అమరావతి మే 24, 2020 *ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి "ఈద్‌ ముబారక్"‌* ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్‌ ముబారక్‌) తెలిపారు. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సహృద్భావానికి, సర్వమానవ సమత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక అని, ప్రజలందరికీ శుభసంతోషాలు కలగాలని శ్రీ జగన్‌ ఆకాంక్షించారు. దైవత్వాన్ని నింపుకునేందుకు అల్లాహ్‌కు ఇష్టమైన జీవన విధానాన్ని ముస్లింలు ఈ విపత్కర కరోనా సమయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ.. నెల రోజులు కఠిన ఉపవాస దీక్షలు ఆచరించారని తెలిపారు. నెలరోజులపాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి రంజాన్‌ ఒక ముగింపు వేడుక కాగా, ఐకమత్యంతో మెలగడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, పేదలకు తోడ్పడటం ఈ పండుగ మానవాళికి ఇచ్చే సందేశమని ఆయన తెలిపారు. మహనీయుడైన మహ్మద్‌ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్‌ ఆవిర్భవించింది కూడా రంజాన్‌ మాసంలోనే కావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని పేర్కొన్నారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడాలన్న ఆశయం రంజాన్‌ పండుగలో అంతర్లీనంగా ఉన్న సందేశం అని అన్నారు. రంజాన్‌ అంటే ఉపవాస దీక్షలు మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ అని తెలిపారు.