కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ను పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ

కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ను పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది: కన్నా లక్ష్మీనారాయణ
ప్రధాని ప్రసంగం ద్వారా ఈ విషయం అర్థమవుతుంది
మోదీ రెండుసార్లు ప్యాకేజీలు ప్రకటించారు
ఆర్థిక ప్యాకేజీ దేశంలోని అన్ని రంగాలకు ఊతమిచ్చేదిగా ఉంది
నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లిస్తున్నాయి
కరోనా విజృంభణ నేపథ్యంలో నాలుగో దశ లాక్‌డౌన్‌ కూడా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా చేసిన ప్రసంగం ద్వారా అర్థమవుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ తెలిపారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ చర్యలతోనే కరోనా కేసుల సంఖ్యకు అడ్డుకట్ట పడిందని తెలిపారు. పేద ప్రజల కోసం ప్రధాని మోదీ రెండుసార్లు ప్యాకేజీలు ప్రకటించారని కన్నా లక్ష్మీ నారాయణ చెప్పారు. కేంద్రం ఇస్తోన్న నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు దారి మళ్లిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కరోనా కట్టడి కోసం అందరూ స్వీయ నియంత్రణ పాటించి ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని స్వాగతిస్తున్నట్లు కన్నా లక్ష్మీ నారాయణ తెలిపారు. ఈ ఆర్థిక ప్యాకేజీ దేశంలోని అన్ని రంగాలకు ఊతమిచ్చేదిగా ఉందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్యాకేజీ వల్ల దేశంలోని అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందుతారని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వటం మంచి పరిణామమని, చేనేతలు, చేతివృత్తుల వారికి కూడా సహకారం అందించేలా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని చెప్పారు.