కంటైన్మేంట్ క్లస్టర్స్ కోర్ ఏరియాలలో ప్రభుత్వ ఫీవర్ శిబిరాలు  మినహా ఎటువంటి వైద్య శాలలను అనుమతి లేదు

     గుంటూరు          , 08 మే 2020:- కంటైన్మేంట్ క్లస్టర్లు, సర్వేలేన్స్, కరోనా వైరస్ పాజిటివ్ రోగుల చికిత్స,                 కోవిడ్ -19 ఆసుపత్రులపై  ప్రత్యేక  దృష్టిపెట్టి, అవసరమైన చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కే.ఎస్. జవహర్ రెడ్డి తెలిపారు.


  శుక్రవారం విజయవాడ నుండి కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై రాష్ట్ర  వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కే.ఎస్. జవహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  ఈ  సందర్భంగా జవహర్ రెడ్డి మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుండి జిల్లాలకు వస్తున్న వలస కార్మికులందరిని ఇన్స్టిట్యూషన్ క్వారంటైన్ కేంద్రాలలోనే వుంచాలన్నారు. వీరిలో అనుమానిత లక్షణాలున్న వారందరికీ పరీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లాలకు వస్తున్న వలస కార్మికులను దృష్టిలో పెట్టుకుని కనీసం వెయ్యి ఐసోలేషన్ బెడ్లు వున్న కోవిడ్ కేర్ సెంటర్లు, ఐదు వేల నుండి ఆరు వేల వరకు బెడ్లు వున్న క్వారంటైన్ ఐసోలేషన్ కేంద్రాలను సిద్దంగా వుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించకుండా రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్దకు వస్తున్న వలస కార్మికులను కట్టడి చేయాలన్నారు.  కంటైన్మేంట్ క్లస్టర్స్ కోర్ ఏరియాలలో ప్రభుత్వ ఫీవర్ శిబిరాలు  మినహా ఎటువంటి వైద్య శాలలను అనుమతించరాదన్నారు. కంటైన్మేంట్ బఫర్ జోన్ లో మాత్రం క్లినిక్ లు మినహా ప్రైవేటు ఆసుపత్రులను వైద్య సేవలు అందించడానికి అనుమతించాలన్నారు. కంటైన్మేంట్ ప్రాంతాలలో అనుమానిత లక్షణాలు ఉన్నవారిని, 60 సంవత్సరాలు దాటి దీర్ఘకాలిక రోగాలు వున్న వారిని గుర్తించి శాంపిల్స్ తీసి పరీక్షించాలన్నారు.  కంటైన్మేంట్ క్లస్టర్స్  యాక్టివిటిస్, శాంపిల్ టెస్టింగ్ వివరాలను ప్రతి రోజు ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు.  


  వీడియో కాన్ఫరెన్స్లో గుంటూరు కలెక్టరేట్ నుంచి పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్ కుమార్  మాట్లాడుత గుంటూరు, నరసరావుపేట కంటైన్మేంట్ ఏరియాలలో గత రెండు మూడు రోజులుగా క్రొత్త కేసులు నమోదు కాలేదని, ఇక్కడ కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో శుక్రవారం పాజిటివ్ కేసులు నమోదు కాలేదని, ఈ రోజు 776 శాంపిల్స్ పరీక్ష చేయగా అన్ని నెగిటివ్ వచ్చాయన్నారు.  జిల్లాకు రావడానికి సుమారు 14 వేల మంది వలస కార్మికులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారన్నారు.  జిల్లా నుండి బీహార్, ఒరిస్సా, జార్ఖండ్  తదితర రాష్ట్రాలకు వెళ్ళడానికి 18 వేల మంది వలస కార్మికులు నమోదు చేసుకోగా వారి వివరాలను స్టేట్ పోర్టల్ లో అప్ లోడ్  చేయడం జరిగిందన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన వెంటనే వారిని తరలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విదేశాల నుండి వచ్చే వారి కోసం హోటల్ యాజమాన్యాలతో మాట్లాడి, పెయిడ్ క్వారంటైన్ కోసం లగ్జరీ రూములు 400, సెమి  లగ్జరీ రూములు 200 సిద్దం చేసి, ధరలు సైతం నిర్ణయించామన్నారు.  కంటైన్మేంట్ క్లస్టర్లలో దీర్ఘకాలిక రోగులతో పాటు, 60 సంవత్సరాలు దాటిన వారందరికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్నారు. ఫీవర్ సర్వే లో గుర్తించిన అనుమానిత లక్షణాలు వున్న వారికి సైతం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.   


  వీడియో కాన్ఫరెన్స్ లో  సంయుక్త కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ మౌర్య నారాపు రెడ్డి, స్పెషల్ కలెక్టర్ బాబురావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డా. యాస్మిన్ తదితరులు  పాల్గొన్నారు.