.

15.4.2020
అమరావతి


- రెండోవిడత ఉచిత రేషన్ పంపిణీకి సర్వం సిద్దం.


- లాక్ డౌన్ లో పేదలకు అండగా నిలిచిన ప్రభుత్వం.


- బియ్యం కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, కేజీ శనగలు.


- రాష్ట్ర వ్యాప్తంగా 1,47,24,017 కుటుంబాలకు లబ్ధి.


- ఇప్పటికే రేషన్ దుకాణాలకు చేరుకున్న సరుకులు.


- రేషన్ దుకాణాల వద్ద భౌతికదూరం పాటించేందుకు టైం స్లాట్ తో కూపన్లు.


- ఎక్కువ కార్డులు వున్న14,315 రేషన్ షాప్ లకు అదనంగా కౌంటర్లు.


- పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్ తీసుకునేందుకు కూపన్లు. 


కరోనా విపత్తు సమయంలో పేదలు ఉపాధి లేక ఆకలితో వుండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు గురువారం నుంచి రెండో విడత ఉచిత బియ్యం, కేజీ శనగలను అందించనున్నారు. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పౌరసరఫరాల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. పదమూడు జిల్లాల్లోని 29,783 చౌకదుకాణాల ద్వారా మొత్తం 1,47,24,017 కుటుంబాలకు బియ్యం, శనగలను అందించేందుకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే అన్ని చౌకదుకాణాలకు బియ్యం, శనగలను రవాణా చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలు భౌతికదూరంను పాటించాలన్న నిబంధనల మేరకు, రేషన్ దుకాణాల వద్ద గుంపులుగా ఏర్పడకుండా వుండేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలను తీసుకుంది. మొదటివిడత పంపిణీ సందర్బంగా కొన్నిచోట్ల రేషన్ కోసం కార్డుదారులు తొందరపడి ఒకేసారి దుకాణాల వద్దకు వచ్చిన పరిస్థితిని గమనించి ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకంగా కూపన్లను ముద్రించింది. వాలంటీర్ల ద్వారా ఈ కూపన్లను బియ్యంకార్డుదారులకు అందిస్తున్నారు. ఈ కూపన్లపై వారికి కేటాయించిన రేషన్ షాప్ లో ఏ తేదీలో, ఏ సమయానికి వారు వెళ్ళి రేషన్ తీసుకోవచ్చో నిర్ధేశిస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో వేర్వేరుగా నిర్ణయించిన సమయాలకు అనుగుణంగా కార్డుదారులు రేషన్ షాప్ లకు వెళ్ళి బియ్యం, శనగలను తీసుకోవాలని సూచిస్తున్నారు. దానివల్ల ఎక్కడా కూడా ఒకేసారి జనం గుమిగూడకుండా నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. వేలిముద్ర వేయకుండానే, వీఆర్వో లేదా ఇతర అధికారుల బయో మెట్రిక్ ద్వారానే రేషన్ అందించనున్నారు.  


 రాష్ట్రంలోని 14,315 రేషన్ దుకాణాల్లో ఎక్కువ కార్డులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. అధికశాతం అర్బన్ ఏరియాల్లో వున్న ఈ దుకాణాల్లో కూపన్లను అందించినా కూడా రోజుల తరబడి రేషన్ పంపిణీ చేయాల్సి వస్తోంది. అందుకు గానూ గుర్తించిన ఈ షాప్ లకు అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో 8 వేల దుకాణలకు సింగిల్ కౌంటర్, 3800 దుకాణాలకు రెండు కౌంటర్లు, 2,500 షాప్ లకు అదనంగా 3  కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ అదనపు కౌంటర్లలో తూకం యంత్రాలను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 1.47 కోట్ల కుటుంబాలకు బియ్యం  కార్డులు వున్నాయి. కానీ కేంద్రం మాత్రం 92 లక్షల కార్డులకే ఉచిత బియ్యంను అందిస్తోంది. మిగిలిన 55 లక్షల మందికి రాష్ట్రప్రభుత్వమే ఉచితంగా బియ్యం, కేజీ శనగలను అందిస్తోంది. దీనితోపాటు బియ్యంకార్డులు పొందేందుకు అన్ని అర్హతలు వుండి, దరఖాస్తు చేసుకున్న పేదలకు కూడా ఉచిత బియ్యం, శనగలను అందించాలని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు పేదలు రెవెన్యూ అధికారులకు ఉచిత బియ్యం కోసం దరఖాస్తు చేసుకుంటే, అర్హతలను పరిశీలించి వెంటనే మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకునే వారిని కూడా ముందుగానే వాలంటీర్లు గుర్తించి సివిల్ సప్లయిస్ అధికారులకు సమాచారం అందచేశారు. లక్షల సంఖ్యలో పోర్టబిలిటీ ద్వారా రేషన్ తీసుకుంటున్న కార్డుదారులకు కూడా వారు నివాసం వుంటున్న ప్రాంతంలోని రేషన్ దుకాణం నుంచి సరుకులు తీసుకునేందుకు వీలుగా వాలెంటీర్లు కూపన్లను అందిస్తున్నారు. 


గతనెల 22వ తేదీ నుంచి ప్రారంభమైన లాక్ డౌన్ వల్ల రాష్ట్రంలో రోజువారీ కూలీపనులు చేసుకునే పేదలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని గతనెల 29వ తేదీన తొలివిడతగా ఉచితంగా కార్డులో పేరు వున్న ఒక్కో సభ్యుడికి అయిదు కిలోల బియ్యం, కార్డుకు కేజీ కందిపప్పును ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. తొలివిడతలోనే దాదాపు 1.35 కోట్ల మంది పేదలు ఈ మేరకు లబ్ధిపొందారు. తిరిగి ఈనెల 16 నుంచి రెండో విడత ఉచిత బియ్య, కేజీ శనగలను పంపిణీ చేస్తున్నారు. తిరిగి నెలాఖరులో మూడోవిడత కూడా ఇదే తరహాలో బియ్యం, కందిపప్పు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 


 రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం రేషన్ సరుకులను డోర్ డెలివరీ ద్వారా అందిస్తోంది. మిగిలిన కరోనా ప్రభావిత ప్రాంతాల్లో రెడ్ జోన్ గా ప్రకటించిన ఏరియాల్లో బియ్యంకార్డు దారులు సురక్షితమైన జోన్ లో సరుకులు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ లకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రేషన్ అందక, ఇతరత్రా ఇబ్బందులు వుంటే 1902 కి కాల్ చేస్తే వెంటనే అధికారయంత్రాంగం చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 


జిల్లా   చౌకదుకాణాలు మొత్తం కార్డులు
పశ్చిమగోదావరి  2,211  12,59,925
చిత్తూరు   2,901  11,33,535
నెల్లూరు   1,895  9,04,220
తూర్పు గోదావరి  2,622  16,50,254
కృష్ణా    2,330 12,92,937
ప్రకాశం   2,151  9,91,822
గుంటూరు   2,802 14,89,439
వైఎస్ఆర్ కడప  1,737  8,02,039
విశాఖపట్నం   2,179  12,4,5266
విజయనగరం   1,404  7,10,528
శ్రీకాకుళం   2,013  8,29,024
కర్నూలు   2,363  11,91,344
అనంతపురం   3,012  12,23,684
-----------------------------------------------------