అనంతపురం జిల్లాలో 5, 67, 944 మంది రైతులకు రూ. 766.72 కోట్ల లబ్ది : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ

'వైఎస్సార్ రైతు భరోసా' ప్రారంభం


: జిల్లాలో 5, 67, 944 మంది రైతులకు రూ. 766.72 కోట్ల లబ్ది


: రైతుల అకౌంట్లలో నగదు జమ


: రైతులకు మేలు చేయాలన్నదే సీఎం లక్ష్యం 


: రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ


అనంతపురం, మే 15:


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌’ పథకం శుక్రవారం ప్రారంభమైంది. విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. 


ఈ కార్యక్రమంలో అనంతపురం కలెక్టరేట్ లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి మాల గుండ్ల శంకర్ నారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, జాయింట్ కలెక్టర్ (ఆర్ బి & ఆర్) నిశాంత్ కుమార్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామి రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, సిద్ధారెడ్డి, తిప్పేస్వామి లు పాల్గొన్నారు. 


జిల్లాలో 5, 67, 944 మంది రైతులకు 766 కోట్ల 72 లక్షల రూపాయలు లబ్ది కలుగుతోందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఇందుకు సంబంధించి వెంటనే రైతుల అకౌంట్లలో నగదు జమ అయిందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎంపీ తలారి రంగయ్యలు రైతులకు రూ.766. 72 కోట్ల మెగా చెక్కును అందజేశారు. 


రైతులకు మేలు చేయాలన్నదే సీఎం లక్ష్యం - మంత్రి శంకర్ నారాయణ


రైతులకు ఎలా మేలు చేయాలన్నదే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతీ అడుగు వారి సంక్షేమం కోసమే వేస్తున్నారని, వైయస్ఆర్ రైతుభరోసా  - పీఎం కిసాన్ కింద 49 లక్షల మందికి పైగా రైతాంగానికి లబ్ధి చేకూరేవిధంగా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. రైతులు, రైతు కూలీలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని, వారి కోసం ఎంత చేసినా తక్కువే అవుతుందన్నారు. రైతు భరోసా లో భాగంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ పెట్టుబడి సాయం కింద 49 లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రూ. 7,500 జమచేశారని, దేశంలో మరెక్కడా లేని విధంగా కౌలు రైతులకూ పెట్టుబడి సాయం అందజేస్తున్నారన్నారు. ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతుభరోసా కేంద్రాలను ప్రారంభిస్తూ, రైతుసంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి విప్లవాత్మక అడుగులు వేస్తున్నారన్నారు. ఎన్నికల మానిఫెష్టోలో పొందుపరచిన రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం 12,500 కాకుండా అదనంగా 1000 రూపాయలు జమ చేసి మొత్తం 13,500 రూపాయలు పెట్టుబడి సాయం చేసిన ఘనత సీఎంకే చెందుతుందని అన్నారు. అయిదు సంవత్సరాల్లో అయిదు విడతల్లో దాదాపు 67,500 రూపాయలు ప్రతి రైతుకు ఇచ్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరని పేర్కొన్నారు. పంటలు సగిగా పండక, సరైన గిట్టుబాటు ధర లభించిక రైతు నష్టపోకూడదని 3 వేల కోట్ల రూపాయలతో తో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారని, 1500 కోట్ల రూపాయలతో ఇప్పటికే రైతుల నుంచి పంట కొనుగోలు చేశారని, కరోనా సమయంలోనే వెయ్యి కోట్ల మార్కెటింగ్‌ జరిగిందని మంత్రి తెలిపారు.


పెద్దాయన ను తలచుకొని కంటతడి పెట్టిన రైతు నాగరాజు :


ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో గార్లదిన్నె మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన రైతు కే. నాగరాజు సీఎం తో మాట్లాడారు.  అనంతపురం జిల్లా కరువు జిల్లా అని, ఈ జిల్లాలో కష్టాలు ఎక్కువని, అలాంటి సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఎన్నో అవకాశాలు కల్పించారన్నారు. వైయస్సార్ పాదయాత్ర చేసే సమయంలో రైతులకు అండగా ఉంటానని మాట ఇచ్చి, హంద్రీనీవా ద్వారా జిల్లాకు నీరు తెప్పించి, జీడిపల్లి డ్యామ్ ఏర్పాటు చేశారన్నారు. పెద్దాయన కాలంలో పంటలు బాగా పండేవని, ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత విద్యుత్ ఫైల్ పై తొలి సంతకం చేశారని, కష్టాల్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేశారని గుర్తు చేసుకున్నారు. రైతుని రాజుగా చూడాలనే ఆశ నెరవేరుతున్న సమయంలో పెద్దాయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని గుర్తు చేసుకుంటూ రైతు కంటతడి పెట్టారు. అనంతరం పెద్దాయన లేని లోటును తీర్చేందుకు, రైతులను ఆదుకునేందుకు మీరు ముందుకు రావడం ఎంతో గొప్ప విషయమన్నారు. గతంలో పాదయాత్ర చేస్తున్న సమయంలో రైతుల కష్టాలు చూసి చలించి అందర్నీ ఆదుకుంటామని మీరు హామీ ఇచ్చారని, ఆ హామీని నిలుపుకుంటూ జిల్లాలో చెరువులు అన్నిటికీ నీరు అందించారని, రైతుల కోసం రైతు భరోసా ప్రవేశపెట్టారని తెలిపారు. ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న కార్యక్రమాల వల్ల రైతుల్లో ధైర్యం కలుగుతోందన్నారు. రైతుల కష్టాల గుర్తించి, వారంతా మండలాలకు వెళ్లి క్యూలో నిలబడకుండా గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఇంటి వద్దకే విత్తనం అందించే కార్యక్రమం చేపట్టడం లాంటివి దేశంలోనే ఎక్కడ చేపట్టలేదని, ఇది ఎంతో గొప్ప విషయమన్నారు. మీరు అధికారంలో ఉన్నంతవరకు రైతులకు పూర్తి భరోసా ఉంటుందని రైతు తెలిపారు.


ఈ సందర్భంగా జిల్లాకు అధిక శాతం నీటిని కేటాయించి రైతులను ఆదుకోవాలని రైతు నాగరాజు ముఖ్యమంత్రిని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకునేందుకు జిల్లాకు వచ్చే హంద్రీనీవా కాలవలో 4 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని పెంచుతున్నామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో ఎకాలజీ సెంటర్ డైరెక్టర్ మల్లారెడ్డి, వ్యవసాయ శాఖ జెడి హబీబ్ భాషా, ఏ డి ఏ విద్యావతి, వివిధ శాఖల అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.