సీతారామపురంలో మద్యం విక్రయాలపై మహిళల ఆగ్రహం...

మాయదారి మద్యం మాకొద్దు బాబోయ్... జగనయ్యా మా మొర ఆలకించవయ్యా


... సీతారామపురం, మే 6 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): మాయదారి మద్యం మాకొద్దు, ఆర్ధికంగా మా కుటుంబాలు చితికిపోతున్నాయి, నీ ఇంటి ఆడపడుచుల లాంటి వాళ్ళం చెబుతున్నాం... ఈ మద్యం షాపులను మూసి వేయించయ్యా అంటూ మహిళలు నేరుగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ నిరసనకు దిగిన సంఘటన నెల్లూరుజిల్లా సరిహద్దు ప్రాంతమైన సీతారామపురంలో చోటు చేసుకుంది. గత 3 రోజుల వరకు నగరాల నుండి మారుమూల ప్రాంతాలలో ఉంటున్న ప్రజలు వరకు కరోనా వైరస్ పుణ్యమా అని లాక్ డౌన్ విధించడంతో నివాసాలకే పరిమితమై స్వీయ నిర్భంధం పాటిస్తూ నేటికీ అదే బాటలో పయనిస్తున్నారు. లాక్ డౌన్ షరతులు మద్యం షాపులకు సైతం వర్తించడంతో గత 40 రోజులుగా మద్యం షాపులను ప్రభుత్వం బంద్ చేసింది. ఇంతలోనే ఏం కొంపలు అంటుకుపోతున్నట్లు, మద్యం లేనిదే ముద్ద దిగదన్నట్లు లాక్ డౌన్ ముగియక ముందే ఆఘమేఘాల మీద మద్యం షాపులు తీసేందుకు ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇంకేముంది మందుబాబులు మద్యం షాపుల ముందు బారులు తీరారు. ఒకేసారి అందిన కాడికి ఫూటుగా మద్యం సేవించి చిందులేయడంతో మహిళాలోకానికి చిర్రెత్తింది. ఫలితంగా మద్యం షాపులు మూసేయాలంటూ ధర్నాకు దిగారు. మీ ఆదాయం కోసం మా కుటుంబాలను పావులుగా వాడుకోవడం సబబు కాదంటూ పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లేసి గెలిపించినందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్నావా నాయనా అని వృద్ధులు విలపించారు. నిన్న మొన్నటి వరకు గుట్టుగా కొంపలోనే పడి వున్న తమ బిడ్డలు నేడు మద్యం సేవించి ఇళ్ళ వద్ద కోడళ్ళతో గొడవలకు దిగుతుంటే ఏ తల్లి గుండె అయినా తల్లడిల్లిపోదా అని వారు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా మద్యం ధరల పెంపుపై
 మందుబాబులు కూడా చిర్రుబుర్రులాడుతున్నారు. ఈ విధంగా రోజుకో రకంగా ధరలు  పెంచుకుంటూ పోతుండటం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ధరలు పెంచితే సామాన్యులు మద్యం జోలికి పోరనేది ఒక అపోహ మాత్రమేనని పలువురు తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.