ముమ్మరంగా నీటి ట్యాంకుల క్లోరినేషన్ పనులు

ముమ్మరంగా నీటి ట్యాంకుల క్లోరినేషన్ పనులు


వింజమూరు, మే 8 (రిపోర్టర్- దయాకర్ రెడ్డి): వింజమూరులోని పాతూరు ప్రాంతంలో ప్రజలకు దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేసిన సింటెక్స్ ట్యాంకులలో శుక్రవారం నాడు పంచాయితీ సిబ్బంది క్లోరినేషన్ పనులు చేపట్టారు. ట్యాంకుల పరిసరాలలో ఉన్న చెత్తను తొలగించడంతో పాటు సున్నం, బ్లీచింగ్ పౌడర్ లతో ట్యాంకులను శుభ్రపరిచారు. ఈ సందర్భంగా పంచాయితీ కార్యదర్శి బంకా.శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత కరోనా వైరస్ నేపధ్యంలో గత 50 రోజులుగా పంచాయితీ పరిధిలో రెట్టింపు స్థాయిలో పారిశుద్ద్య పనులను ఉద్యమ తరహాలో నిర్వహిస్తున్నామన్నారు. వింజమూరు మేజర్ పంచాయితీ ప్రత్యేకాధికారిణి, యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ ఆదేశాల మేరకు తాగునీటి పధకాలను పరిశీలిస్తూ, లీకేజీలను అరికడుతూ ప్రజలకు స్వచ్చమైన నీటిని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య పనులకు అవసరమైన సున్నం, బ్లీచింగ్ పౌడర్, హైపోక్లోరైడ్ ద్రావణాలను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుని జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాలపై దృష్టి సారించి పారిశుద్ధ్యమును మెరుగు పరుస్తున్నామన్నారు. ప్రజలందరూ కూడా చెత్తా చెదారమును విచ్చలవిడిగా రోడ్లుపై పడవేయరాదన్నారు. ప్రతినిత్యం పారిశుద్ధ్య కార్మికులు వింజమూరులోని అన్ని ప్రాంతాలకు వస్తుంటారని, చెత్తను వారికి అందించిన పక్షంలో ప్రత్యేక వాహనాల ద్వారా డంపింగ్ యార్డులకు తరలిస్తామన్నారు. ఫలితంగా నివాస గృహాల వద్ద అపరిశుభ్ర వాతావరణమును పారద్రోలవచ్చని పేర్కొన్నారు. ప్రజలందరూ కూడా అధికారుల సూచనలు పాటించాలని కోరారు. లాక్ డౌన్ ముగిసే వరకు కూడా స్వీయ నిర్భంధంలోనే ఉంటూ ఎప్పటికప్పుడు వ్యక్తిగత పరిశుభ్రతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందని ఇ.ఓ శ్రీనివాసులురెడ్డి విజ్ఞప్తి చేశారు.