ఆన్ లైన్ లో టిడిపి జనరల్ బాడి సమావేశం..

ఆన్ లైన్ లో టిడిపి జనరల్ బాడి సమావేశం..


నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జనరల్ బాడి సమావేశం మంగళవారం ఆన్ లైన్ లో నిర్వహించారు. పోలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ పార్టీ బాధ్యులు, ప్రజా ప్రతినిధులు, జనరల్ బాడి సభ్యులు పాల్గొన్నారు.


గ్యాస్ లీకేజి దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు సంతాపం:
విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటనలో మృతులకు సంతాపంగా 2నిముషాలు మౌనం పాటించారు. మృతుల కుటుంబాలకు టిడిపి జనరల్ బాడి ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. 
ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి టిడిపి ప్రభుత్వమే అనుమతులు ఇచ్చిందనే వైసిపి దుష్ప్రచారాన్ని ఖండించారు.. 


వైసిపి ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ చేశారు. 6దశాబ్దాల క్రితం నుంచి ఏయే ప్రభుత్వాలు ఈ కంపెనీకి భూములు ఇచ్చాయో, అనుమతులు ఇచ్చారో సాక్ష్యాధారాలు ఉన్నాయని, వైసిపి అధికారంలోకి వచ్చాకే పాలి స్టైరీన్ కు, ఎక్స్ పాండబుల్ పాలిస్టైరీన్ విస్తరణకు అనుమతి ఇవ్వడం, కేంద్రానికి సిఫారసు చేసిందనే దానిపై అన్ని రుజువులు ఉన్నాయి. 
విష వాయువుల లీకేజికి కారణమైన కంపెనీకి వత్తాసు పలుకుతూ బాధితులపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. బాధితులకు పూర్తి న్యాయం జరిగేదాకా రాజీలేని పోరాటం చేస్తామని, అక్రమ కేసుల్లో చిక్కుకున్న బాధితులకు అండగా ఉంటామని, దక్షిణ కొరియాలో ఇదేవిధమైన దుర్ఘటనల్లో ఎంత పరిహారం ఇచ్చారో అంత మొత్తం ఇక్కడకూడా ఇప్పించేలా చూడాలని, మృతుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ టిడిపి జనరల్ బాడిలో తీర్మానం ఆమోదించారు. 
ఈ దుర్ఘటనకు జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి నైతిక బాధ్యత వహించాలి. ఎల్జీ పాలిమర్స్ ను తక్షణమే అక్కడనుంచి తరలించాలి. ఆ భూములలో పార్క్ అభివృద్ది చేయాలి. పర్యావరణాన్ని, ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరారు. 


*జనరల్ బాడిలో చర్చించిన అంశాలు -తీర్మానాలు:*


1)విశాఖ దుర్ఘటన మానవ తప్పిదమే.. 20డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉండాల్సిన స్టైరీన్, 130-150డిగ్రీలకు చేరిందంటే అది కంపెనీ తప్పిదమే. సెల్ఫ్ పాలిమరైజేషన్ కు కెమికల్  కలపాల్సివుండగా, అది చేయకుండా వదిలేశారు. ఈ ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాల్సివుండగా, పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, కాలుష్య నియంత్రణ మండలి, ఫోరెన్సిక్ ల్యాబ్ లు పేర్కొన్నాయి. 
అక్కడ పండించే పంటలు తినవద్దని, పాలు తాగవద్దని, గడ్డి పశువులకు వేయవద్దని, అక్కడి రోడ్లపై, ఇళ్లలో ఇంకా 1.7పిపిఎం స్టైరీన్ అవశేషాలు ఉన్నాయని సిఎస్ ఐఆర్- నీరి నిపుణులు చెప్పారంటే విడుదలైన విష వాయువుల తీవ్రత ఎంతో తెలుస్తోంది. వీటన్నింటినీ కప్పిపుచ్చి, విశాఖలో అంతా బాగానే ఉందని వైసిపి మంత్రులు ప్రచారం చేయడాన్ని ఖండించారు. 
మానవ తప్పిదంతో ఒక కంపెనీ 12మందిని చంపేస్తే, దానికి బాధ్యులైన వాళ్లను అరెస్ట్ చేయకుండా, బాధితులపై కేసులు పెట్టడం కన్నా దుర్మార్గం మరొకటి లేదు. 
విశాఖ ప్రజలు ఆ 2రోజులు భయంకరమైన రాత్రులు గడిపారు. ప్రాణాలు అరచేత పట్టుకుని భయంతో ప్రజలు విశాఖ రోడ్లపై పరుగెత్తారు. తలో దిక్కుకు చెల్లాచెదురయ్యారు. పార్కులలో తలదాచుకున్నారు. బాధిత ప్రజానీకంలో విశ్వాసం పెంచే ప్రయత్నం వైసిపి ప్రభుత్వం చేయకపోవడాన్ని ఖండించారు..
ద్రవరూపంలో ఉండే స్టైరీన్  గ్యాస్ రూపంలో ఎలా మారింది..? 500మీటర్ల పరిధి కూడా వ్యాపించలేని గ్యాస్ 3కిమీ-5కిమీ పరిధిలో ఎలా వ్యాపించింది..? సైరన్ ఎందుకు మోగలేదు..? దుర్ఘటన ప్రాంతానికి వెళ్లకుండా, కంపెనీ ప్రతినిధులను విమాశ్రయంలో సీఎం జగన్ ఎందుకు కలిశారనే ప్రశ్నలకు జవాబిచ్చేవాళ్లు లేరు. 


నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా కేసు నమోదు చేసి రూ50కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అదే పని రాష్ట్ర ప్రభుత్వంగాని, ముఖ్యమంత్రి జగన్ గాని ఎందుకని చేయలేక పోయారు..?  దీనిపై విచారణకు నిపుణులతో ఎన్ జిటి కమిటి వేయగా, రాష్ట్ర ప్రభుత్వ కమిటిలో నిపుణులను వేయకపోవడమే వైసిపి నాయకులు చిత్తశుద్ది లేమికి నిదర్శనం.
  
బాధితులు అందరికీ ఒక ఏడాది పాటు వైద్యపరీక్షలు చేయాలని నిపుణులే చెప్పారు. అదే విషయం 3రోజుల ముందే టిడిపి చెబితే దానిపై విమర్శలు చేశారు.
బాధిత ప్రజల ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున , వీరికి ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులు పర్మినెంట్ గా మెయింటైన్ చేయాలని, అవన్నీ సమగ్రంగా పరిశీలించాకే దానిని బట్టి, బాధితులకు నష్ట పరిహారం నిర్ణయించాలి, జరిగిన దుర్ఘటనపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పరిశోధించాలి, దీనిపై సైంటిఫిక్ స్టడీ చేయాలని, దేశవిదేశాల్లో వైద్య నిపుణులను రప్పించి బాధితులకు అత్యున్నత వైద్యం ఇప్పించాలని ఇప్పటికే టిడిపి తరఫున కోరాం. దానిని కూడా వైసిపి నాయకులు  విమర్శించడం దారుణం. 
లీకేజి దుర్ఘటనలో 3కిమీ కంటే ఎక్కువ పరిధిలో విష వాయువులు వ్యాపిస్తే, కేవలం 1 కిమీ పరిధిలోని ప్రజలకే ఆర్ధిక సాయం అందించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గర్హించారు. చిన్న కాలనీలకే ప్రభుత్వ సాయం పరిమితం చేసి మిగిలిన గ్రామాలవాళ్లను వదిలేయడాన్ని గర్హించారు.
విష వాయువులు పీల్చి సింహాచలం నార్త్ రైల్వే స్టేషన్ లో అసిస్టెంట్ లోకో పైలెట్, గార్డు అస్వస్థతకు లోనైతే అదికూడా అబద్దమేనని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పడాన్ని ఖండించారు. రైల్వే ఆసుపత్రి వద్ద రికార్డుల్లో ఉన్నదానిని కూడా అబద్దాలుగా చిత్రించడం హేయం.
 ‘‘మా కుటుంబాల్లో కూడా చనిపోతే బాగుండు, రూ కోటి వస్తాయని’’ బాధితులే అంటున్నారని వైసిపి ఎమ్మెల్యే ధర్మశ్రీ పేర్కొనడం అమానుషం. వైసిపి నాయకుల అమానవీయ ధోరణిని ఖండించారు. 


2) జనం చస్తే చస్తారు, బతికితే బతుకుతారు. కరోనాతో చనిపోయినా 3%మందే కదా అనే తేలిక భావంతో వైసిపి నాయకులు మొండిగా చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా పట్టించుకోకుండా ఈనెల 28నుంచి సిఎం క్యాంపు కార్యాలయాన్ని విశాఖకు తరలించాలని చూడటం హేయం.
కోర్టుల ఆదేశాలను వైసిపి ప్రభుత్వం బేఖాతరు చేస్తోంది. కోర్టులో ఒకటి చెబుతున్నారు, బైట ఇంకోటి చేస్తున్నారు. ప్రభుత్వ భవనాలకు వైసిపి రంగులు వేయరాదని హైకోర్టు తీర్పు ఇచ్చినా నిర్లక్ష్యం చేశారు. 2జీవోలను కొట్టేసినా మూర్ఖంగా  మళ్లీ వైసిపి రంగులే వేస్తున్నారు. 


3)అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులను అభినందిస్తూ తీర్మానం:   కరోనా వైరస్ బాధితులకు ప్రాణాలు తెగించి సేవలు అందిస్తున్న నర్సుల సేవలను కొనియాడారు. వైద్య సేవలు అందించేందుకే తమ జీవితాలను అంకితం చేసిన నర్సుల త్యాగాలు చిరస్మరణీయంగా పేర్కొన్నారు.


4)కరోనా వైరస్ సూపర్ స్ప్రైడర్లుగా వైసిపి నాయకులు మారడాన్ని ఖండించారు. వైసిపి నాయకుల విందులు, ఫ్లెక్సీలతో ట్రాక్టర్ల ర్యాలీలు, బహిరంగ సభలు, ప్రదర్శనలు నిర్వహించి కరోనా వైరస్ వ్యాప్తికి వైసిపి నాయకులే కారణం అయ్యారు. చౌకడిపోల వద్ద, మద్యం షాపుల వద్ద జనం గుంపులుగా పోగయ్యే దుస్థితి కల్పించారు. 
‘‘మీ వల్లనే మా బతుకులు ఇలా మారాయి, మీవల్లే వైరస్ అందరికీ సోకింది’’ అంటూ వైసిపి నాయకులను మహిళలు తరిమికొట్టే పరిస్థితి నెలకొంది. దాతలు ఇచ్చే విరాళాలపై కూడా సీఎం ముద్ర వేసి ఇవ్వాలని ఒత్తిళ్లు చేస్తున్నారు.
లాక్ డౌన్ కారణంగా గత 55రోజులుగా రైతులు, పేదలు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రతి కుటుంబానికి రూ5వేలు ఇవ్వాలని టిడిపి నేతలు 12గంటల దీక్షలు చేసినా ప్రభుత్వంలో స్పందనలేక పోవడాన్ని గర్హించారు. 


5)కాలి నడకన వేల కిమీ నుంచి వస్తోన్న వలస కార్మికులపై నిర్లక్ష్యాన్ని గర్హించారు: పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వలస కార్మికులు కాలినడకన తరలివచ్చే పరిస్థితి వైసిపి ప్రభుత్వం  కల్పించింది. చైన్నై నుంచి శ్రీకాకుళంకు, బెంగళూరు నుంచి రాయలసీమకు, హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు కాలినడకన వచ్చే వలస కార్మికుల యోగక్షేమాలను పట్టించుకోలేదు. 
విదేశాల్లో చిక్కుకున్న వారిని రప్పించేందుకు ఏపికి విమాన సర్వీసులు కూడా నడపలేదు. వీటన్నింటిని ఖండిస్తూ టిడిపి జనరల్ బాడిలో తీర్మానం ఆమోదించారు. వలస కార్మికులను ఆదుకోవాలని, ప్రతి పేద కుటుంబానికి రూ 5వేలు ఆర్ధిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.


6)నవరత్నాల పేరుతో వైసిపి నాయకుల నవమోసాలను ఖండించారు. పేదల సంక్షేమ పథకాల్లోనూ మోసాలకు, దోపిడికి పాల్పడ్డారు.  పేదల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్ లను రద్దు చేశారు. బిసి,ఎస్సీ, ఎస్టీలు, ముస్లింలు, బ్రాహ్మణ,కాపు అగ్రవర్గాల పేదల సంక్షేమ పథకాలను నిలిపేశారు. అన్నా కేంటిన్లు, పండుగ కానుకలు,పెళ్లి కానుకలు, చంద్రన్న బీమా, ఎన్టీఆర్ వైద్యసేవ అన్నీ రద్దు చేశారు. రైతు భరోసా కింద రూ12,500 ఇస్తామని హామీఇచ్చి, అందులో రూ6వేలు కోత పెట్టారు. వైసిపి మోసాలను, దోపిడిని ఈ సందర్భంగా ఖండించారు. 


7)మద్యానికి గేట్లెత్తి, కరోనాపై ఫ్రంట్ లైన్ వారియర్ల శ్రమను బూడిదపాలు చేశారు: గత 55రోజులుగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, పోలీసులు (ఫ్రంట్ లైన్ వారియర్లు) ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ బారినుంచి ప్రజలను కాపాడేందుకు చేసిన శ్రమను బూడిదలో పోసింది వైసిపి ప్రభుత్వం మద్యానికి గేట్లు ఎత్తడం ద్వారా.. ప్రతి నియోజకవర్గంలో మద్యం మాఫియా అరాచకాలు పేట్రేగాయి. నాసిరకం మద్యం బ్రాండ్లు అమ్ముతూ పేదల ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. నాటు సారా తయారీ యధేచ్చగా జరుగుతోన్నా చోద్యం చూస్తున్నారు. 
మద్యం మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా ఇళ్లలోనే 12గంటల దీక్షలు చేస్తున్న మహిళలను టిడిపి జనరల్ బాడి సమావేశం అభినందించింది. నిరసనలు తెలిపిన మహిళలపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అయ్యేలా గుంపులుగా జనాన్ని పోగేస్తూ, మద్యం దుకాణాలను తెరిచినవాళ్లను వదిలేసి, నిరసనలు తెలిపిన మహిళలపై కేసులు పెట్టడాన్ని గర్హించారు. మద్య నిషేధం హామీని చిత్తశుద్దితో అమలు చేయాలని డిమాండ్ చేశారు.


8)విద్యుత్ ఛార్జీలు రెట్టింపు చేయడాన్ని ఖండించారు. ఇప్పటికే ఆర్టీసి ఛార్జీలు పెంచారు, మద్యం ధరలు పెంచారు, ఇసుక, సిమెంట్ రేట్లు పెంచేశారు. తొలి ఏడాదిలోనే వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై పెద్దఎత్తున భారాలు మోపడాన్ని నిరసించారు. పెంచిన ఛార్జీలను ఖండిస్తూ తీర్మానం ఆమోదించారు. 


9) రైతుల వద్ద పంట ఉత్పత్తుల కొనుగోళ్లలో ప్రభుత్వ వైఫల్యాలను ఖండించారు: ధాన్యం, మొక్కజొన్న తదితర ఆహార పంటలు, పత్తి, మిర్చి, పొగాకు, పసుపు వాణిజ్య పంటలు, టమాటా, అరటి, బత్తాయి, పుచ్చ, బొప్పాయి, కర్బూజ పండ్ల ఉత్పత్తులు కొనేవారు లేక రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు. ఆక్వా, సెరికల్చర్ రైతుల్లో నైరాశ్యం నెలకొంది. హార్టీకల్చర్ రైతులను టిడిపి ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇప్పుడీ ఏడాదిలోనే నష్టాల్లో ముంచారు.  వీటిపై అనేక లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వంలో స్పందన లేకపోవడాన్ని గర్హించారు. 
ఖరీఫ్ సేద్యానికి రైతులు సన్నద్దం కావాల్సి ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతాంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 
-నదీజలాల్లో మన హక్కులు కాపాడటంలో వైసిపి ప్రభుత్వం విఫలం అయ్యింది. పోలవరం పనులు నిలిచిపోయాయి. పట్టిసీమపై దుష్ప్రచారం చేశారు, ఆ కాంట్రాక్టర్ కే ఇప్పుడు అన్ని కాంట్రాక్టులు ఇస్తున్నారు. 23ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి 32లక్షల ఎకరాలకు సాగునీరు టిడిపి ప్రభుత్వం అందించగా  ఈ ఏడాదిలో అన్ని పనులను నిలిపేశారు. 


10)తుపాన్ల నుంచి కాపాడే మడ అడవులను ధ్వంసం చేయడాన్ని ఖండించారు.తుపాన్లనుంచి తీర ప్రాంతాన్ని రక్షణ కవచంలా కాపాడే మడ అడవులను కొట్టేసి, పేదలకు ఇళ్ల జాగాలు ఇస్తామనడం హేయం. ఆవ భూముల్లో 560ఎకరాల సేకరణ పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. ఎకరం రూ 7లక్షలు చేయని భూమిని రూ 45లక్షలకు కొని వైసిపి నాయకులు, అధికారులు వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు.
భూముల కొనుగోళ్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని డిమాండ్: 


ఇళ్ల స్థలాల పేరుతో భూముల కొనుగోళ్లలో పెద్దరాకెట్ గా వైసిపి నాయకులు దోపిడి చేస్తున్నారు. ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది. లాక్ డౌన్ లోనూ అక్రమ తవ్వకాలు జరిపి వందలాది టిప్పర్లు, ట్రాక్టర్లతో గ్రావెల్, ఇసుక దోపిడికి పాల్పడ్డారు. ఇసుక, సిమెంటు ధరలు పెంచేసి భవన నిర్మాణ రంగాన్ని దెబ్బతీశారు. 40లక్షల మంది  నిర్మాణ కార్మికుల ఉపాధికి గండికొట్టారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టించి కార్మికులను ఆత్మహత్యల పాలు చేశారు. 
పేదల ఇళ్ల స్థలాల్లో వైసిపి కుంభకోణానికి పాలకొల్లు ఒక ఉదాహరణ.  భూమికి మంచి రేటు ఇప్పిస్తామని, అందులో వాటా ఇవ్వాలని చెప్పి వచ్చిన డబ్బులన్నీ వైసిపి నాయకులే లాక్కున్నారని పాలకొల్లు రైతు కేసులు పెట్టడమే ఇళ్ల స్థలాలకు భూసేకరణలో వైసిపి దోపిడికి ప్రత్యక్ష సాక్ష్యం. 
ఇళ్ల స్థలాలకు భూసేకరణ పేరుతో వైసిపి నాయకుల కుంభకోణంపై విచారణ జరపాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. 


11) ప్రతిపక్షాల నేతలు, కార్యకర్తలు, బాధితులపై తప్పుడు కేసులు ఎత్తేయాలి: ఏడాది పాలనలో టిడిపి నాయకులు, ఇతర ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండించారు. విశాఖ గ్యాస్ లీకేజిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులపై కూడా కేసులు పెట్టడాన్ని గర్హించారు. తక్షణమే ఈ అక్రమ కేసులన్నీ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. 


12) ఉపాధి హామీ పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలి..


 నరేగా కింద టిడిపి హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులకు చెల్లింపులు జరగకుండా వేధింపులకు గురిచేయడాన్ని ఖండించారు. ప్రాధాన్యతా క్రమంలో చెల్లింపులు జరపాలని కేంద్రం చెప్పినా, కోర్టులు ఆదేశాలు జారీ చేసినా నిర్లక్ష్యం చేయడాన్ని గర్హించారు. 


అదే వైసిపి నేతలు గత ఏడాదిలో చేసిన నాసిరకం పనులకు చెల్లింపులు చేయడాన్ని, పనులు చేయకుండానే బిల్లులు చేయడాన్ని ఖండించారు. వంశధార నదిలో రోడ్డు వేయడం, ఇళ్లు లేని చోట్ల రోడ్లు వేయడమే అందుకు ఉదాహరణలుగా టిడిపి నాయకులు పేర్కొన్నారు. 
యనమలకు, పల్లా శ్రీనివాస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు: 
టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు పుట్టిన రోజు సందర్భంగా టిడిపి నాయకులంతా శుభాకాంక్షలు తెలియజేశారు. 


ఈ సందర్భంగా యనమలతో తన సాహచర్యాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ‘‘పార్టీయే మనకు ముఖ్యం, పార్టీ ఉంటేనే మనం అంతా ఉంటామనే’’ నిబద్దతతో యనమల గత 38ఏళ్లుగా పని చేశారు. రాష్ట్రానికి, పార్టీకి సంక్షోభం ఎదురైనప్పుడల్లా తన అనుభవంతో, నిబద్దతతో అండగా నిలిచారని, ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. శాసన సభ్యునిగా పల్లా శ్రీనివాస రావు సేవలను ప్రశంసించారు, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అందుకోవాలని ఆకాంక్షించారు.
 
ఈ సమావేశంలో యనమల రామకృష్ణుడు, టిడిఎల్ పి ఉప నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ, జయ నాగేశ్వర రెడ్డి, జివి ఆంజనేయులు, కడప శ్రీనివాస రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, నూకసాని బాలాజి, గుంటుపల్లి నాగేశ్వర రావు, రామాంజనేయులు, తదితరులు ప్రసంగించారు.