90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన

.
 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
నెల్లూరు :.   జిల్లాలో మహాత్ముడు 1929లో గాంధీజీ ఖద్దరు యాత్రకు వస్తున్నారని తెలిసిన తర్వాత బెజవాడలో కాశీనాధుని నాగేశ్వరరావు ఇంటిలో గాంధీజీ ఉన్నప్పుడు పొణకా కనకమ్మ గారు  గాంధీని కలిసి నెల్లూరులో కస్తూరిదేవి విద్యాలయ భవన శంకుస్థాపనకు ఆహ్వానించిన పిమ్మట మహాత్ముని అంగీకారంతో 1929 మే 10 న గాంధీ నెల్లూరు వచ్చారు.


నెల్లూరు జిల్లా మే 10వ తేదీ 1929 ఉదయం 5 గంటలకు కలకత్తా మేయిలులో మహాత్ముడు, కస్తూరిబా గాంధీ, కొందరు అనుచరులు దిగినారు.అప్పటికీ చాలామంది ఆయనను అభినందించడానికి రైల్వే స్టేషన్  వద్దకు వెళ్లి ప్లాట్ ఫామ్ మీద వేచి ఉన్నారు. మహాత్మునికి స్వాగతం పలికి, అక్కడ నుండి బుచ్చిరెడ్డిపాలెం తీసుకొనివెళ్ళారు. 5 గంటల 45 నిమిషములకు బుచ్చిరెడ్డిపాలెం చేరి తరువాత ఒక గంట ఆ ఊరి సమావేశ స్థలంకి వద్దకి వెళ్లారు. అక్కడ చుట్టుపక్కల గ్రామాల జనం తెల్లవారుజాము నుంచి క్రిక్కిరిసిపోయి గాంధీజీ రాకకై ఎదురుచూస్తూ ఉన్నారు. ఆ సభలో గాంధీకి 7000 రూపాయల నగదుని అందజేయడంచేయడం జరిగింది. తర్వాత గాంధీ ఉపన్యసిస్తూ ఆంధ్ర దేశమంతటి లోకి బుచ్చిరెడ్డిపాలెం అత్యంత  భాగ్యవంతమైన గ్రామమని, ప్రభుత్వం వారికి ఉన్నట్టే తనకి కూడా గూఢచారులు ఉన్నారని ఆ గ్రామంలో సుమారు 10,000 రూపాయలు  వసూలు చేయవచ్చునని  చెప్పారని, కావున మిగతా సొమ్ము కూడా వేసి భారతదేశంలోని లక్షలాది బిచ్చగాడు పక్షాన నేనొక బిక్షకుణ్ని. దరిద్ర నారాయణుల కోసం  నేను యాచస్తున్నాను. మీరు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వకుంటే వారి మనసు శాంతింప జాలదు. కావున ఈ ప్రదేశం నేను వదలి వెళ్ళే లోపల ఆ సొమ్ము ని వసూలు చేసి ఇవ్వగలరని భావిస్తున్నాను.తరువాత దూరాన ఉన్న ఎల్లాయపాళెం గ్రామానికి చేరుకుని అక్కడ కూడా అద్భుతమైన స్వాగతం తో మహాత్ముని నుంచి పెద్ద సభను ఏర్పాటుచేశారు. అదే దారిలో రాజుపాలెంలో కోవూరు కోఆపరేటివ్ యూనియన్ వారు ,గండవరం గ్రామస్తులు తదితరులు గాంధీజీ కి 800 రూపాయలు సేకరించి ఇవ్వడం జరిగింది.  తర్వాత పార్లపల్లి, విడవలూరు గ్రామాలలో ఖద్దరు నిధికి 600 రూపాయలు స్వీకరించడం జరిగింది.ఊటుకూరు గ్రామంలో 1116  రూపాయలు  లభించాయి. గాంధీజీని చూడవలెనని అనేకమంది ఆసక్తితో నిరీక్షిస్తూ ఉండిపోయారు అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉండటం చేత గాంధీజీ చాలా గారు డస్సిపోయారు.గాంధీజీ ఆరోజు రాత్రికి మోపూరు వెళ్లి, అక్కడే బస చేశారు. మే10న గాంధీజీ అనుచరులు, కస్తూరిబా గాంధీగారు నెల్లూరు నుండి మోపూరు వెళ్ళినారు.వారు విడిది చేసిన ఇంటి ముందు సాయంకాలం 5.30 గంటలకు బహిరంగ సభను ఏర్పాటు చేయటం జరిగింది. అనేకమంది జనం ఆయన కోసం నిరీక్షిస్తూ నారు రేబాల సుందర రామిరెడ్డి గారు నిధికి సమర్పించిన 1116 రూపాయలు స్వీకరించి, అక్కడ నుండి అల్లూరు కి వెళ్లారు.అక్కడ  బహిరంగ సభలో పదివేలమంది జనంతోఉత్సాహంగా పాల్గొని గాంధీజీని ఆహ్వానించారు. మహాత్ములు వేదికపైకి రాగానే మారెంరెడ్డి రామిరెడ్డి గారి సతీమణి 116రూపాయలు సమర్పించారు.గ్రామస్తులు ఖద్దరు నిధికి 1116 రూపాయలు ఇచ్చారు. తాగుడు మానవలెనని, ఖద్దరు ధరించాలని,ముస్లింలు క్రైస్తవులు అందరూ ఐకమత్యంగా ఉండాలని,అస్పృశ్యతను నిర్మూలించాలని భారత స్వాతంత్ర్య సమరానికి ఉన్ముముక్తులు కావాలని ఉపన్యసించారు.తరువాత వారి సహచర బృందంతో  కావలికి వెళ్ళినారు.తెల్లవారుజాము నుంచి అక్కడి బోర్డు కాంపౌండ్ లో గాంధీ గారి దర్శనం కోసం జనం చేరడం, సభాస్థలి వద్ద 10,000 మంది గుమికూడి వున్నారు. గాంధీజీ సభా స్థలం వద్దకు రాగానే దేశభక్త రంగయ్య గారి 5 సంవత్సరముల వయసుగల బాలుడు వడికిన కొత్త నూలును గాంధీ గారికి కానుకగా ఇచ్చారు. వారు చాలా సంతోషించి  గాంధీ గారికి కానుకగా వచ్చిన దండలలో ఒక దండ ను ఆ పిల్లవాని మెడలో వేశారు. లజపత్ రాయ్ ఖాదీ బండారం పక్షాన,పౌరుల పక్షాన 1116 రూపాయలు సమర్పించారు. ఈ ఖాదీ బండారం అధిపతి మరొక 50 రూపాయలు తాము నేసిన బట్టల జతలు గాంధీకి, ఒక చీరను కస్తూరిభా గాంధీకి సమర్పించి సత్కరించారు. అక్కడ వారికి ఇచ్చిన సన్మాన పత్రాలను వేలం పెట్టగా  30 రూపాయలు వచ్చినాయి. కావలిలో మొత్తం మీద 18 వందల రూపాయలు చేకూర్చి చింతలపాలెం,సిద్దన్న కొండురు ప్రజల వల్ల 116రూపాయలు లభించాయి. ఆరోజు రాత్రి కావలి ఉన్నత పాఠశాలలో విశ్రాంతి తీసుకుని మే 11 ఉదయం, శనివారం నాడు ఉలవపాడు బయలుదేరి వెళ్లారు.అక్కడ సన్మానపత్రం తో పాటు ఖద్దరు నిధికి 600 రూపాయలు  వసూలయినాయి. తరువాత కందుకూరు వెళ్లి అక్కడ తాలూకా బోర్డువారు  11 వందల రూపాయలు సమర్పించారు. నెల్లూరు జిల్లాలో గాంధీజీ సంచారం చేసినప్పుడు శాసనసభలో సభ్యుడిగా ఉన్న శ్రీ బత్తిని పెరుమాళ్ళ నాయుడు గారు కాంగ్రెస్ సంఘ అధ్యక్షుడుగాను,కార్యదర్శిగా శ్రీ ఆచంట లక్ష్మీ నరసింహం గారు గా ఉన్నారు. జిల్లాలో 30 లేదా 40 వేల రూపాయలు ఖద్దరు నిధికి సమర్పించవలసిన ఉన్నది,అంచేత ఈ నిధిని వసూలు చేసే పద్ధతి గురించి విచారించడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశమై ఆ సమావేశంలో కందుకూరు తాలూకాలో ఎక్కువ ఆర్థిక సహాయం అందదని100 మైళ్ళ దూరంలో ఉన్నందువలన కందుకూరు చేరడానికి పూర్తిగా ఒక రోజు కేటాయించవలసి వస్తుందని ఈ సంచారంలో కందుకూరు చేరడం లాభదాయకం కాదని జిల్లా కమిటీ లో కొంతమంది వారించగా,ఆచంట లక్ష్మీ నరసింహంగారు ఖద్దరు నిధి కోసం వస్తున్న మాట నిజమేనని,ఎట్లా జరుగుతుందో చూడవలెననంటే ఆయన కందుకూరురావాల్సిందదేనని పట్టుబట్టారు.దాంతో గాంధీ గారు కందుకూరి రాక కార్యక్రమంలో చేర్చడం జరిగింది. 1929మే11 ఉదయం 9   గంటలకు అంకమ్మ దేవుళ్ళను ఎదుట విశాల స్థలంలో ఏర్పాటుచేసిన సభా స్థలికి చేరుకుని  ఉపన్యసించారు.అక్కడి  స్థానిక ప్రజలకు ,సంస్థలకు ఖద్దరు ప్రచారం చేయవలసిందని,అంటరానితనం రూపుమాపు వలసిందని హిందూ ముస్లింలు సఖ్యతతో మెలగాలని,హిందీ భాషను నేర్చుకునేందుకు ప్రయత్నం చేయమని  చెప్పారు.
గాంధీజీ కందుకూరు లో ఉండగా ఒక సంఘటన జరిగింది.గాంధీజీ పీ.డబ్ల్యు.డి బంగళాలు బసచేసిన ఆయుష్కర్మ కోసం మంగలిని పిలవమన్నారు. శ్రద్ధ వహించిన గోవిందు అనే మంగలిని పిలిపించారు.( అతడు ఆయుష్ కర్మకు వెండి గిన్నెనే వాడేవాడు) ఆ మంగలి విదేశీ బట్టల లో ఉన్న కారణం చేత ఆయుష్కర్మకు ఇష్టపడక ఖాదీ ధరించిన మంగలి వచ్చేవరకు తాను ఆ పని చేయించుకోనన్నాడు. ఈ విషయం ఊరంతా పాకింది. గాంధీజీ కి చాకలి కావాలని కబురు పంపగా ఒక చాకలి తనంతట తానే ఖాదీ ధరించి వచ్చి గాంధీజీ బట్టలు తీసుకొని వెళ్ళినాడు.
అది అందరికీ ఆశ్చర్యం కలిగించింది .మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక  రైతు గాంధీజీ బస చేసిన స్థలానికి వచ్చి గాంధీజీని దర్శనం చేసుకోనిదే తాను చద్ది అన్నం కూడా తిన బోనునని,30, 40 మైళ్ల దూరం నుంచి వచ్చానని చెప్పటంతో అక్కడ ఉన్నవారు గాంధీజీ గారితో చెప్పగా, గాంధీజీ వెంటనే బయటకు రాగా రైతు నమస్కారం చేసి సంతోషంతో వెళ్లిపోయినాడు. మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల వరకు తన భాషలో రాట్నం వాడుకుంటూ గాంధీజీ ఖాదీ కార్యకర్తల సమావేశం జరిపారు. ఆయనకి ఇరువైపుల కొండ వెంకటప్పయ్య పంతులుగారు, వేమూరి నారాయణ మూర్తి గారు కూర్చున్నారు. ఆ సమావేశంలో ఆచంట లక్ష్మీ నరసింహం గారు, మరో 25 మంది కార్యకర్తలు ఉన్నారు. కందుకూరు పరగణాలో ఖాదీ విస్తరణకు గల అవకాశాలను గురించి కందుకూరు,కనిగిరి, దర్శి తాలూకాలు నెల్లూరు జిల్లాలో వెనకబడిన ప్రాంతాలు అవటంతో ఆ ప్రాంతాలలో అటకమీద కానీ,వాడుకలో కానీ 25 వేల చర్కాలున్నాయని, పని ఇస్తే అటక మీది రాట్నాలకు కూడా నేతవారు 2 వేల మంది ఉన్నారని వారిలో చాలామంది హరిజనులని ఈ ప్రాంతంలో పత్తి సమృద్ధిగా పండుతుందని, ప్రతి గ్రామంలోనూ పత్తి గిరక లతోపాటు  దూదేకుల వారు కూడా ఉన్నారని, రైతులు ఖాదీ ఉత్పత్తి చేసుకుని,ఖాదీధరించే అలవాటు ఇంకా పోలేదని మా అన్నగారు శ్రీ సత్యనారాయణ చేసిన విచారణ వల్ల తనకు తెలిసిందని లక్ష్మీ నరసింహం గారు గాంధీ గారికి విన్నవించారు.అంతేగాక పేదరికం వల్ల పరిసర గ్రామాల నుంచి కందుకూరుకు 8మైళ్ళ దూరం నడచి వచ్చి వారు కనీసం 10 రోజులు వడికిన 18 వారల నూలును ఆసు పోసి ఇచ్చి ఒక రూపాయి మజూరీ తీసుకుంటున్నారని, నరసింహం గారు గాంధీజీకి తెలియజేశారు.అప్పుడు గాంధీజీ  "ఇది నిజమే? సంయుక్త రాష్ట్రాలలో కంటే ఇక్కడ చౌకా?" అని ప్రశ్నించారు. అవునని లక్ష్మీ నరసింహం గారు చెప్పగా, వెంకటప్పయ్య పంతులుగారు లక్ష్మినరసింహం గారు చెప్పింది నమ్మవచ్చునన్నారు. అప్పటికి మధ్యాహ్నం 3 గంటలు అయింది. గాంధీజీ లక్ష్మీనరసింహం గారితో  ప్యారీలాల్ ను పంపి రాము అక్కడ నుంచి బయలుదేరే లోగా అక్కడి యదార్ధ పరిస్థితులను సాధ్యమైనంత వివరంగా తెలుసుకొని రమ్మన్నారు. ప్యారీలాల్, లక్ష్మీ నరసింహం గారితో పోయి త్వరత్వరగా వివరాలు రాసుకుని వచ్చేటప్పటికి సాయంత్రం 5 గంటల 5నిమిషాలు అయింది. గాంధీజీ నిర్ణీత కాలం ప్రకారం 5 గంటలకే బస నుంచి వెళ్ళిపోయినారు. గాంధీజీ కందుకూరికి  వెళ్ళిన నెలరోజుల్లోనే అఖిల భారత సంఘ కార్యదర్శి  శ్రీ శంకర్ లాల్ బ్యాంకర్ కందుకూరు లో చరఖా సంఘ ఉత్పత్తి కేంద్రం ప్రారంభించారు.అది ఆంధ్ర ఖాదీ కేంద్రాలలో లాంక్ షైయిర్ వంటిది అని ప్రస్తుతింపడింది. సాలుకు 8 లేదా10  లక్షల రూపాయల ఖాదీ ఉత్పత్తి చేసిన ఆ కేంద్రం ఇప్పటికీ కృషి చేస్తూనే ఉంది. శ్రీమతి కస్తూరిబా, దుర్గాభాయి, కొండ వెంకటప్పయ్య గార్లతో గాంధీ పామూరు వెళ్లి తోవలో ఖద్దరు నిధికై 150 రూపాయలు లభించగా, కస్తూరిబా గాంధీ గారు కొన్ని నిమిషములు  ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.కందుకూరులో సాయంత్రం బయలుదేరి,నెల్లూరులో  సమీపంలో గాంధీ గారి స్వహస్తాలతో నిర్మించిన  పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం, పల్లిపాడులో  రాత్రి  8 గంటలకు చేరుకొని రాత్రి అక్కడే బస చేయడం జరిగింది. ఆ రోజుల్లో పల్లెపాడు కి ప్రయాణం అంటే ఊరికి బాట లేదు.ఎడ్లబండిలో గాని, కాలినడకన మాత్రమే చేరాలి. నడక దారిన వెళ్లాలంటే ఇసకలో  గిడసల లోతు కాళ్లు కూరుకుపోయేవి. అప్పటికే కొండ వెంకటప్పయ్య, వెన్నెలకంటి రాఘవయ్య లు తిక్కవరపు వెంకటరెడ్డి గారికి  వారితో ఉన్న పరిచయంతో ఆశ్రమ కార్యకలాపాలలో తమ వంతు సహకారం అందించే వారు. తిక్కవరపు  వెంకట రెడ్డి గారు బండి కట్టించుకుని బండిలో  గాంధీజీ దంపతులను కూర్చుండబెట్టుకొని తీసుకువచ్చారని, తిరిగి వెనుకకు మైపాడు రోడ్డు మీదకు చేర్చినారనివారే స్వయంగా వ్రాసిన వ్రాత పత్రం ఆధారంగా తెలిసింది. మహాత్ముడు ఇతర కాంగ్రెస్ లు పల్లెపాడు ఆశ్రమంలో సమావేశమై మా భవిష్యత్తును గురించి చర్చించారు.ఆశ్రమంలో ఉండి ఆశ్రమ నిర్వహణకు ముందుకు రాలేదు గాంధీజీ ఆశ్రమంబాధ్యతను దేశభక్త కొండ వెంకటప్పయ్య కు అప్పగించారు.నెల్లూరు జిల్లాలో ఇతర ప్రదేశాలలో గాంధీజీ చేసిన ఉపన్యాసాలలో ప్రధానంగా ఆశ్రమ భవిష్యత్తును గురించి హనుమంతరావు వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడారు. పల్లెపాడు లో  ఖద్దరు నిధి కై  రూపాయలు 714.90 పైసలు సమర్పించడం జరిగింది.  మైపాడు కు బయలుదేరే ముందు ఆశ్రమంలో పెద్ద బహిరంగ సభ నిర్వహించగా 540 రూపాయల విరాళం ఖద్దరు నిధి కి లభించింది. ఆ బహిరంగ సభలో  వెన్నెలకంటి రాఘవయ్య, కొండ వెంకటప్పయ్య, స్థానిక  ప్రముఖులు,ప్రజలు పాల్గొన్నారు.ఆశ్రమం నుండి మే 12 వ తేదీ 7 గంటలకు బయలుదేరి మైపాడు గంగపట్నం 8.30 గంటలకు చేరారు. మైపాడు చుట్టుపక్కల  ఉన్న వెంకన్నపాలెం, కోడూరు, కొరుటూరు మొదలైన గ్రామాలో  సభలో మాట్లాడుతూ, వారు వేరువేరుగా  ఇచ్చిన విరాళాలను
 స్వీకరించారు. గ్రామస్తులు సమిష్టిగా 340 రూపాయలు ఇచ్చారు. స్త్రీలు నగదు రూపంలో కొంతమంది ,ఆభరణాల రూపంలో విరాళాలు  ఇచ్చారు. త్రోవలో కొంతమంది మహిళలు గాంధీజీని ఆపి వారి ఆభరణాలను బహూకరించారు. 
 ఇందుకూరుపేట మీదుగా గాంధీజీ నెల్లూరు చేరారు.   Y.M.C.A Y(You),M(must),C(come),A(again)( మీరు మరొకసారి రావలె) ఆహ్వానించి5,000 రూపాయలు సమర్పించారు. మహాత్మాగాంధీ వారిని అభినందించి తమ నివాసానికి చేరుకున్నారు.
కస్తూర్బా గాంధీ ఆమె  వర్గం మోటారు వాహనం లో సంగం వెళ్లి అక్కడ  ఖద్దరు నిధికి విరాళాలు స్వీకరించి సాయంత్రానికి నెల్లూరు చేరి గాంధీజీని కలుసుకున్నారు. గాంధీజీ సాయంత్రం  శ్రీ రేబాల పట్టాభి రామిరెడ్డి గారి బంగళా నుండి బయలుదేరి దానికి వెళ్లి ఆ సంఘ సంస్థాపకుడు నాగరాజు పిచ్చి రాజు ఐదు వేల రూపాయల 2 అణాల కానీ తో ఒక సన్మాన పత్రం ఇచ్చారు .ఆ తర్వాత బజారు వీధి గుండా పోతూ ఉండగా నిష్టాగరిష్ఠుడైన కాంగ్రెస్ కార్యకర్త116 రూపాయలు, ఇంకొంత ధనం 287 రూపాయలు ఖద్దరు నిధికి, 20 రూపాయలు లాలాజీ నిధికి సమర్పించారు. గాంధీజీ రాకతో పునీతమైన  నెల్లూరు చక్కగా అలంకరించబడి ఉంది. హిందీ భాష ఉపన్యాసకులు కొందరు ఖద్దరు నిధికి నెల్లూరు మున్సిపాలిటీ వారు వెంకటగిరి కళాశాలలో నూలు వడుకు ప్రదర్శన ఏర్పాటు చేసి అందులో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని, హాలులో  నూలు వడుకుతున్న వారిని చూసి గాంధీజీ ముగ్ధులయ్యారు. వారిలో ముగ్గురు పంచమ బాలికలు కూడా ఉన్నారు. గాంధీజీని ఆ సంఘ అధ్యక్షులు ,సభ్యులు ఆహ్వానించారు.  గాంధీజీ దూదేకుల పని కూడా ప్రవేశ పెట్టవలసి ఉందని , మునిసిపాలిటీకి సలహా ఇస్తూ, ఇప్పటికే వారు ఎందుకు  ఈ పని చేస్తున్నారో చెప్పవలసిన బాధ్యత కూడా వారికి ఉందని తెలిపారు.1923 వ సంవత్సరంలోనే  కస్తూరి దేవి విద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది.1928 వ సంవత్సరం భవన నిర్మాణం కు నెల్లూరు పొగతోట ప్రక్కన 21/2ఎకరముల స్థలము5,400  రూపాయలకు   శ్రీమతి పొణకా కనకమ్మ గారు కొనుగోలు చేశారు.మే 12వ  తేదీ సాయంత్రం కస్తూరి దేవి బాలికల పాఠశాలకు గాంధీజీ పునాదిరాయి వేశారు.  గాంధీ బొమ్మకు,పొగతోట కు  మధ్యలో,సమీపంలో రేవూరి కాలువకు తర్వాతి భాగము కస్తూరి దేవినగర్ గా పిలుస్తారు. కనకమ్మ గారు వెండి తాపీని చేయించి కస్తూరి దేవి విద్యాలయ  భవనానికి పునాది రాయి గాంధీజీ చేతుల మీద  వేయించారు.  ఆ సందర్భంలో కనకమ్మ గారితో మీ వద్ద ధనం చాలా ఉన్నట్టు ఉంది ఈసారి బంగారు తాపీ చేయిస్తేనే  శంకుస్థాపనకి వస్తానని హాస్యోక్తులు వేశారు. గాంధీజీ సంస్థ పక్షాన281 రూపాయలు  సమర్పించారు.  అది కాక 162 రూపాయలు అదనంగా వసూలు అయింది.తర్వాత వెంకటగిరి రాజా గారి కళాశాల ఆవరణలో బహిరంగ సభకు వెళ్లారు .అక్కడ గాంధీ నెల్లూరు పురపాలక సంఘము, నెల్లూరు జిల్లా బోర్డు, నెల్లూరు తాలూకా బోర్డు,పాకీవాళ్ళ సంఘం వారు సన్మాన పత్రాలు చదివారు. 6 వేల రూపాయల ఖద్దరు నిధికి సమకూర్చారు. సన్మాన పత్రాలు జవాబిస్తూ అస్పృశ్యతా నివారణ హిందూముస్లిం ఐకమత్యం ఖద్దరు ధారణ గురించి గాంధీజీ ప్రసంగించారు. తరువాత స్థానిక అనాధ శరణాలయానికి వెళ్లి ఒక నాటక ప్రదర్శన చూశారు. మే 13 వ తేదీన బహిరంగ సభలో వకీళ్ళ సంఘం వారు ,తిక్కవరపు రామిరెడ్డి ,సిద్ధవరపు రామలింగారెడ్డి గారు, పొట్టేపాలెం వారు, సంగం పౌరులు, నెల్లూరులో మొత్తం5,493-1-0 మొత్తాలలో విరాళాలు అందజేశారు. ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులు , మునిసిపల్ పాకీ వారు  విరాళం తో పాటు,సన్మాన పత్రం తో సహా ఇచ్చారు. నెల్లూరు కో-ఆపరేటివ్ బ్యాంకింగ్ యూనియన్ , మరికొంతమంది చిల్లరగా  ఖద్దరు నిధికి విరాళాలు సమర్పించినారు. శ్రీ ముకుందరావు గారు విస్తృతం చేసిన మహాత్మా గాంధీజీ చిత్రపటం ఆయనకు బహిష్కరించగా,ఆయన దానిని వేలం పెడుతూ" నన్ను నేను అమ్ముకుంటున్నాను"హాస్యంగా అన్నారు. దానిని రేబాల పట్టాభిరామిరెడ్డి గారు 80 రూపాయలకు కొనుగోలు చేశారు.   నెల్లూరు మిత పాన సమితి సన్మాన పత్రం స్పీకరిస్తూ  ఈ సమితి ఖద్దరు నిధికి విరాళం ఇవ్వకుండటంలో కూడా తగినంత నిగ్రహాన్ని ప్రదర్శించింది అన్నారు గాంధీజీ. అనంతరం గాంధీజీ పదివేల మంది ఉన్న మహాసభలో హిందీ భాషలో ఉపన్యసించారు.తనకు సన్మాన పత్రాలు సమర్పించిన వారికి  కృతజ్ఞతాభివందనలు తెలిపారు. ఈ పూర్తి ఉపన్యాసాన్ని           ఆశాంతం కొండ వెంకటప్పయ్య పంతులుగారు  తెలుగులోకి అనువదించారు. మరుసటి రోజు సోమవారం కావడంతో రోజంతా మౌనవ్రతం లో ఉండి సాయంత్రం 7 గంటల తర్వాత మౌనవ్రతం విరమించి అనంతరం రేబాల పట్టాభిరామిరెడ్డి గారి ఇంట్లో ఆశ్రమ భవిష్యత్తును గురించి అభివృద్ధిని గురించి ప్రణాళికలు నెల్లూరు జిల్లా కమిటీకార్యకర్తలతో చర్చించారు.నెల్లూరులో ఖద్దరు నాటికి సుమారు 28 వేల రూపాయలు, లజపతి రాయ్ నిధికి 700 రూపాయల పైచిలుకు  వసూలు అయినట్లు బెజవాడ సుందర రామిరెడ్డి గారు ప్రకటించారు.  మొత్తం 5 సార్లు (1915,1921,1929,1936,1946)గాంధీ గారు నెల్లూరుని సందర్శించడం జరిగింది. 90 సంవత్సరములు చేసుకున్న గాంధీజీ 2 వ సారి నెల్లూరు పర్యటన నెల్లూరుయులకు,పల్లెపాడు,పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం, కస్తూరి దేవి విద్యాలయం చిరస్థాయిగా చరిత్రలో  ఒక తీపి గుర్తుగా నిలిచిపోయింది.   గాంధీజీ సందర్శన విశేషాలు అనేకం ఇంకా ఎంతో సేకరించవలసి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో గాంధీజీ తెలుగు అకాడమీ వారి పుస్తక భాండాగారం నుండి కొంత, ఆశ్రమంలో సంబంధం ఉన్న వారి వారసుల వద్ద  సేకరించిన మేరకు ఈ వ్యాసం రాయడం జరిగింది.                  


గూడూరు లక్ష్మి   MA(Gandhian Thoughts),(LLB)                            అధ్యక్షులు: శ్రీ కళాలయ చారిటబుల్ ట్రస్ట్, పొగతోట,నెల్లూరు.9441638900,    Email: kalalayalakshmi@gmail.com


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
తెలుగు నాటక రంగానికి పితామహుడు  కందుకూరి రాష్ట్ర చలనచిత్ర,టివి,నాటక రంగ అభివృద్ది సంస్థ ఎం.డి. టి.విజయకుమార్ రెడ్డి
Image
*కోటంరెడ్డి సోదరులను పరామర్శించిన మంత్రి మేకపాటి* నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తల్లి సరళమ్మ గారు ఇటీవల మృతి చెందినందున, నేడు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వారిని పరామర్శించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి . ఆయన వెంట జిల్లా యువజనవిభాగం అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్, పాపకన్ను మధురెడ్డి, హరిబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Image
అంబేద్కర్‌ సేవలు నిరుపమానం: బిశ్వభూషణ్
Image
కరోనా నెగిటివ్ వస్తే ఎస్ఎంఎస్ తో సమాచారం
Image