ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి చంద్రబాబు నాయుడు లేఖ

గౌ శ్రీ జగన్మోహన్ రెడ్డిగారికి,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి,
అమరావతి.
విషయం: రాష్ట్రంలో కోవిడ్ 19 వైరస్ నియంత్రణ-టిడిపి పోలిట్ బ్యూరో తీర్మానాలు-రాష్ట్ర ప్రభుత్వ చర్యల నిమిత్తం..
----
రాష్ట్రంలో కోవిడ్ వైరస్ కేసులు రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. స్వల్పకాలంలోనే 3వ దశ ‘‘సామాజిక వ్యాప్తి’’ దశకు చేరడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మొదటి, రెండు దశల్లోనే వైరస్ వ్యాప్తిని నిరోధించివుంటే ఈ ప్రమాదం వాటిల్లేది కాదని నిపుణులే చెబుతున్నారు. మొగ్గలోనే దీనిని నిరోధించివుంటే ఇంత మానుగా మారేది కాదనే భావన ప్రజల్లో సర్వత్రా నెలకొంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాల బాధ్యతలు, రాజకీయ పార్టీల బాధ్యత, ప్రజల బాధ్యతల గురించి మన రాజ్యాంగ నిర్మాతలు 70ఏళ్ల క్రితమే స్పష్టంగా విశదీకరించారు. విపత్తుల్లో చిక్కుకున్న బాధిత ప్రజానీకాన్ని ఆదుకోవడం, ఒక సామాజిక బాధ్యతగా తెలుగుదేశం పార్టీ గత 37ఏళ్లుగా కృషి చేస్తూనే ఉంది. 
బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా మొదటినుంచి కరోనా తీవ్రతపై రాష్ట్ర  ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాం. కరోనా ప్రబలకుండా ముందుజాగ్రత్తలపై ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేవాటిపై కరపత్రాల పంపిణీ, వీడియోల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉన్నాం. నిపుణులతో నిరంతరం చర్చలు జరుపుతూ వారిచ్చే సూచనలను ప్రభుత్వాలకు, ప్రజలకు తెలియజేస్తున్నాం. వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి మార్గాంతరాలను అన్వేషించాలని ఇప్పటికే అనేక లేఖల ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.
అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం నిన్న (గురువారం)ఆన్ లైన్ లోనే నిర్వహించాం. రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుల అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఈ భేటిలో చర్చించిన అంశాలను, పోలిట్ బ్యూరో తీర్మానాలను ఈ లేఖ ద్వారా మీకు పంపిస్తున్నాం. ప్రభుత్వంలోని వివిధ శాఖల అధికారులతో, ఇతర నిపుణులతో వీటిపై చర్చించి రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేలా సరైన నిర్ణయాలను సత్వరమే తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
టిడిపి పోలిట్ బ్యూరో తీర్మానాలు: 
1)దేశంలో కరోనా విపత్తు తీవ్రత దృష్ట్యా, లాక్ డౌన్ పీరియడ్ ను ఈ నెలాఖరుదాకా పొడిగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం..
2)విశాఖ మెడ్ టెక్ జోన్ పై పూర్తి శ్రద్ద పెట్టి అభివృద్ది చేయాలి. మరిన్ని కంపెనీలను ఇక్కడకు రాబట్టి వైద్య సిబ్బందికి కావాల్సిన రక్షణ ఉపకరణాలు (పిపిఈ), టెస్టింగ్ కిట్లు, వెంటిలేటర్లు, ఇతర మెడికల్ ఎక్విప్ మెంట్ తయారీని వేగవంతం చేయాలి.
3) కరోనా బాధితులకు సేవలు అందిస్తూ, మృతి చెందిన ఫ్రంట్ లైన్ వారియర్లకు రూ 50లక్షలు ఇన్సూరెన్స్ కేంద్రం ప్రకటించింది. దానితోపాటు కరోనా సోకి మృతి చెందిన వారి కుటుంబాలకు రూ 25లక్షలు ఆర్ధిక సాయం అందించాలి. 
4)ధాన్యం, పత్తి, మిర్చి, పండ్లతోటల ఉత్పత్తులను, ఆక్వా ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి. రూ 3వేల కోట్ల మార్కెట్ స్థిరీకరణ నిధి పెడతామని, రూ 4వేల కోట్ల ప్రకృతి విపత్తుల నిధి పెడతామని ఇచ్చిన హామీలను తక్షణమే నిలబెట్టుకోవాలి. 
5)లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయిన భవన నిర్మాణ కూలీలు, అసంఘటిత కార్మికుల కుటుంబాలను, భవన నిర్మాణ కార్మిక సంక్షేమనిధిలో ఉన్న రూ1,500కోట్ల నుంచి ఆదుకోవాలి.
6) చేతివృత్తులవారు, చేనేత, గీత కార్మికులు, మత్స్యకారులు, పేద ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలు, ప్రతి పేదకుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించాలి.
7) రైతుల కరెంట్ బిల్లులు, వీవర్ వర్క్ షాప్ లు, లాండ్రీలు, క్షవరశాలలు, చేతివృత్తులవారు, చిరువ్యాపారుల విద్యుత్ బిల్లులు, ఇతర పేద కుటుంబాల కరెంటు బిల్లులు, నీటి బిల్లుల వసూళ్లను రద్దు చేయాలి.
8)ఇతర దేశాల్లో, బైట రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్ధులు, వలస  కార్మికులు, మత్య్ికారులను ఆదుకోవాలి. వారు క్షేమంగా స్వస్థలాలకు చేరుకునేలా రాష్ట్రప్రభుత్వం యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టాలి.
9) రాష్ట్ర వ్యాప్తంగా కరోనా అనుమానితులు అందరికీ ఉచితంగా టెస్టింగ్ లు చేయాలి. ట్రాకింగ్, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్ మెంట్ 4 టి విధానం అమలు చేయాలి. వైరస్ సోకిన వారిని గుర్తించి, ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసి, సకాలంలో సరైన చికిత్స అందించడం ద్వారా వారి ప్రాణాలు కాపాడాలి, వారినుంచి ఈ వైరస్  ఇతరులకు సోకకుండా కట్టడి చేయాలి. ప్రజల ప్రాణాలను  కాపాడటంలో ఏమాత్రం నిర్లక్ష్యం, ఉదాసీనత ప్రదర్శించరాదు.
10)డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్య కార్మికులు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్లకు సరైన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్ మెంట్(పిపిఈ)లను సత్వరమే అందజేయాలి.


11)నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ రావు సస్పెన్షన్ ను వెంటనే ఎత్తివేయాలి. మాస్క్ లు అడిగిన డాక్టర్ ను సస్పెండ్ చేయడం అమానుషం. ఆయనపై సస్పెన్షన్ వెంటనే ఎత్తేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన డాక్టర్లు, వైద్య సిబ్బందిలో మనోధైర్యం పెంచాలి. 
12) పేదలకు 3నెలలకు సరిపడా బియ్యం, కందిపప్పు, గ్యాస్ సిలిండర్లు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడమే కాకుండా, విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం ఇంటికే అందించాలని సూచించింది. కేంద్రం ఇచ్చేవాటికి అదనంగా రాష్ర్  ప్రభుత్వం నుంచి కూడా కేరళ ప్రభుత్వ తరహాలో ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలి. 
- ఏపిలో ఇంటింటికీ వాలంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ చేస్తామని ముందుచెప్పి, తర్వాత మళ్లీ రివర్స్ లో చౌకడిపోల వద్దే పంపిణీ చేయడం వల్ల కార్డుదారులు గుంపులుగా చేరి భౌతిక దూరం పాటించడమే ప్రశ్నార్ధకమై, వైరస్ మరింత ప్రబలే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి భవిష్యత్తులో ఇచ్చే రేషన్ అయినా ఇంటింటికీ డోర్ డెలివరీ చేయాలి.
13)టిడిపి ప్రభుత్వం తెచ్చిన వినూత్న సంక్షేమ పథకాలు  అన్నా కేంటిన్లు, నిరుద్యోగ భృతి, చంద్రన్న బీమా, గిరిజనులకు ఫుడ్ బాస్కెట్, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ తదితరాలను రద్దు చేయకుండా కొనసాగించి వుంటే ఇప్పుడీ పరిస్థితిలో పేదలకు ఒక వరంగా ఉండేవి. కాబట్టి మీరు రద్దు చేసిన ఆ పథకాలన్నింటినీ వెంటనే పునరుద్దరించాలి. 
14)రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గతం కన్నా ఈ ఏడాది బాగుంది. కేంద్రం నుంచి కూడా నిధులు సమృద్దిగా వచ్చాయి. ముఖ్యమంత్రి సంక్షేమ నిధి(సీఎంఆర్ ఎఫ్)కు అనేక సంస్థలు, వ్యక్తులు భూరి విరాళాలు ఇచ్చారు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ నియంత్రణకు పోరాడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడం ధర్మం కాదు. కాబట్టి ఉద్యోగులు, పించనీర్లు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల్లో కోతలు లేకుండా పూర్తిస్థాయిలో చెల్లించాలి. 
15) కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శ్రద్ద పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ విపత్కర సంక్షోభంలో కూడా, రాజకీయ ప్రయోజనాలపైనే దృష్టిపెట్టడం భావ్యం కాదు. 
-రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ ఏర్పాటుపై సర్వే చేయడం, అనేక చోట్ల జెసిబిలతో ఇళ్ల స్థలాల చదును చేయడం, యూనివర్సిటిల పాలకమండళ్ల  నియామకంలో ఒకే సామాజికవర్గం వారిని పెద్దఎత్తున నియమించడం, ఒకవైపు దేశ వ్యాప్తంగా  లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో అక్రమ మైనింగ్, గ్రావెల్ తవ్వకాలు, ఇసుక, మట్టి వందలాది లారీల్లో అక్రమ రవాణా చేయడం,  అన్నిచోట్లా దొంగచాటుగా మద్యం అమ్మకాలు జరుగుతున్నా ప్రేక్షకపాత్ర 
పోషించడం, కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా సూచనలు చేస్తున్న తెలుగుదేశం పార్టీని, టిడిపి నాయకులను నిందించడాన్ని మానుకోవాలని కోరుతున్నాం. 
 రాజకీయ ప్రయోజనాల కన్నా, ప్రజా ప్రయోజనాలే మిన్నగా పనిచేయడం ద్వారా ప్రస్తుత కరోనా సంక్షోభంలో నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలని,   తక్షణ ఉపశమన చర్యల ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
నారా చంద్రబాబు నాయుడు
(తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు)