*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.