*వింజమూరులో సీనియర్ మేట్ పై సస్పెన్షన్ వేటు* అంతిమ తీర్పు న్యూస్ కు స్పందన..... వింజమూరు, జూలై 10 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): గ్రామాలలో వలసలను నివారించి పేద ప్రజలకు కూడు, గుడ్డ, నీడ కల్పించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక వైపు కోట్లాది రూపాయల నిధులను వెచ్చిస్తుండగా పలువురు అడ్డగోలుగా ఆ నిధులను దిగమింగేందుకు దొడ్డిదారిన చేస్తున్న ప్రయత్నాలకు ఎట్టకేలకు వింజమూరు యం.పి.డి.ఓ కనకదుర్గా భవానీ చెక్ పెట్టి ఉపాధిలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసినట్లయిందని వింజమూరు పంచాయితీ పరిధిలో ఉపాధిహామీ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే వింజమూరులోని పాతూరుకు చెందిన ఉపాధిహామీ మాలకొండస్వామి, పద్మనాధ గ్రూపులకు చెందిన ఉపాధిహామీ కూలీలు గురువారం నాడు యం.పి.డి.ఓ కార్యాలయానికి వచ్చి తాము ఉపాధిహామీ పనులలో కాయకష్టం చేస్తున్నా తమ శ్రమకు తగిన ఫలితం రాకపోగా వారాంతానికి 206 రూపాయలు, 149 రూపాయలు, అంతకంటే దారుణంగా మా అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని యం.పి.డి.ఓకు మొర పెట్టుకున్నారు. తక్షణమే స్పందించిన ఆమె ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ ఇంచార్జ్ ఏ.పి.ఓను పిలిపించి చిచారణకు ఆదేశించారు. విచారణలో సదరు మేట్ బోయిన.రమణయ్య ఉపాధిహామీ పనుల విషయంలో తన స్వార్జితం చూసుకుంటున్న విషయాలు భాధిత కూలీల ద్వారా ఆమె దృష్టికి రావడంతో వెనువెంటనే సదరు మేట్ పై చర్యలు తీసుకున్నారు.