ఏపీలో కరోనా విజృంభించడానికి జగన్ పాలనా వైఫల్యమే కారణం- ప్రతి పనిలో అవినీతే : నిమ్మల రామానాయుడు   

తేదీః 03-05-20

రంగులకు రూ.2600 కోట్లు ఖర్చు పెట్టారు కానీ.. పేదవారికి సాయం చేసేందుకు జగన్ కు చేతులు రావడం లేదు- ఏపీలో కరోనా విజృంభించడానికి జగన్ పాలనా వైఫల్యమే కారణం- ప్రతి పనిలో అవినీతే : నిమ్మల రామానాయుడు   
         ఏపీలో కరోనా వైరస్ ను నియంత్రించడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. ఈ మేరకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేరళ, తెలంగాణ రాష్ట్రాలు కరోనాను బాగా నియంత్రిస్తున్నాయి. ఇక్కడ మాత్రం అడ్మినిస్ట్రేషన్ వైఫల్యంతో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైసీపీ నేతలే ర్యాపిడ్ టెస్ట్ కిట్ లతో పరీక్షలు చేసుకుని ఎక్కువగా టెస్ట్ లు చేస్తున్నామని  చెబుతున్నారు. మరోవైపు టెస్ట్ ఫలితాలను పెండింగ్ లో పెడుతున్నారు. బాధితులు చనిపోయిన రెండు రోజుల తర్వాత కరోనా పాజిటివ్ ఉందని చెప్పే దుస్థితి ఉంది. సౌత్ ఇండియాలోనే ఏపీలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. రికవరీ తక్కువగా ఉంది. ప్రజలను మభ్యపెడుతున్నారు. రోజూ చంద్రబాబు జపం చేస్తున్నారు. తిత్లీ తుఫాను సమయంలో పక్క జిల్లాలోనే ఉన్న జగన్.. బాధితులను ఎందుకు పరామర్శించలేదని అడిగితే.. సీఎం చంద్రబాబు గారా, నేనా అని మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబు గారు హైదరాబాద్ లో ఉంటే విమర్శిస్తున్నారు. ఏపీ గురించే చంద్రబాబు గారు ప్రతిక్షణం ఆలోచిస్తారు. ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. పేదవారికి రూపాయి సాయం కూడా చేయలేదు. 2 నెలల నుంచి పనుల్లేక కార్మికులు, కులవృత్తిదారులు అనేక అవస్థలు పడుతున్నారు. కేంద్రం ఇచ్చిన వెయ్యి రూపాయలనే పంచారు. వాలంటీర్ల వ్యవస్థను పెట్టుకుని ఉచితంగా ఎందుకు నిత్యావసరాలు సరఫరా చేయలేకపోతున్నారు. రేషన్ ను ఇంటింటికి ఎందుకు అందించలేక పోతున్నారో సమాధానం చెప్పాలి. అప్పుల విషయంలో టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో చంద్రబాబు గారు పాలన చేశారు. నేడు 30వేల కోట్ల అదనపు ఆదాయం వచ్చింది. కేంద్రం నుంచి 4వేల కోట్ల అదనపు నిధులు వచ్చాయి. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ.500 కోట్లు వచ్చాయి. అయినా సాయం చేయడానికి జగన్ కు చేతులు రావడం లేదు.  రేషన్ కూడా రెగ్యులర్ గా ఇచ్చేదే తప్ప.. ఒక్క కేజీ కూడా అదనంగా ఇవ్వలేదు. కేంద్రమే రేషన్ ఇచ్చింది. కందిపప్పుకు బదులు శనగలు ఇచ్చి తమ అసమర్థతను చాటుకున్నారు.  ఆకలి, మనుషుల ప్రాణాల కంటే అవినీతికే జగన్ ప్రాధాన్యత ఇస్తూ తన ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని చాటుకున్నారు. రంగులకు రూ.2600 కోట్లు ఖర్చు పెట్టారు కానీ... పేదవారికి సాయం చేసేందుకు జగన్ కు చేతులు రావడం లేదు. కాంట్రాక్టర్లకు రూ.6,400 కోట్లు కట్టబెట్టారు. టెస్టింగ్ కిట్లలో కూడా రూ.30 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఆర్థిక మంత్రి సోదరుడు హరిహరనాథ రెడ్డి, విశ్వనాథ సుబ్రమణ్యంకు ఈ అవినీతిలో సంబంధం ఉంది. పీపీఈలు, మందులు, మాస్క్ లను రూ.500 కోట్లు పెట్టి కొనుగోలు చేశామన్నారు. ఎక్కడా టెండర్లను పిలవలేదు. వీటన్నింటిపై శ్వేతపత్రం విడుదల చేయాలి. పేదల ఇళ్ల స్థలాల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారు. వినుకొండలో వైసీపీ ఎమ్మెల్యే భూమిని అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. చదును చేయడానికి కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నాం.