ఏ.పి.టి.ఎఫ్ అధ్వర్యంలో కూరగాయలు పంపిణీ

*ఏ.పి.టి.ఎఫ్ అధ్వర్యంలో కూరగాయలు పంపిణీ* వింజమూరు, మే 8 (రిపోర్టర్ - దయాకర్ రెడ్డి): వింజమూరు మండలం జనార్ధనపురం గ్రామంలోని  ఎస్.సి, బి.సి కాలనీలలోని పేద ప్రజలకు శుక్రవారం నాడు అంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏ.పి.టి.ఎఫ్- 1938) ఉపాధ్యాయ సంఘం అధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏ.పి.టి.ఎఫ్ మండల శాఖ అధ్యక్షులు జక్కం.మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి వున్న కరోనా వైరస్ ను నియంత్రించేందుకు మన ప్రభుత్వాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం అభినందనీయమన్నారు. లాక్ డౌన్ విధించడం వలన మన దేశంలో ఈ వైరస్  అధికం కాకుండా కట్టడి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా అటు పాజిటివ్ కేసులు, ఇటు మరణాలు మిగతా దేశాలతో పోలిస్తే మన పరిస్థితులు కొంత మెరుగ్గానే ఉన్నాయన్నారు. ప్రజలందరూ స్వీయ నిర్భంధంలో ఉంటూ తగు జాగ్రత్తలు పాటించడం కూడా ఇందుకు దోహదపడ్డాయన్నారు. కనుక ఈ సమయంలో ప్రభుత్వ అధికారులు అందించే సూచనలు, సలహాలను ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఆచరణలో అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లాక్ డౌన్ సమయంలో కూలీ పనులు అంతంత మాత్రంగా ఉన్నందున పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచేందుకు ఇప్పటికే ఏ.పి.టి.ఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు విరివిగా సేవా కార్యక్రమాలు  నిర్వహిస్తున్నాయన్నారు. బియ్యం, వంట సరుకులు, పౌష్టికాహారం తదితరాలను ఇప్పటికే పలు చోట్ల పంపిణీ చేయడం జరిగిందని, తాజాగా జనార్ధనపురం కాలనీలలో కూరగాయలను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.పి.టి.ఎఫ్ ఉపాధ్యాయ సంఘం నేతలు పర్వతరెడ్డి కొండారెడ్డి, ఎస్.కే.నాయబ్ రసూల్, యం.వెంకట నరసయ్య తదితరులు పాల్గొన్నారు.