అత్యవసర  సేవల సిబ్బంది, మీడియాకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి : ఎపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి

కరోనా విధుల్లో పాల్గొంటున్న అత్యవసర  సేవల సిబ్బంది, మీడియాకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి.. ఎపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి


కరోనా విధుల్లో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు  నిర్వరిస్తున్న వైద్యులు, నర్సులు, పోలీసు, మున్సిపల్ సిబ్బందితో లపాటు, జర్నలిస్టులకు కూడా ఇన్సూరెన్స్ కల్పించాలని ఎపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.  కరోనా వంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వానికి అండగా ఉంటామని, ప్రభుత్వ ఉద్యోగుల ఒక రోజు మూల వేతనం వంద కోట్లకు పైగా సీఎం సహాయనిధికి అందచేశామని చెప్పారు. గాందీనగర్ లోని ఎపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం ఎన్జీఓ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో  మున్సిపల్ కార్మికులకు, విలేకరులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి, విద్యాసాగర్, స్వామి, వేమూరి ప్రసాద్, ఇతర సభ్యులు పాల్గొని కిట్ లను అందచేశారు. ఈసందర్భంగా ఎపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే అయినప్పటికీ, ప్రాణాల కన్నా.. ఏదీ ఎక్కువ కాదన్నారు. కరోనా విధుల్లో వైద్యులు, నర్సులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, విలేకరులు.. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేస్తున్నారన్నారు.  ఎపీ ఎన్జీఓ పక్షాన పేదలకు సాయం అందిస్తున్నామని, అదే విధంగా మున్సిపల్ సిబ్బందికి, విలేకరులకు కూడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేసినట్లు చెప్పారు. కరోనా మహమ్మారి ఏ రూపంలో ప్రాణాల మీదకు వస్తుందో తెలియదని, అయినా.. ప్రజల కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇచ్చే సూచనలు, సలహాలను ప్రజలకు చేరవేస్తూ.. జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తురన్నారు. వారికి భరోసా కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మీడియా సిబ్బందికి కేసులు పెరుగుతండటం ఆందోళన కలిగిస్తుందన్నారు. మరికొన్ని రాష్ట్రాలలో ఆయా ప్రభుత్వాలు జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ లు చెల్లించాయని, ఆ దిశగా ఎపీ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కూడా ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా రెండు విడతలగా జీతాలు చెల్లిస్తామని చెప్పారని,  అయితే ఈనెల పూర్తి జీతాలు చెల్లిస్తారని భావిస్తున్నామన్నారు.  ప్రభుత్వ వైద్యుల పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉందని, ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నా.. ప్రజల కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్నారన్నారు. వారికి అండగా ఉండేలా కేంద్రం చేసిన చట్టాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. పశ్చిమ కృష్ణా ఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ మాట్లాడుతూ లాక్ డౌన్ ప్రభావం పేద, మధ్యతరగతి ప్రజలపై బాగా పడిందని, చాలామందికి రోజు గడవటం కష్టంగా ఉందన్నారు. ఎపీ ఎన్జీఓ తరపున మున్సిపల్ సిబ్బందికి, అల్పాదాయం ఉన్న విలేకరులను ఆదుకోవాలని భావించి, బియ్యం, నిత్యావసర వస్తువులను అందచేశామన్నారు. కరోనా విధుల్లో పాల్గంటున్న గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, విలేకరుల రక్షణకు అవసరమైన పరికరాలను  ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలలో జర్నలిస్టులు కరోనా బారిన పడిన పరిస్థితి చూస్తున్నామని,  అందువల్ల కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వారికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. ఎపీ ఎన్జీఓ పక్షాన తమ వంతుగా లాక్ డౌన్ ఉన్నంత కాలం పేదలను ఆదుకుంటామని, కూరగాయలు, నిత్యావసర వస్తువులను పంపిణీ కొనసాగిస్తామని తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఎపీ ఎన్జీఓ రాష్ట్ర సంఘం నేతలు వెంకటేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, జిల్లా నేతలు పి.రమేష్, సి.హెచ్.అప్పారావు, నగర నాయకులు స్వామి, ప్రసాద్ లు పాల్గొన్నారు.