సంయిక్త కలెక్టర్ గా (అభివృద్ది) రేపు బాధ్యతలు తీసుకోనున్న హిమాన్హు శుక్లా
చిన్న వయస్సులోనే పర్యాటక సంచాలకులుగా చెరగని ముద్ర
నాటి ఎన్నికల వేళ గుంటూరు సంయిక్త కలెక్టర్ గా వినూత్న శైలి
నేతన్న నేస్తం అమలు ద్వారా చేనేతలలో జీవితాలలో వెలుగులు
కరోనా నియంత్రణ ముసుగుల తయారీ, పంపిణీలొ యుద్ద ప్రాతిపదికన చర్యలు
ఏలూరు, మే11: తాజా మార్పులలో భాగంగా జిల్లా సంయిక్త కలెక్టర్గా బదిలీ అయిన హిమాన్హు శుక్లా బుధవారం బాధ్యతలు తీసుకోనున్నారు. లేపాక్షి, ఆప్కో సంస్ధల ఎండిగా, చేనేత జౌళి శాఖ సంచాలకులుగా ఉన్న శుక్లాను ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న అభివృద్ది విభాగపు సంయిక్త కలెక్టర్ గా జిల్లాకు పంపించింది. తొలి ప్రయత్నంలోనే టాప్ ర్యాంకర్గా ఐఎఎస్కు ఎంపికైన శుక్లా తొలిగా 2015 డిసెంబర్లో తిరుపతి సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి 2016 నవంబర్లో పర్యాటక శాఖ సంచాలకులుగా కీలక బాధ్యతలు తీసుకున్నారు. 2017 ఏప్రిల్ 1న ఎపిటిడిసి ఎండిగానూ ప్రభుత్వం ఆయననే నియమించింది. తదుపరి 2019 ఫిబ్రవరి11న గుంటూరు సంయిక్త కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శుక్లాను, ఎన్నికల తదుపరి చేనేత రంగంపై ప్రత్యేక అభిమానాన్ని చూపించే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశాఖకు సంచాలకులుగా నియమించగా అదే సంవత్సరం జూన్ 24న బాధ్యతలు స్వీకరించారు. తదుపరి ఆగస్టు 1న లేపక్షి ఎండిగా పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. డిసెంబర్ లో ఎపి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు సిఇఓ గాను శుక్లాకే ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు ఇచ్చింది. ప్రస్తుతం కరోనా ప్రత్కేక అధికారి గాను హిమాన్హు శుక్లా తనదైన శైలిలో సేవలు అందిస్తున్నారు. నిజానికి కనీసం ఇరవై సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వారు చేసే పదవులను జూనియర్ లెవల్ అధికారిగానే శుక్లా నిర్వహించారు. శుక్లా పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించారనే చెప్పాలి.
సమీకృత పర్యాటక అభివృద్ది అంటే ఏమిటో చేసి చూపారు. విభజన అవాంతరాలను అధికమిస్తూ నవ్యాంధ్రను పర్యాటకాంధ్రగా రూపుదిద్దారు. ప్రధానంగా పర్యాటక రంగ అభివృద్దితో మానవ వనరుల సద్వినియోగం అన్న ఆలోచనకు కార్యరూపం కల్పిస్తూ ఆయన తన పదవీకాలంలో అమలు చేసిన నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చాయి. కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు, ఉపాధి అవకాశాలు దక్కాయి. రెండేళ్ల శుక్లా పదవీ కాలంలో పర్యాటక రంగంలో రూ.5,300 కోట్లు పెట్టుబడులు తరలిరాగా, 25,000 మంది ప్రత్యక్షంగా ఉపాధి పొందారు. ఆయన పదవీ కాలం ప్రారంభం నాటికి 6,700 మాత్రమే అతిధ్య గదులు ఉండగా ఆసంఖ్యను ప్రస్తుతం 14,600కు తీసుకు వెళ్లగలిగారు. పర్యాటక పాదముద్రల పరంగా దేశంలోనే మూడవ స్ధానంలో ఎపి ఉండటం, వారి రాక 15 శాతం మేర పెరగటం, విభజన నాటికి నాలుగు మాత్రమే ఉన్న ఐదు నక్షత్రాల హోటళ్లు పదికి చేరటం, మరో పది నిర్మాణంలో ఉండటం ఇలా శుక్లా తనదైన ముద్రను చూపగలిగారు. ఆ రెండెళ్లలో అంతర్జాతీయ సంస్ధలు, కేంద్రప్రభుత్వం నుండి 36 అవార్డులు పర్యాటక శాఖను వరించగా, వరుసగా రెండు సార్లు కేంద్రం నుండి సమీకృత పర్యాటక అభివృద్ది సాధించిన రాష్ట్రంగా అవార్డులు అందుకోవటం చిన్న విషయం కాదు.
గుంటూరు సంయిక్త కలెక్టర్ గా పనిచేసిన కాలంలో రహదారి ఉల్లంఘనలకు పాల్పడిన వారికి సామాజిక సేవను శిక్షగా విధించే వినూత్న విధానాన్ని తెరపైకి తెచ్చి రాష్ట్ర స్దాయిలో చర్చకు కారణం అయ్యారు, అప్కో ఎండిగా చేనేత కార్మికుల ఆసక్తులను గమనిస్తూ తదనుగుణంగా విధానపరమైన మార్పులకు శ్రీకారం చుట్టారు. నవరత్నాలు అమలులో భాగంగా ఎనభై రెండు వేల కుటుంబాలకు నేతన్న నేస్తం పధకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేసి ముఖ్యమంత్రి మన్ననలు పొందారు. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ ను తీసుకువచ్చే కార్యాచరణ మేరకు అమెజాన్ వంటి సంస్ధతో ఒప్పందం చేసుకుని చేనేత వస్త్రాలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చి, చేనేత కార్మికులు మరింత అదాయం పొందగలిగేలా భరోసా ఇచ్చారు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రజలందరికీ ముసుగులు (మాస్క్) పంపిణీ చేయాలన్న ఆలోచన మేరకు 15 కోట్ల మాస్క్ ల తయారీ వ్యవస్ధకు సమన్వయం వహించి ఇప్పటికే ఏడు కోట్ల మాస్క్ ల పంపిణీని పూర్తి చేసారు. ఈ నేపధ్యంలో బుధవారం జిల్లా సంయిక్త కలెక్టర్ (అభివృద్ది)గా ఆయన భాధ్యతలు తీసుకోనున్నారు. కలెక్టర్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరగనుంది.