హైకోర్టును కూడా తరలిస్తారేమో?: కన్నా

హైకోర్టును కూడా తరలిస్తారేమో?: కన్నా
గుంటూరు: అహంకారపూరిత చర్యలతో ఏపీ సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తున్నారని.. ఇలాంటి అరాచకాలు మునుపెన్నడూ చూడలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం మంచిది కాదని హితవు పలికారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీకాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ద్వారా ఎస్‌ఈసీ రమేశ్‌ కుమార్‌ను తొలగించడంపై కన్నా స్పందించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నట్లు సీఎం వ్యవహరిస్తున్నారని ఆక్షేపించారు. ఇవన్నీ చూస్తుంటే హైకోర్టును కూడా రద్దు చేస్తారేమో అని మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేశారంటూ ఎస్‌ఈసీని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని.. ఒక బిల్లు సెలెక్ట్‌ కమిటీకి పంపితే కౌన్సిల్‌ను రద్దు చేసిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని కన్నా గుర్తు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై పోలీసులు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపుపై కేంద్ర ఎన్నికల సంఘం, గవర్నర్‌కు లేఖ రాస్తానని కన్నా తెలిపారు.