తెలుగు కోసం జగన్‌తో పోరాటానికి రెడీ అవుతున్న బీజేపీ లీడర్

తెలుగు కోసం జగన్‌తో పోరాటానికి రెడీ అవుతున్న బీజేపీ లీడర్
*(ఆర్) సుప్రీంలో తేల్చుకుందాం.. తెలుగు కోసం తగ్గేది లేదంటున్న సుధీష్ రాంభొట్ల*
తెలుగుకు పుట్టినిల్లయిన ఆంధ్రప్రదేశ్‌లోనే ఆ భాషకు తీరని కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం ఎస్‌ఈఆర్టీని వాడుకుంది. అయితే.. ప్రభుత్వం బలవంతంగా అమలుచేయడానికి సిద్ధమవుతున్న ఇంగ్లిష్ మీడియం వల్ల తెలుగు మీడియం చదవాలనుకునే విద్యార్థులకు కష్టాలు మొదలవుతున్నాయి. 
 ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 24 తీసుకొచ్చింది. ఎస్‌ఈఆర్టీ ఇచ్చిన 59 పేజీల నివేదిక ప్రకారం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నట్లు అందులో పేర్కొంది.  తెలుగు మీడియం కావాలని కోరిన 53,947 మంది విద్యార్థుల కోసం మండలానికొకటి చొప్పున 672 తెలుగు మీడియం స్కూలు నడపనున్నట్లు పేర్కొంది.
అయితే, తమిళ, ఒరియా, కన్నడ, ఉర్దూ మీడియం ఎప్పటిలాగే కొనసాగుతుందని ప్రభుత్వం ఆ జీవోలో చెప్పింది.
 అయితే... దీనిప్రకారం తెలుగు మీడియం చదవాలనుకునే విద్యార్థులకు ఏపీలో చాలా కష్టాలు ఎదురవుతాయి. ఏపీలో మండల కేంద్రానికి 70 - 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాలూ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని వై.రామవరం మండలంలో కొన్ని గ్రామాలు ఆ మండల కేంద్రానికి వెళ్లాలంటే మరో నాలుగైదు మండలాలను దాటి వెళ్లాలి. అలాగే మిగతా జిల్లాల్లోనూ మండల కేంద్రానికి 50 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న గ్రామాలున్నాయి. అలాంటి చోట తెలుగు చదవాలనుకునే విద్యార్థులకు అసలు బడికి వెళ్లడమే కష్టమవుతుంది.
 మరోవైపు ఇంగ్లీష్ మీడియంను బలవంతంగా రుద్దడానికి వ్యతిరేకంగా బీజేపీ నేత సుధీష్ రాంభొట్ల ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో గతంలో ఇచ్చిన జీవో 81, 82లను కోర్టు కొట్టేసింది. అయితే.. విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయం మేరకు మీడియం ఉండాలని కోర్టు సూచించడంతో ఏపీ ప్రభుత్వం తనకు అనుకూలంగా అభిప్రాయ సేకరణ చేయించుకుందన్న ఆరోపణలున్నాయి. ఆ అభిప్రాయ సేకరణ ఆధారంగానే ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా ఇంగ్లీష్ మీడియం తెచ్చి తెలుగుకు తిలోదకాలిచ్చింది.
 అయితే, దీనిపై తన పోరాటం ఆగదని సుధీష్ రాంభొట్ల అంటున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ వేసిన ఆయన ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా ఆంగ్లభాషను తెస్తూ తెలుగును చంపేయడానికి చేస్తున్న ప్రయత్నాలను సుప్రీంకోర్టు ద్వారా అడ్డుకోవడానికి సిద్ధపడుతున్నారు.