హబీబుల్లా అంకిత భావానికి జోహార్ - డీజీపీ
సీఎం ఆదేశాల మేరకు వెంటనే పరిహారం అందిస్తాం
అమరావతి, ఏప్రిల్ 19(అంతిమ తీర్పు) : అనంతపురం జిల్లా హిందూపురం కు చెందిన ఎస్.హబీబుల్లా (51) గత మూడు సంవ్సతరాలుగా పరిగి పోలీస్ స్టేషన్ లో ASI గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయనకు వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసే పోలీస్ అధికారిగా మంచి గుర్తింపు ఉంది. ఇది ఇలా ఉండగా ఇరవై రోజుల క్రితం హబీబుల్లాకు నలతగా ఉండడంతో పరిగి ఎస్ఐ ఆయనను విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించి ఇంటికి పంపించాడు. అయినప్పటికీ సమాజం ఎదుర్కొంటున్న విపత్తు దృష్ట్యా, విధి నిర్వాహణ దైవంగా భావించి తిరిగి విధులకు హాజరైయ్యాడు. పరిగి ఎస్సై అతని ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, అతనిని కొనాపురం పికెట్ దగ్గర డ్యూటీకి పంపించారు. విధులు నిర్వర్తిస్తూ మాస్కుల పంపిణీ మొదలగు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
ఇది ఇలా ఉండగా 16.04.2020 రోజున స్వల్ప అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు కరోనా వ్యాధి అనే అనుమానాన్ని నివృత్తి చేసుకోవటానికి హిందుపురం లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆ పిమ్మట అనంతపురం కిమ్స్ సవేరా కోవిడ్ ఆసుపత్రికి తీసుకు వెళ్ళగా అక్కడి వైద్య సిబ్బంది ధర్మల్ స్కానింగ్ చేసిన పిదప అతనికి జ్వరం మరియు కరోన లక్షణాలు లేక పోవడంతో, అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్ళమని సూచించారు. కుటుంబ సభ్యులు అతనికి మంచి చికిత్స ఇప్పించదలచి బెంగళూర్ తీసుకు వెళ్లాలనే ఉద్దేశ్యంతో హిందూపూరుకు తీసుకు రాగా, 17 వ తేది సాయంత్రం అస్వస్థతకు గురై మృతి చెందాడు. హబీబుల్లా కు భార్య సైరా భాను, కుమారుడు ఖదీర్, కుమార్తె సబీనా వున్నారు.
కరోన మహమ్మారిపై పోరులో అమరత్వం పొందిన ASI హబీబుల్లా మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రగాఢ సంతాపం తెలియచేశారు. తక్షణమే 50 లక్షల exgratia ప్రకటించారు. కరోన మహమ్మారిని మొదటి క్రమములో ఉండి ఎదుర్కొంటున్న డాక్టర్లు, పారిశుధ్య సిబ్బంది, పోలీసులు తదితర పోరాట యోధులుకు ఈ exgratia వర్తిస్తుందని తెలిపారు.
*హబీబుల్లా మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన డీజీపీ గౌతమ్ సవాన్గ్:*
హబీబుల్లా మృతి పట్ల డి.జి.పి గౌతమ్ సవాంగ్ IPS, రాయలసీమ కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ ఐ.జీ, సంజయ్ IPS, రేంజ్ డిఐజి కాంతి రాణా టాటా, ఎస్పి సత్యయేసు బాబు సంతాపం వ్యక్తం చేశారు. అంతే కాకుండా హబీబుల్లా కుటుంబానికి బాసటగా నిలుస్తామని,అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు వదిలిన పరిగి ASI హాబీబుల్లా మృతి పోలీసు శాఖకు తీరని లోటు అని శ్రీ గౌతమ్ సవాన్గ్ గారు తెలిపారు. వృత్తి పట్ల హాబీబుల్లా చూపిన మార్గం పోలీసు శాఖకు ఆదర్శనీయం. వారి మృతికి కుంగిపోము. మరింత దృఢ నిశ్చయం తో, త్యాగ నిరతి తో పోలీసు శాఖ ప్రజా సేవకు పునరంకితమవుతుందని గౌతమ్ సవాన్గ్ గారు తెలిపారు. కరోన యుద్ధాన్ని ఎదుర్కోవడంలో మరింత అకుంఠిత దీక్షతో విధులు నిర్వర్తించాలని పోలీసు సిబ్బందిని కోరారు. ఆ క్రమములో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.