*మొక్కజొన్న బస్తాల మాటున రేషన్ బియ్యం స్మగ్లింగ్* లారీని పట్టుకున్న పోలీసులు...... ఉదయగిరి, జూన్ 28 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యమును అక్రమార్కులు వివిద పద్దతులలో అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా మొక్కజొన్న బస్తాల మాటున రేషన్ బియ్యాన్ని తరలిస్తూ పోలీసులకు చిక్కిన సంఘటన ఉదయగిరి ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే ఉదయగిరి మండలంలోని శకునాలపల్లి సమీపంలో మొక్కజొన్న బస్తాల మధ్యలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే సమాచారం స్థానిక పోలీసులుకు అందింది. వెంటనే అప్రమత్తమైన సి.ఐ ఉప్పాల.సత్యనారాయణ, ఎస్.ఐ జ్యోతిలు నిఘా ఉంచి బియ్యంతో పాటుగా లారీని స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్ కు తరలించారు. విచారణ, పరిశీలన నిమిత్తం ఈ సమాచారమును విజిలెన్స్ అధికారులకు తెలిపామని సి.ఐ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఉదయగిరి ప్రాంతంలో తరచూ ఏదో ఒక చోట అక్రమంగా రేషన్ బియ్యం లారీలు తరలుతూనే ఉన్నాయి. చౌక దుకాణాల నుండి పేదల బియ్యం పక్కదారి పట్టకుండా ఉండేందుకు నిరంతర నిఘా ఉంచాల్సిన సంబంధిత అధికారులు మామూళ్ళ మత్తులో జోగుతున్నారనే విమర్శలు బహిరంగ సత్యమే. ఆ శాఖ తీరు ' నిండా ఉన్న చేపల చెరువుకు కొంగల గుంపును కాపలా పెట్టిన ' చందంగా తయారైందని పలువురు పెదవి విరుస్తున్నారు. డీలర్ల వద్ద నుండి అక్రమార్కులు యధేచ్చగా బియ్యం నిల్వలను పొంది అక్రమ మార్గాల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అక్రమార్జనకు పాల్బడుతున్నారు. లారీలు పట్టుబడిన సమయాలలో బియ్యం ఎక్కడి నుండి అక్రమంగా తరలుతున్నాయనే విషయాలు సంబంధిత రెవిన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకున్న దాఖలాలు చాలా అరుదుగానే ఉంటున్నాయి.